ప్రకటనలు (యాడ్స్) మీడియా సంస్థలకు ప్రాణాధారాలు. ప్రధాన ఆదాయ వనరులు అవే. యాడ్స్ లేకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ రూపాల్లోని ఏ మీడియా సంస్థ కూడా మనజాలదు. అందుకే యాడ్స్ కోసం మీడియా సంస్థలు ఎగబడుతుంటాయి. పాఠకులను దేవుళ్లనే మాట నిజమే గానీ.. ప్రకటనకర్తలను మహాదేవుళ్లుగా గుర్తిస్తుంటాయి.
అది అవసరమే. కానీ ప్రకటనల రూపంలో ఏం ప్రచురిస్తున్నామో చూసుకోవాల్సిన అవసరం లేదా? పత్రిక పరువు పోయేలా ఏదో ఒక ప్రకటన వస్తే.. దాన్ని అచ్చొత్తించేస్తారా? ముందూ వెనుకా చూసుకోరా?
‘ఏనుగు నెత్తిన చెత్త వేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు’ అంటారు పెద్దలు. ఎందుకంటే ఏనుగు మనకంటె చాలా ఎత్తుగా ఉంటుంది. దాని నెత్తిన చెత్త వేయడం మన వల్ల కాదు. అందుకే ఏనుగు తన నెత్తిన తానే చెత్త వేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈనాడు దినపత్రిక వ్యవహారం కూడా అదే రకంగా కనిపిస్తోంది. ముందూ వెనుకా చూసుకోకుండా వాళ్లు ప్రచురించిన ఒక యాడ్.. ఆ పత్రిక పరువు తీసేలా ఉంది.
‘ఈనాడు’ ఏపీ ఎడిషన్ ఇవాళ (15 డిసెంబరు బుధవారం) ఒక సరికొత్త రైక (జాకెట్ యాడ్) తొడుక్కుంది. నెట్ఫ్లిక్స్ వారు నెలవారీ రుసుములను తగ్గించారు. ఆ విషయానికి బహుళ ప్రచారం కల్పించుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇచ్చారు. ఈనాడు నెంబర్ వన్ దినపత్రిక కాబట్టి.. ఒక్క ఈనాడు ద్వారా యావత్ తెలుగు ప్రజలను చేరుకోగలమని అనుకున్నారేమో తెలియదు- అందులోనూ ఏపీ ఎడిషన్లో మాత్రం ఈ రైక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ఈనాడు పరువు తీసింది.

ప్రకటనలు పత్రికలకు ఆయువుపట్టే కానీ.. పత్రికలు కూడా తమకు వచ్చే ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. నియమ నిబంధనలకు చాలా విలువ ఇచ్చే ఈనాడు దినపత్రిక ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. ఉదాహరణకు.. పెళ్లి శుభాకాంక్షలు ప్రకటన ఇవ్వాలంటే.. శుభలేఖ కాపీ ఉండాల్సిందే! వ్యక్తి తప్పిపోయినట్టుగా యాడ్ ఇవ్వాలంటే పోలీసులకు కంప్లయింటు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ఉండాల్సిందే. ప్రకటన రూపంలో ఎవడో కాసిని డబ్బులు గుమ్మరించేసి.. ఎవరో మరొకరి పరువుతో ఆడుకోగల ఏ తుంటరి పనికీ తాము వేదిక కాకుండా ఈనాడు జాగ్రత్త తీసుకుంటుంది. ఈ జాగ్రత్తలు ఈరోజుల్లో అందరూ పాటిస్తున్నారు. కానీ నెంబర్ వన్ దినపత్రిక ఇవాళ పప్పులో కాలేసింది. ఒక పత్రికలో ఉండగల ప్రకటనల్లో అత్యధిక మొత్తం టారిఫ్ ఉండే రైక ప్రకటన (2 పేజీల జాకెట్ యాడ్) రాగానే ముందూ వెనుకా చూసుకోకుండా వేసేసింది.
నెట్ఫ్లిక్స్ వారి సదరు ప్రకటనలోని వాక్యాలు ఇవీ..
గుడ్ మార్నింగ్,
ఈ పత్రికలో
మీకు లభిస్తాయి
కొన్ని శుభవార్తలు
మరికొన్ని పనికిరాని పన్స్
మొదటి పేజీ మొత్తానికి కలిపి.. దిగువన నెట్ఫ్లిక్స్ వారి లోగా కాకుండా ఉన్నది ఈ రెండు వాక్యాలు మాత్రమే. జాకెట్ యాడ్ పేజీ తిప్పితే, రెండో పేజీలో
నెట్ఫ్లిక్స్ ఇప్పుడు మొబైల్లో రూ.149/ ఫ్రెండ్స్ అవుదామా మనం?
అనే సంగతి ఉంటుంది.
ఈ ప్రకటన ఎలా అనుమతించారు?
‘‘ఈ పత్రికలో మీకు కొన్ని శుభవార్తలు, మరికొన్ని పనికిరాని పన్స్ లభిస్తాయి’’ అని మరొకరు వ్యాఖ్యానిస్తే దాని అర్థం ఏమిటి? ‘ఈ పత్రిక’ అనగానే.. ఆ వాక్యాలు చదువుతున్న వ్యక్తి చేతిలో ఉన్న పత్రిక అనే అర్థమే స్ఫురిస్తుంది- అంటే ఈనాడు! రెండు పేజీలూ కలిపి ఆ ప్రకటన వాక్యాల సారాంశం ఎలా ఉన్నదంటే.. ‘‘ఈనాడులో మీకు కొన్ని మంచి వార్తలతో పాటు మరికొంత పనికిరాని చెత్త వార్తలు ఉంటాయి. కాబట్టి మేం రూ.149కే నెలవారీ వినోదం అందిస్తున్నాం.. కాబట్టి ఆ చందా మాకు కట్టండి’’ అని! అన్యాపదేశంగా ఈ పత్రికకు నెలకు సుమారు 200 రూపాయలు చెల్లించే బదులుగా మా నెట్ఫ్లిక్స్కు చందా కట్టండి చాలు- అని చెబుతున్నట్టుగా ఉంది.
ఇలాంటి ప్రకటన ఎలా అనుమతించారో అర్థం కావడం లేదు. నెట్ఫ్లిక్స్ వారి ప్రకటన ఇదే అయితే.. పోయేది ఈనాడు పరువు మాత్రమే కాదు. మొత్తం తెలుగు పత్రికల పరువు అనే సంగతిని మనం గుర్తు పెట్టుకోవాలి. తెలుగులో అత్యధిక సర్కులేషన్ గల దినపత్రికగా, తెలుగు పత్రికా జర్నలిజాన్ని అనేక కొత్త పుంతలు తొక్కించిన, దిశానిర్దేశం చేసిన, నవీన పోకడలకు పునాదులు వేసిన అగ్రశ్రేణి దినపత్రిక ఈనాడు- ఇవాళ ఈ ఒక్క ప్రకటనతో తెలుగు పత్రికల పరువును బజార్న పెట్టినట్టుగా ఈ వ్యవహారం ఉంది.

ఖర్మ కాలినది- అనువాదంలో..
ఈనాడుతో సమానంగా పెద్ద వ్యాపార సంస్థలు గుర్తించే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇదే ప్రకటన ఇంగ్లిషులో వచ్చింది. రైక ప్రకటనలకి ఆయా భాషల్లో శ్రీకారం చుట్టిన పత్రికలు ఇవే. ఇప్పటికీ అందులోనే గరిష్ఠంగా జాకెట్ యాడ్స్ వస్తున్నాయి. అదంతా పక్కన పెడితే.. టైమ్స్ లో ప్రకటన లోని వాక్యాలు ఇలా ఉన్నాయి..
Good morning, We’ve added as few pages of good news with not-so-good puns to the newspaper.
ఇదీ ఆ ప్రకటన.
‘‘పత్రికలో ఉండే అంత గొప్పవి కాని కబుర్లకు తోడు, శుభవార్తలున్న కొన్ని పేజీలను మేం జతచేస్తున్నాం’’
అనేది వారి భావం. దానికి తగ్గట్టుగా పేజీ తిప్పితే.. నెట్ ఫ్లిక్స్ చందా రూ.149కే వస్తుందనే కబురు ఉంటుంది. వారు ఉద్దేశించిన అర్థం ఇంగ్లిషులో సరిపోయింది. కానీ తెలుగులోకి అనువదించిన వారు చాలా ఘోరమైన అనువాదం చేశారు. not-so-good ను ‘పనికిరాని’ అనేయడంతోనే పరువు నష్టం!
ముంబయి కేంద్రంగా వచ్చే అనువాద ప్రకటనలతో ఈ ఇబ్బంది ఎప్పుడూ ఉంటుంది. ముంబాయిలో ఎవరు అందుబాటులో ఉంటే వారితో అనువాదం చేయిస్తుంటారు. తప్పొప్పులను సరిచూసే వ్యవస్థ ప్రతిసారీ వారికి అందుబాటులో ఉంటుందో లేదో తెలియదు. ఈ ప్రకటన కూడా అలాగే.. అర్థజ్ఞానంతో అనువాదం చేసిన వారి పుణ్యమాని ఇలా వచ్చేసింది. ముంబాయి యాడ్ ఏజన్సీల లీలా విన్యాసం గనుక.. తెలుగు అక్షరాలు ఉన్న ఫాంట్ కూడా వారు ‘పన్స్’ అంటున్నారో.. ‘వన్స్’ అంటున్నారో అర్థం కాని విధంగా సాగిపోయింది.
also read : రామ్ బాణమ్ : తీన్మార్ మల్లన్న కమలతీర్థం పుచ్చుకోవడం ఏ రకమైన సంకేతాలిస్తోంది?
ఇందులో ప్రకటనకర్తల తప్పు చాలా పరిమితం. ప్రకటన తమ చేతికి అందిన తర్వాత.. దానిని సరిచూసుకోవాల్సిన వ్యవస్థ ఏమైనట్టు? చిన్న డీసీ యాడ్ ఇవ్వాలన్నా కూడా దానికి అనేక ఆధారాలను సేకరించుకునే ఈనాడు, ఇంత పెద్ద ప్రకటనను ‘చూసుకోకుండా’ వేసేసినట్టుంది. ఇలా ‘చూసుకోకుండా’- ఈనాడు విధివిధానాలకు విరుద్ధంగా ఉండే ప్రకటనలు గతంలోనూ కొన్ని దొర్లాయి. కొందరి ఉద్యోగాలను కూడా బలిగొన్నాయి.
ఈ సందర్భంలో- పేమెంట్ ముందే పూర్తయి, యాడ్ మెటీరియల్ చివరి నిమిషంలో ఆఫీసుకు అందినప్పుడు ఇలాంటి పొరబాట్లు జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జరిగిన పొరబాటు చాలా ఖరీదైనది!
అలా ఎందుకు చేయలేదో..
ప్రకటనదారుడు డబ్బు చెల్లించి యాడ్ మెటీరియల్ ఇచ్చినా కూడా.. దానిని ప్రచురించకుండా ఆపడానికి యాజమాన్యానికి హక్కు ఉంటుంది. యాడ్ కు సంబంధించిన నిబంధనల్లో అలాంటి నిబంధన కూడా ఉంటుంది. ఇంకా లోతుగా చూసినప్పుడు కొన్ని మీడియా సంస్థలు కొన్ని రకాల ప్రకటనల్ని ఎప్పటికీ అనుమతించవు. ఈనాడులో లిక్కర్ ప్రకటనలు ఉండవు. అది వారు ప్రకటనల విషయంలోనూ పాటించే నైతిక విలువ. చాలా సంస్థలు తమకు తాము ఇలాంటి కొన్ని నైతిక సూత్రాలు పెట్టుకుంటాయి.
కేవలం సినిమా వార్తలు అందించే ఒక వెబ్ సైట్ ఉంది. వారి సైట్ కు ఆదరణ పీక్స్ లో ఉన్న రోజుల్లో.. రియల్ ఎస్టేట్ ప్రకటనలు వెల్లువలా వచ్చి పడ్డాయి. కానీ ఆ సైట్ యాజమాన్యం సినిమా సంబంధిత ప్రకటనలు తప్ప మరొకటి వేయరాదనే నియమం పెట్టుకుంది. ఆ నియమాన్ని ఇప్పటికీ పాటిస్తోంది. అలాగే పత్రికలు తమ భావజాలానికి విరుద్ధంగా ఉండే ప్రకటనల్ని తిరస్కరించే సందర్భాలు అనేకం. సొమ్ము చెల్లించిన తర్వాతకూడా ఆ సొమ్ములను తిరిగి ఇచ్చేసి ప్రకటనను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కువ డబ్బు చెల్లించడానికి సిద్ధపడినా.. సాక్షి దినపత్రిక వారి ప్రకటనలను వేయడానికి ఇష్టపడదు.
ఇప్పటి సందర్భంలో ఈనాడు చివరి నిమిషంలో ఆ ప్రకటన ఎలాంటి అర్థాన్ని ఇస్తోందో గుర్తించి ఉన్నా కూడా.. యాడ్ ను తిరస్కరించి ఉంటే సరిపోయేది. యాడ్ ప్రచురణ తేదీని మార్చుకుని ఉన్నా సరిపోయేది. కానీ.. అలా జరగలేదు. కించిత్ నిర్లక్ష్యం దొర్లింది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
‘అది యాడ్ కదా.. అందులో ఏం ఉంటే మనకేంటి’ అనే ధోరణితో విస్మరించి ఉంటే మాత్రం చాలా ప్రమాదకరం. ఇవాళ నర్మగర్భాలంకారం వేసి (ఉద్దేశపూర్వకంగా కాకపోయినా) పత్రిక పరువు పోయే ప్రకటన ఇచ్చారు. రేపు డైరక్టుగా నిందలు వేస్తూ ప్రకటనలు ఇస్తారు కదా. జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
‘‘నేను సన్నాసిని.. పిచ్చి సన్నాసిని.. తిక్క సన్నాసిని.. యెర్రి సన్నాసిని..’’ అని ఓ సినిమాలో హీరో చంద్రమోహన్ హార్మోనియం వాయిస్తూ అద్భుతంగా పాట పాడేస్తాడు. అందులో సదరు హీరోకు తెలుగుభాష తెలియదు. తమిళుడు. ఎవరో పాటను అందిస్తే.. అర్థం తెలియక.. రాగయుక్తంగా పాడేస్తాడు. ఇంత పెద్ద దినపత్రిక ఈనాడు అలా ‘తెలియదు- చూసుకోలేదు’ అనే సమాధానాలతో సరిపెడితే బాగుండదు.
.. సురేష్ పిళ్లె

.

Discussion about this post