చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండల తహసీల్దారు పరమేశ్వరస్వామి మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈయనతో పాటు ఇదే కార్యాలయంలో పని చేసే కొంతమంది వీఆర్వోలతో పాటు… సర్వేయరుపై చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో రెండు లేదా మూడు రోజుల్లో తేలిపోనుంది.
తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని రెవిన్యూ శాఖ వారు అడ్డుగోలుగా పరాధీనం చేశారు. ఈ అక్రమాలపై పత్రికల్లో పలు కథనాలు ప్రచురితం అయ్యాయి. అంతేగాకుండా తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయంలో జరిగే అవినీతిపై కొందరు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు జరిపారు.
సుమారు 24 గంటల పాటు అనగా శనివారం మధ్యాహ్నం 2గంటల వరకు రికార్డులు పరిశీలించారు. తహసీల్దారు పరమేశ్వరస్వామి, డిప్యూటీ తహసీల్దారు సంధ్యారాణి, సర్వేయరు రవిశేఖర్ తో పాటు వీఆర్వోలను సుదీర్ఘంగా విచారించారు. ఈ సందర్భంగా పలు అక్రమాలు వెలుగు చూసినట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి పరాధీనం చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఏసీబీ అధికారుల తనిఖీలు సందర్భంగా తొట్టంబేడు మండలానికి చెందిన పలువురు బాధితులు స్వచ్చంధంగా వచ్చి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

తొట్టంబేడు రెవిన్యూ ఉద్యోగులు డబ్బుకు ఆశపడి ప్రభుత్వ భూమి విచ్చలవిడిగా పంచేసినట్లు తెలిసింది. అంతేగాకుండా ప్రభుత్వ భూమిని రికార్డులు తారుమారు చేసి ప్రైవేటు భూమిగా కూడా మార్చినట్లు ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయట పడినట్లు తెలిసింది. కాలువ పొరంబోకు, చెరువు పొరంబోకు భూములను కూడా సెటిల్ మెంటు భూమిగా మార్చి కొందరికి ఇచ్చేశారు. వారు ఆ భూమిని విక్రయించిన తరువాత ఆ భూమి వివరాలను ఆన్ లైన్ లో లేకుండా చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
తొట్టంబేడు పంచాయతీ పరిధిలో సర్వే నెంబరు:42లో 20.25 ఎకరాలు, సర్వే నెంబరు:43-8లో 0.40 ఎకరాలు… మొత్తం 20.65 ఎకరాల విస్తీర్ణంలో ఈదులగుంట చెరువు ఉన్నట్లు రెవిన్యూ రికార్డుల్లో ఉంది. అయితే తొట్టంబేడు రెవిన్యూ అధికారులు ఈ రికార్డులు తారుమారు చేసి సర్వే నంబరు:42-8లో 0.29 ఎకరాలను (శ్రీకాళహస్తి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న స్థలం) శ్రీకాళహస్తి మండలం అక్కుర్తికి చెందిన పసల హనుమంతరావు అనే వ్యక్తికి సెటిల్ మెంటు పట్టా (ఖాతా నెంబరు:45) ఇచ్చారు. ఈయన ఈ స్థలాన్ని శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తికి చదరపు గజం రూ.4,300 వంతున 19 సెంట్లను రూ.39.55లక్షలకు గత ఏడాది మే 6న.. మిగిలిన 10 సెంట్ల స్థలాన్ని గత ఏడాది జూలై 5న రూ.20.82లక్షలకు విక్రయించినట్లు తెలిసింది.
ఈ స్థలం విక్రయించిన తరువాత ఈ భూ వివరాలను రెవిన్యూ వారు ఆన్ లైన్ నుంచి తొలగించారు. ఏసీబీ అధికారుల విచారణలో ఈ అక్రమం వెలుగు చూసినట్లు తెలిసింది. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇక తొట్టంబేడు పంచాయతీ పరధిలోని పద్మాలయ చెరువులో కూడా కొంత భూమిని గురవయ్య అనే వ్యక్తి పేరున ఇచ్చినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇలాంటి అక్రమాలు పలు బయట పడటంతో తహసీల్దారు పరమేశ్వరస్వామిపై చర్యలు తప్పవనే అభిప్రాయం పలువురు అంటున్నారు.
మొత్తం మీద తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయం మీద ఏసీబీ అధికారులు దాడులు చేసి… తనిఖీలు చేయడం… అధికారులను విచారించడం.. రికార్డులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఇకనైనా ఈ కార్యాలయ అధికారుల తీరు మారుతుందేమోనని ప్రజలు భావిస్తున్నారు.
.