తనపైకి రాళ్లు రువ్వినా, పైకెక్కి తొక్కినా, తనలో వికసించిన మొగ్గలను తుంచినా దేనికీ చలించకుండా ప్రేమతో పండ్లను, పుష్పాలను, చల్లని నీడను అందిస్తాయి వృక్షాలు.
ఎవరు అడిగినా, అడగకపోయినా పురివిప్పి నాట్యంచేసి నయనానందకరం చేసి తన షడ్జమస్వరంతో పరవశింప చేస్తుంది నెమలి.
తను నల్లగా ఉన్నా కలతచెందకుండా కమ్మని గాత్రంతో సృష్టిలోని సకల జీవులకు వినసొంపైన పంచమస్వరాన్ని వినిపించి మధురానుభూతిని కలిగిస్తుంది కోకిల.
తనకు అనంతమైన సామ్రాజ్యమున్నా ఏ మాత్రం అహంకార ఛాయలు చూపకుండా ప్రశాంతమైన చిత్తముతో మనపైకి వర్షామృత బిందువులు కురుపిస్తుంది సముద్రం.
అనంతకోటి బ్రహ్మాండంలో అవిశ్రాంతంగా అడుగులు వేస్తున్నా అలసట చెందక వినమ్రతతో, విధిగా ఏ ఫలాపేక్ష లేకుండా మనకు వెలుతురును, వేడిని, చల్లదనాన్ని అందిస్తాయి స్వయం ప్రకాశకాలైన నక్షత్రాలు, అప్రమేయంగా చలించే గ్రహాలు.
తనపైకి ఉమ్మినా, తనలోకి రంధ్రాలు దించినా, తనమొహం పైకి విషపు గుళికలు గుమ్మరించినా మధనపడకుండా, విసుగుచెందకుండా, సహనంతో మనకు ఆహారాన్ని అందిస్తోంది పుడమి తల్లి.
శ్వాస ఆగిపోతుందేమోనని గాలి, గొంతెండిపోతుందేమోనని నీరు, చీకటి ఆవహిస్తుందేమోనని నిప్పు, పట్టుతప్పి నడక సడలిపోతుందేమోనని పుడమి, ఆనంతమైన ఆనందం ఆవిరైపోతుందేమోనని ఆకాశం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి నిరంతరం నీడవలె మన వెంటే ఉండి మనల్ని సంరక్షిస్తుంటాయి.
సృజనాత్మకత, సహజ సంపద, సౌందర్యం, సహనం, సేవాగుణం, తదితర ప్రత్యేక లక్షణాలున్న వృక్షాలు, పక్షులు, పంచభూతాలు ఏమాత్రం మిడిసిపడకుండా వినమ్రతతో, విధేయతతో, నిస్వార్థంతో, బాధ్యతతో, మౌనంగా సకలసృష్టికి ఉపయోగపడుతుంటే…
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలతో ప్రకృతిపై విషం చిమ్ముతూ వినాశనానికి పాల్పడడమే కాకుండా, ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ సాటి జీవులకు హాని కలిగిస్తూ వికటాట్టహాసం చేస్తున్నాడు మనిషి.
అసలు రెప్పపాటు…
పంచభూతాలు స్తంభించినా, పుడమి తల్లి ప్రకోపించినా, సముద్రం ఉప్పొంగినా, వృక్షాలు పత్ర, పుష్ప, ఫలాలు ఇవ్వకపోయినా, పశుపక్షాదులు సహకరించపోయినా క్షణంపాటు భువిలో మనుగడ సాగించలేడు మనిషి.
ఏ ప్రత్యేకతలు లేని, ఎవరికీ ఉపయోగపడని, అల్పజీవి అయిన ఓ అర్భకుడా!
ఎందుకీ మిడిసిపాటు?
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
Discussion about this post