నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఇందుకు అనుగుణంగా విద్యాభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గౌ..రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు.
గురువారం మద్యాహ్నం తిరుపతి ఆర్.డి.ఓ కార్యాలయంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలు తీరుకు సంబందించి జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు , సత్యవేడు శాసన సభ్యులు కోనేటి ఆదిమూలం , ఎం.ఎల్.సి. భరత్, జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్, జె.సి. (అభివృద్ధి) శ్రీధర్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్, విద్యా శాఖ ఆర్.జె.డి. వెంకట కృష్ణా రెడ్డి, డి.ఇ.ఓ శేఖర్, సమగ్రశిక్ష ఎ.పి.సి. వెంకటరమణా రెడ్డి, లతో కలసి విద్యా శాఖ అధికారులతో మంత్రి సమీక్షను నిర్వహించారు.
ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ విద్యాభివృద్ధి నిమిత్తం ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టడం, నూతన జాతీయ విద్యా విధానం అమలుకు అనుగుణంగా పాఠశాలల మ్యాపింగ్ చేయడం, బడి బయట పిల్లలందరినీ బడికి వెళ్ళేలా చేసేందుకు అమ్మ ఒడి కార్యక్రమం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం పథకం అమలుతో పాటు పాఠశాలల రూపు రేఖలు మారుస్తూ నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సిద్ధం చేస్తున్నామన్నారు.
నూతన విద్యా విదానంలో బాగంగా పాఠశాలల మ్యాపింగ్ వలన ప్రాథమిక పాఠశాలలు ప్రీ-ప్రైమరీ మరియు ఒకటవ మరియు రెండవ తరగతులతో ఫౌండేషన్ పాఠశాలలుగా కొనసాగుతాయని, ఏ పాఠశాల కూడా మూసివేయబడదని తెలిపారు. పాఠశాలల మ్యాపింగ్ లో భాగంగా విధ్యార్థులకు పిల్లల తల్లిదండ్రులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రెండు కి.మీ దూరం ఉన్న పాఠశాలలకు వాహన సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలన్నారు.
ఒకటి నుండి ఐదు తరగతులకు 18 సబ్జెక్టులను ఒకే ఉపాధ్యాయుడు భోదించడం జరుగుతున్నదని, కానీ జాతీయ విద్యా విధానం లో మూడవ తరగతి నుండి 10 వ తరగతి వరకు ప్రతి సబ్జెక్టు కు ఒక సబ్జెక్ట్ నిపుణుడు ఉంటాడని , ఇది పిల్లలకు నాణ్యమైన విద్యలో మెరుగుదల చూపుతుందన్నారు. పాఠశాలలల్లో పిల్లల సంఖ్య పెరిగే కొద్ది మౌలిక సదుపాయాలు, భోదనా ఆద్యాపకుల సదుపాయాలు మెరుగుపడి పాఠశాల , గ్రామాభివృద్ధి జరుగుతుందన్నారు. 12 వ తరగతి వరకు ఒకే పాఠశాలల్లో చదువుతున్నందున బాలికల డ్రాపౌట్ రేటు ఖచ్చితంగా తగ్గుతుందని, 10వ తరగతి తర్వాత విద్యార్థి పట్టణం మరియు మండల కేంద్రాల్లో ఉన్న కళాశాలలకు వెళ్ళనవసరం లేనందున, 12 వ తరగతి వరకు పాఠశాల విద్యనభ్యసించే అవకాశం పిల్లలకు అందుబాటులో ఉంటుందని తద్వారా విద్యార్థి యొక్క విద్యాప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు నూతన విద్యా విధానంతో ప్రయోజనం పొందుతారని , ప్రీ-స్కూల్ ను ప్రోత్సహిస్తున్నామన్నారు.
జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, నూతన విద్యా విధానం ద్వారా 2030 నాటికి పూర్వ ప్రాథమిక విద్య నుండి సెకండరీ విద్య వరకు సార్వత్రీకరణ, 2025 నాటికి నేషనల్ మిషన్ ద్వారా ఫౌండేషన్ లిటరసి స్కిల్స్ సాధించడం, 2030 నాటికి ప్రీ-స్కూల్ నుండి సేకండరీ స్థాయి వరకు 100 శాతం పిల్లల నమోదుతో పాటు, బడి బయటి పిల్లలందరినీ బడికి రప్పించడం ప్రధాన అంశాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం 2020 ముఖ్య లక్ష్యం 1986 సంవత్సరం నాటి 10 + 2 ఫార్మాట్ బదులుగా 5+3+3+4 మార్చడమని, కొత్త విద్యా విధానంలో మూడు సంవత్సారాల అంగన్వాడీ/ ప్రీ- స్కూలింగ్ తో పాటు 12 సంవత్సరాల పాఠశాలల విద్య ఉంటుందని, తద్వారా విద్యార్థి యొక్క విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు.
జిల్లాలో నియోజకవర్గాల వారీగా పాఠశాలల మ్యాపింగ్, ఎగ్జిస్టింగ్ ఎన్రోల్మెంట్ వివరాలను డి.ఈ.ఓ. సమీక్షలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమీక్షలో పి.ఎం.కె పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం, తిరుపతి, చిత్తూరు డిప్యూటీ ఇ.ఓ లు కృష్ణప్ప, పురుషోత్తమ్ , ఇతర సంబందిత అధికారులు పాల్గొన్నారు.
Discussion about this post