శ్రీకాళహస్తి సిఐ చావలి అంజమ్మ ( అంజూ యాదవ్) మహిళపై దౌర్జన్యం చేసిన కేసు కంచికి చేరిందో, అటక ఎక్కిందో తిరుపతి ఎస్పీ తేల్చి చెప్పాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో నిలదీశారు. సెప్టెంబర్ 30 వ తేదీ రాత్రి సిఐ హోటల్ యజమాని హరి నాయుడు భార్య ధనలక్ష్మిని తీవ్రంగా కొట్టి హింసించిందని ఆరోపించారు.
సిఐ దౌర్జన్యం చేసిన వీడియో వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే అన్నారు. 30 వేల రూపాయలు లంచం ఇవ్వనందుకే సిఐ తన భార్యను కొట్టిందని హరి నాయుడు ఆరోపించారని తెలిపారు. మహిళపై సిఐ దౌర్జన్యం దుశ్శాసన పర్వాన్ని గుర్తు చేసిందని మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మీ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేసిందని చెప్పారు.
అయితే స్థానిక ఎమ్మెల్యే బియ్యం మధుసూధన్ రెడ్డి ఒత్తిడికి లొంగిన పోలీసులు కేసును తారు మారు చేసే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే అక్టోబర్ రెండవ తేది డిఎస్పీ బాధితురాలు వద్ద మద్యం సీసాలు దొరికాయని పత్రికల వారికి తెలిపారని గుర్తు చేశారు. అయితే సంఘటన జరిగి రెండు వారాలు అవుతున్నా కేసు అతి గతి లేకుండా పోయిందని చెప్పారు.
దీనితో రాష్ట్ర ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయిందని చెప్పారు. జగన్ పాలన దొంగల రాజ్యంగా మారిందని చెప్పడానికి ఇలాంటి సంఘటనలే సాక్ష్యం అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే అడిగిన వారిపై సిఐడి పోలీసులు కేసులు పెట్టి
అరడందాలు వేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో మహిళా కమిషన్, దిశా చట్టం ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే జగనన్న బుల్లెట్ లా దూసుకుని వస్తారని గతంలో మంత్రి రోజా చెప్పారని అన్నారు. ఇప్పుడు ఆ బుల్లెట్ తుస్సు పోయిందో అసలు గన్నే పేలలేదో రోజా చెప్పాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో హోమ్ శాఖ ఏమయ్యిందో ఆ శాఖా మంత్రి తానేటి వనిత ప్రజలకు తెలపాలని కోరారు.
అసలు బాధితురాలు ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదని చెప్పారు. సిఐ దౌర్జన్యం చేసిందా లేక ధనలక్ష్మి వద్ద మద్యం దొరికిందా, ఎవరి మీద కేసు పెట్టారో ఎస్పీ తక్షణం ప్రకటించాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
.

Discussion about this post