గణేశ్ నిమజ్జనం పేరుతో.. నగరం నడిబొడ్డున ఉండే హుసేన్ సాగర్ ను కాలుష్య కాసారం చేసేయడం ఈ ఏడాది కుదరదు. భవిష్యత్తులో మళ్లీ కుదరకపోవచ్చు. ‘‘అందమైన, శుభ్రమైన హుసేన్ సాగర్’’ అనే స్వప్నం తొందరలోనే తీరవచ్చు.
హైదరాబాదులో గణేశుడి నిమజ్జనం విషయంలో ఈసారి హైకోర్టు చాలా కఠినంగా వ్యవహరించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలు, సింథటిక్ రంగులు పూసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వీల్లేదని హుకుం జారిచేసింది. జీహెచ్ఎంసీనే సాగర్ కాలుష్యానికి కారణం అవుతోందని, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృథా చేస్తున్నదని అక్షింతలు వేసింది. ప్రభుత్వం తరఫునుంచి పదేపదే విన్నవించుకున్నా.. ససేమిరా అంటూ.. కావాలంటే సుప్రీం కోర్టుకు వెళ్లండి అని కూడా ఆదేశించింది. కోర్టు నిర్ణయం కఠినంగానే ఉన్నప్పటికీ.. హుసేన్ సాగర్ పరిరక్షణ విషయంలో చాలా మంచి నిర్ణయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి ఏటా గణేశ్ నిమజ్జనం రూపంలో వందల కొద్దీ పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల హుసేన్ సాగర్ సర్వనాశనం అయిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సాగర్ శుభ్రపరచడం పేరిట వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదే గానీ.. శుభ్రత మాత్రం ఎన్నేళ్లు గడుస్తున్నా కనిపించడం లేదు. ప్రతి ఏటా.. నిమజ్జనాలకోసం హుసేన్ సాగర్ ను పణంగా పెడుతున్నారు. ఈ ఏడాది మాత్రం హైకోర్టు ఎట్టిపరిస్థితుల్లోనూ పీఓపీ విగ్రహాల నిమజ్జనం అక్కడ జరగకుండా ఆదేశాలు ఇచ్చింది.
ఈ తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు సూటిగా సంధించిన ప్రశ్నలు చాలా కీలకమైనవి.
కేవలం నిమజ్జనాలకోసం జంటనగరాల్లో 25 బేబీ పాండ్స్ ఏర్పాటు చేసినట్లుగా ప్రభుత్వం చెబుతున్నది గానీ.. అదంతా డొల్ల మాట! బేబీపాండ్స్ వద్దకు చేరుకోడానికి సరైన దారి సౌకర్యం లేదని బుకాయించడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. వాస్తవాలను ప్రభుత్వం దాచిపెడుతోందంటూ అక్షింతలు వేసింది. కొవిడ్ కారణంగా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేమని అన్నదానికి కూడా కోర్టు ఒప్పుకోలేదు. పీఓపీతో విగ్రహాలు తయారుచేసి, ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయాలని పురాణాల్లో ఎక్కడాలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
హైకోర్టు తీర్పు అనంతరం- నిమజ్జనానికి ఏం చేయాలనే విషయంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. తీర్పునకు అనుగుణంగా వెళ్లాలనే అభిప్రాయమే వ్యక్తమైనట్లు సమాచారం. సుప్రీంకు వెళ్లినా ఫలితం ఉండదనే అభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది.
ఇది శ్రీకారం..
హుసేన్ సాగర్ శుభ్రత విషయంలో వందల కోట్ల రూపాయల ఖర్చు ఇప్పటికే జరిగింది. అయితే.. ఆ ఖర్చు సాధించలేని ఫలితాన్ని ఈ హైకోర్టు తీర్పు సాధించే అవకాశం ఉందని పర్యావరణ వాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇది ఇరవయ్యేళ్లుగా నలుగుతున్న సమస్యే. ప్రతిసారీ.. ఏదో ఒకరకంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూపకుండా దాటవేస్తూ వస్తోంది.
ఈ సమయానికి ఈ నిర్ణయం కొంత చేదుగా అనిపించవచ్చు గానీ.. హుసేన్ సాగర్ శుభ్రత విషయంలో చిత్తశుద్ధితో ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి దీనివలన ఆనందమే కలుగుతుంది. తమ మీదకు నెపం రాకుండా.. నిమజ్జనం అక్కడే జరిగి తీరాలని పట్టుబట్టే గణేశ్ భక్తులు తమను నిందించకుండా.. దీన్ని కట్టడి చేయడం ప్రభుత్వానికి సాధ్యమవుతుంది.
ఈ ఒక్క ఏడాది పూర్తిగా కట్టడి చేసి కఠినంగా వ్యవహరిస్తే.. మరో రెండు మూడేళ్లలో హుసేన్ సాగర్ పూర్తిగా శుభ్రమవుతుందునే ఆశ కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది.
.