ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకూ ఈపీఎఫ్, ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించాలని తూర్పు రాయలసీమ పీడీఎఫ్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శాసనమండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు ప్రభుత్వం నుంచి అందేలా కృషి చేసేందుకు అకుంఠిత దీక్షతో పని చేస్తారని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన శ్రీకాళహస్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు పట్టభధ్రులను, ఉపాధ్యాయులను కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా ప్రైవేటు పాటశాలల్లో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు.
70 శాతానికి పైగా ఉన్నత విద్యా సంస్థలలో అధ్యాపకులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఉన్నత చదువులు చదివిన వీరికి అన్ స్కిల్డ్ లేబర్ కు ఉన్న కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని వాపోయారు. తాను ఎమ్మెల్సీగా గెలుపొందితే వారి సమస్యలు పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని తెలియజేశారు. చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులను ప్రభుత్వం గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇస్తోందని… ఈపీఎఫ్, ఈహెచ్ఎస్ సౌకర్యాలు కూడా కల్పిస్తోందని అన్నారు.
కానీ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇవేమీ లేవన్నారు. ఉద్యోగ భద్రత అసలే లేదని వాపోయారు. ప్రతి ప్రైవేటు స్కూల్ ప్రభుత్వ గుర్తింపు ఉందనీ, యూడీఎస్ఐఈ కోడ్ ఆధారంగా ఆయా పాఠశాలల వివరాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పొందుపరిచారని తెలియజేశారు. అయితే అక్కడ పని చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకుల పేర్లు మాత్రం నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేటులో పనిచేసే ఉపాధ్యాయులందరి పేర్లు డీఈవో కార్యాలయం తమ వెబ్సైట్ లో నమోదు చేయాలని… గుర్తింపు నంబరుతో పాటు, గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని డిమాండు చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు ఉపాధ్యాయులకు ఈపీఎఫ్, ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించాలనీ, ఏదైనా కారణాలతో చనిపోతే ఆ కుటుంబానికి రూ.7.5 లక్షలు ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా ప్రభుత్వం, మేనేజ్మెంట్ ఇద్దరి సహకారంతో రూ.వెయ్యి కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో వీరిని ఆదుకోవాలన్నారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆత్మగౌరవం, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో ప్రభుత్వానికి ఇప్పటికే శాసనమండలిలో పీడీఎఫ్ మ్మెల్సీలు తమ వాణిని బలంగా వినిపించారన్నారు.
ఇకపై కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమస్యలను అధిగమించే దిశగా తాను అడుగు వేస్తున్నానన్నారు. పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం శ్రీకాళహస్తి రూరల్ మండలం పల్లం, పంగూరు, ఏర్పేడు మండలంలోని వ్యాసాశ్రమం, బండారుపల్లి, మునగల పాల్యం, పాపానాయుడుపేట, పెద్ద అంజిమేడు ప్రాంతాల్లో పర్యటించి ఉపాధ్యాయులను, పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలోయూటీఎఫ్ నాయకులు సూర్య ప్రకాష్, జి.శ్రీనివాసులు, శివకుమార్, హేమాంబరధరరావు, దామోదరం శెట్టి, సీఐటీయూ నాయకులు అంగేరి పుల్లయ్య, షరీఫ్, గంధం మణి, పెనగడం గురవయ్య, గురవారెడ్డి, నాధముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.