కార్తీకం పరమశివుడికి ప్రీతిపాత్రమైన మాసం. ఆ నెలలోనే ఆయన సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం దక్కడం కంటె భాగ్యం ఇంకేముంటుంది. అందుకే.. సుదీర్ఘకాలపు కల- వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందునుంచి ఊరిస్తున్న పదవి- ఎన్నికలలో పడిన కష్టానికి కానుకగా హామీ పొందిన పదవి ఇంకా దక్కకపోతే ఎలా ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్టు బోర్డు అధ్యక్షుడిగా దాదాపు ఖరారు అయిన అంజూరు శ్రీనివాసులు.. ఉత్తర్వుల కోసం, ప్రమాణపూర్తిగా స్వామి సేవలోకి అడుగుపెట్టడం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు కల నెరవేరడం దాదాపు ఖరారు అయినట్టే. కానీ.. అది కళ్లముందు నిజమయ్యేది ఎప్పుడు? అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. కార్తీకమాసంలో ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన చాలా కలలు కన్నారు. ఈ మాసం ఇక కేవలం వారం రోజులు మాత్రమే మిగిలింది. ఈ వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ధర్మకర్తల మండలిని నియమించడం అనుమానమే.
అంజూరు శ్రీనివాసులు ఈ పదవి కోసం రెండున్నర ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఇప్పటికీ ఆ పదవి అంజూరును ఊరిస్తూనే ఉంది. వైసీపీ అధిష్టానం కరుణిస్తే శివయ్య సేవ చేసుకోవడానికి ఆయన ఎదురు చూస్తున్నారు. తిరుమల, కాణిపాకం ఆలయాలకు ధర్మకర్తల మండళ్లను నియమించి.. శ్రీకాళహస్తీశ్వర ఆలయంపై వైసీపీ చిన్నచూపు చూడటం విమర్శలకు తావిస్తోంది.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా రెండున్నర ఏళ్లు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముక్కంటి ఆలయానికి ధర్మకర్తల మండలిని నియమించలేదు. జిల్లాలో తిరుమల తరువాత అంత ఖ్యాతి గాంచిన క్షేత్రం శ్రీకాళహస్తి. అంతటి పేరుగాంచిన ముక్కంటి ఆలయానికి దాదాపు ఐదేళ్ల పాటు ధర్మకర్తల మండలి లేదు.
తెలుగుదేశం హయాంలో 2015లో పోతుగుంట గురవయ్యనాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారు. రెండేళ్ల పాటు ఈ ‘మండలి’ కొనసాగింది. ఆ తరువాత ధర్మకర్తల మండలి నియామకానికి అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినా.. టీడీపీలోని అంతర్గత కారణాలతో ఏకాభిప్రాయం కుదరక నియామకం జరుగలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ధర్మకర్తల మండలిని వెంటనే నియమిస్తారని, జగన్మోహన రెడ్డి తీరును ఎరిగిన అందరూ భావించారు. అయితే అది అమలుకు నోచుకోలేదు. దాదాపు రెండేళ్ల తరువాత అంటే.. ఈ ఏడాది జులైలో సత్యవేడు మండల మాజీ జడ్పీటీసీ బీరేంద్రవర్మను ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ చరిత్రలో మొట్ట మొదటిసారిగా స్థానికేతరులను ధర్మకర్తల మండలి ఛైర్మన్ గా నియమించడంతో స్థానికుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇది గ్రహించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి అధిష్టానం వద్ద తన అసంతృప్తిని తెలియజేశారు. బీరేంద్రవర్మ నియామకంపై అధిష్టానం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానం పునరాలోచనలో పడింది. మరోవైపు బియ్యపు మధును కలవడానికి బీరేంద్రవర్మ ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. ఈ నేపథ్యంలో బీరేంద్రవర్మ ముక్కంటి ఆలయం వైపు కూడా రాలేదు.
ఈ పరిణామాలు ఇలా ఉండగానే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవిపై ఆశ పెంచుకున్న ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అతని సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఆయనకు అండగా నిలబడింది. అంజూరు శ్రీనివాసులుకు న్యాయం చేయాలంటూ బలిజ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు పలువురు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో బియ్యపు మధు నేరుగా అంజూరు శ్రీనివాసులు ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు.
ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పదవిని అధిష్టానం బీరేంద్రదర్మకు కేటాయించినందున రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని ఆయనకు బియ్యపు మధు హామీ ఇచ్చారు. అంజూరు శ్రీనివాసులు అందుకు అంగీకరించలేదు. తాను స్థానికంగానే ఉంటూ ప్రజలకు సేవ, రాజకీయం చేయాలనే ఉద్దేశంతో, రాష్ట్ర పదవిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు జరగాల్సి ఉన్నందున రిజర్వేషన్ మార్పించి.. తనకు ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఆయన ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించారు. ఇందుకు బియ్యపు మధుసూదనరెడ్డి అంగీకరించి అంజూరుకు హామీ ఇచ్చారు.
ఆ తరువాతి పరిణామాల్లో బీరేంద్రవర్మను టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించారు. అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడంతో అంజూరుకు మార్గం సుగమమైంది. ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పదవి అంజూరుకేనని.. ఎమ్మెల్యే బియ్యపు మధు కూడా ఇందుకు అంగీకారం తెలిపినట్లు ముమ్మరంగా ప్రచారం జరిగింది. ఇంతలోనే టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై కొందరు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఇది బీరేంద్రవర్మకు శాపంగా మారింది.
ఈ ప్రభావం ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి నియామకంపై కూడా పడింది. ఈ కారణంగా మండలి నియామకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడమే కాక.. అంజూరు శ్రీనివాసులును కూడా అసంతృప్తికి గురి చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి నియామకంపై ఒక నిర్ణయానికి వచ్చిందని… సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని.. కార్తీక మాసంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఆశావహులు అందరూ ముమ్మరంగా ప్రచారం చేశారు. అయితే కార్తీక మాసం అయిసపోతున్నప్పటికీ మండలిపై ప్రభుత్వం ఇంతవరకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు.
ఇలా ఆలస్యం చేయడం వలన అంజూరు శ్రీనివాసులుతో పాటు.. ధర్మకర్తల మండలి పదవి ఆశించే వారందరూ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధర్మకర్తల మండలిని నియమించి ఉంటే.. ఇప్పటికే కొంతమందికి న్యాయం జరిగి ఉండేదని.. రెండవ ధఫా మరికొందరికి అవకాశం కల్పించి ఉండవచ్చని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
అధిష్టానం ఇకనైనా స్పందించి ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి తగు చర్యలు తీసుకోవాలని వైసీపీ వారు కోరుతున్నారు. లేదంటే పార్టీ విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురి కావడం ఖాయమని ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా అంటున్నాయి. ధర్మకర్తల మండలిని నియమిస్తే ఆలయ అభివృద్ధి కూడా బాగా జరుగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
.

Discussion about this post