అవినీతి జరిగిందని విచారణ జరుగుతోంటే.. అందులో ఏదో ఒక సంగతి తేలితే.. దానిని ఆమోదించడమూ, వ్యతిరేకించడమూ ఒక ఎత్తు. అసలు విచారణే జరగడానికి వీల్లేదని కోర్టును ఆశ్రయించి, స్టే ఉత్తర్వులు తీసుకురావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. విచారణకు, కనీసం పబ్లిక్ డాక్యుమెంట్ గా పరిగణించే ఎఫ్ఐఆర్ కు సంబంధించిన వివరాలేవీ పత్రికల్లో రాకుండా హైకోర్టునుంచి పిటిషన్లు వేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అలాంటి అక్రమార్కులకు చెక్ పడింది.
అమరావతి అక్రమాలకు సంబంధించి ఏసీబీ దర్యాప్తుకు సంబంధించి గాగ్ ఆర్డర్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ పిటిషన్ తర్వాతి విచారణ జనవరి నెలాఖరులో ఉంటుందని, అప్పటిదాకా ఈ కేసును ఫైనల్ చేయవద్దని హైకోర్టును ఆదేశించింది.
‘‘నేరం జరిగిన తర్వాత దర్యాఫ్తు జరగకూడదా? విచారణ వద్దు, పత్రికల్లో కథనాలు వద్దు అని ఆదేశించారు. ఈ కేసులో అసలు ముందడుగు పడకూడదా? మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ ఒక్కరే కోర్టును ఆశ్రయిస్తే 13మందికి ఆర్డర్స్ వర్తింపజేయడం ఎలా కరెక్టు? అప్పటిదాకా కేసు వివరాలు ఎందుకు బయటకు రాకూడదు.. అంటూ హైకోర్టు తీరు గురించి ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ సుప్రీంకోర్టు ఎదుట తన వాదనలు వినిపించారు. దీంతో ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్పై సుప్రీం స్టే ఇచ్చింది.
అక్రమార్కులకు గుబులే
అమరావతి భూముల విషయంలో అనేక మంది అక్రమాలకు పాల్పడ్డారు. అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం సహకారంతోనే అనేక అక్రమాలు జరిగాయని.. ఇలా భూ అక్రమాలకు పాల్పడిన వారిలో అనేక మంది పెద్దలు కూడా ఉన్నారని జగన్ సర్కారు తొలినుంచి ఆరోపిస్తూనే ఉంది. మంత్రి వర్గ ఉపసంఘం ఈ లావాదేవీలను అధ్యయనం చేసిన తర్వాత.. ఇచ్చిన నివేదికను అనుసరించి ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు వెళ్లడంతో గాగ్ ఆర్డర్ వచ్చింది.
ఇప్పుడు సుప్రీం తీర్పుతో.. కేసు విచారణ వేగంగా నడిచే అవకాశం ఉంది. ఏసీబీ విచారణలో భాగంగా వెల్లడయ్యే వివరాలన్నీ కూడా మీడియాలో పతాక శీర్షికలు వచ్చే అవకాశమూ ఏర్పడింది. అప్పటి భూబాగోతాలన్నీ విపులంగా ప్రజలకు తెలిసివస్తాయని పలువురు అనుకుంటున్నారు.
.