ప్రపంచంలో ఎవ్వరికీ తెలియక ముందు తామే ప్రజలకు తెలియజెప్పాలనే అత్యుత్సాహంతో టీవీచానెళ్లు నిత్యం తాపత్రయపడుతూ ఉంటాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు.. అందరికంటె ముందు ప్రజలకు తెలియజేయాలని అనుకోవడం మంచిదే. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కో చానెల్ ఈ విషయంలో నెగ్గవచ్చు. కానీ.. అసలు సంఘటన జరగడానికంటె ముందే తాము ప్రజలకు ఆ వార్తను చెప్పేయాలని అనుకుంటే అభాసుపాలవుతారు. అలాగే.. ఏం జరిగిందో కనీసం ప్రాథమిక వివరాలు తెలుసుకోకుండా.. సగంసగం వివరాలు విని ఆ వివరాలతోనే వార్తలు ప్రసారం చేసేస్తే నవ్వుల పాలవుతారు.
మంగళవారం నాడు అలాంటి విషయమే ఒకటి జరిగింది. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కార్డియాక్ సమస్య వచ్చినట్టు, మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన హుటాహుటిన ఆస్పత్రికి బయల్దేరినట్టు ఒక శాటిలైట్ టీవీ న్యూస్ చానెల్ తప్పుడువార్తను ప్రసారం చేసేసింది. చాలా సేపటి తర్వాత వారు తమ తప్పు గ్రహించి.. నాలిక్కరుచుకుని ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రకటనను ఆపేశారు. అంతే తప్ప కనీసం తప్పు ఒప్పుకుని, లెంపలు వాయించుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
ఇంతకూ ఏం జరిగిందంటే.. జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్ సమస్యతో ఆయన విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి మంగళవారం మధ్యాహ్నమే వచ్చారు. ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేసిన వైద్యులు ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచారు. ఒక సాధారణ ఎమ్మెల్సీ అస్వస్థతకు గురికావడం మాత్రమే గనుక.. చానెళ్లకు అందులో పెద్దగా మసాలాల కనిపించినట్లు లేదు. వారు ప్రసారాల గురించి పట్టించుకోలేదు. తమ పార్టీ ఎమ్మెల్సీ, కీలక నేత హరిప్రసాద్ ఆస్పత్రి పాలయ్యేసరికి జనసేనాని పవన్ కల్యాణ్ పరామర్శకు వెళ్లాలని అనుకున్నారు. సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆయన పార్టీ ఆఫీసునుంచి బయల్దేరారు. వెళ్లి పరామర్శించారు.. వైద్యులతో విచారించి తిరిగివచ్చారు. అంతే!
కానీ.. సదరు అత్యుత్సాహపు టీవీ ఛానెల్ వారికి.. పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి బయల్దేరడం మాత్రమే తెలిసింది. అదనంగా ‘కార్డియాక్ సమస్య’ అనే పదం కూడా తెలిసినట్టుంది. ఆ కార్డియాక్ రోగాన్ని వారు ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రికే ముడిపెట్టారు. కార్డియాక్ సమస్యతో పవన్ ఆస్పత్రిలో చేరబోతున్నారంటూ.. పార్టీ ఆఫీసునుంచి బయల్దేరారంటూ బ్రేకింగ్ న్యూస్ వేసేశారు. కొద్దిసేపటి వరకు ఈ తప్పుడు వార్త నడుస్తూనే ఉంది.
దీనిని చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు పెద్దపెట్టున ఆయుష్ ఆస్పత్రి వరకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. అక్కడి గందరగోళం తెలిసిన జనసేన పార్టీ పవన్ పరామర్శకు మాత్రమే వెళ్లినట్టుగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయాల్సి వచ్చింది. ఒక చానెల్ అత్యుత్సాహంతో తప్పుడు ప్రసారం చేయడం వలన.. ఆస్పత్రి వద్ద నానా గందరగోళం, జనం రద్దీ ఏర్పడ్డాయి. ఇలాంటి అత్యుత్సాహాన్ని మీడియా సంస్థలు మానుకోవాలి.
.