తిరుమలకు పొగాకు రహిత ప్రాంతంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు దక్కేందుకు టిటిడి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే దేవాదాయ శాఖ చట్టం ప్రకారం తిరుమలలో మద్యం, మాంసం, పొగాకు ఉత్పత్తులు కలిగి ఉండడం నేరంగా పరిగణించబడుతోంది. అలిపిరిలో టోల్గేట్ వద్ద కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించి నిషేధిత పదార్థాలు తిరుమలకు చేరకుండా టిటిడి భద్రతా విభాగం చర్యలు చేపడుతోంది.
ఈ విషయంపై భక్తుల్లో మరింత అవగాహన పెంచాలని టిటిడి నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో విజిలెన్స్ సిబ్బందికి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు.
దేశంలో ఇప్పటివరకు జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని మాత్రమే పొగాకు రహిత ప్రాంతంగా డబ్ల్యుహెచ్వో గుర్తించింది. ఆ తరువాత ఈ గుర్తింపు తిరుమల క్షేత్రానికి దక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాన్ కమ్యూనికబుల్(ఎన్సిడి) విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
ఈ నేపథ్యంలో బీడీలు, సిగరెట్లు, ఇ-సిగరెట్లు, పాన్పరాగ్, గుట్కా తదితర పొగాకు ఉత్పత్తులను భక్తులు తిరుమలకు తీసుకురాకుండా విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఈ విషయాలపై భక్తులకు తగిన సూచనలు ఇచ్చేందుకు విజిలెన్స్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
టిటిడి ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజివో బాలిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ సులోచనా దేవి, ఎస్వీ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమ్య సుధ, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నాయక్, సైకాలజిస్ట్ డాక్టర్ అరుణ కలిసి దాదాపు 500 మంది టిటిడి విజిలెన్స్ సిబ్బందికి, అక్టోపస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
ఎవిఎస్వోలు సురేంద్ర, శివయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా, అలిపిరి చెక్ పాయింట్, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 500 మంది సిబ్బందికి తిరుపతిలోని శ్వేత భవనంలో రెండు రోజుల శిక్షణ ప్రారంభమైంది.
.