శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో తొలి ఓపెన్హార్ట్ సర్జరీ
నెలకు 100 సర్జరీలు చేసే దిశగా ఏర్పాట్లు
తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిలో తొలి ఓపెన్ హార్ట్ సర్జరీని వైద్యబృందం గురువారం విజయవంతంగా నిర్వహించారు. టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఆసుపత్రిని అక్టోబరు 11వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. నెల రోజుల్లోనే ఈ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీలు ప్రారంభించారు.
వైఎస్ఆర్ జిల్లాకు చెందిన బాలిక కవితకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడింది. తగినంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో స్థానిక డాక్టర్ల వద్ద చికిత్స పొందుతూ వచ్చారు. గత మూడు నెలలుగా బాలికకు జ్వరం వస్తూ ఉండడంతో పలు దఫాలుగా కడపలోని ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తూ వచ్చారు.
బాలికకు పలు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెకు ఇన్ఫెక్షన్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న బాలిక తల్లిదండ్రులు తిరుపతిలో టిటిడి ఏర్పాటుచేసిన చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చారు.
బుధవారం బాలికను అడ్మిట్ చేసుకుని వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెకు ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చడంతోపాటు ఇన్ఫెక్షన్ తొలగించడానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుని గురువారం ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం నాలుగు గంటల పాటు శ్రమించి బాలికకు ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం బాలిక ఐసియులో వైద్యసేవలు పొందుతోంది.
ఆసుపత్రిలో తొలి ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ శ్రీనాథ్రెడ్డి, డాక్టర్ గణపతి సుబ్రమణ్యం, డాక్టర్ అశోక్, డాక్టర్ విజిత, డాక్టర్ మధు యాదవ్ బృందాన్ని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే నెలకు 100 సర్జరీలు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
.
Discussion about this post