Warning: Undefined array key "pt-cv-view-type" in /home/adarsini/public_html/wp-content/plugins/content-views-query-and-display-post-page/includes/block_view.php on line 112
ఘంటసాల చెప్పుకున్న సొంత కథ- 2:
ఇటువంటి నిరుత్సాహ పరిస్థితులలో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి దర్శనం చేసేను. శ్రీ శాస్త్రిగారు సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ఉన్నారు. శ్రీ శాస్త్రిగారిని ఆ ప్రాంతంలో అందరూ వారు సాలూరు చిన గురువుగారనేవారు (వారి తండ్రిగారు పెద్ద గురువుగారు).
సాలూరు గ్రామంలో అంతకు పూర్వం చాలాకాలం నుంచి సంగీత పాఠశాల నెలకొల్పి ఎంతోమంది విద్యార్ధులకు ఉచితంగా సంగీత విద్య ఉపదేశిస్తూ ఉండేవారు. శ్రీ శాస్త్రిగారు విజయనగర సంగీత కళాశాలలో ప్రవేశించి అప్పటికి కొద్దికాలమే అయింది.
శ్రీ శాస్త్రిగారు నాచేత పాడించి, నా గాత్రం విని ఎంతో ముగ్ధులయేరు. నన్నూ నా పరిస్థితులని తెలుసుకొన్నారు. సంగీత విద్య యెడల నాకు గల తీవ్రమైన ఆకాంక్షను అర్థం చేసుకొన్నారు. నన్ను సర్వవిధాలా ప్రోత్సహించి నాలో ధైర్యం కలిగించేరు. శ్రీ శాస్త్రిగారి గానం, వారి మూర్తిమంతం, సౌమ్యత నన్ను ప్రబలంగా ఆకర్షించేయి. ‘‘గురువు’’ అన్న మాట శ్రీ శాస్త్రిగారి యెడలనే సార్ధకమయిందనిపించింది. నాటినుండే వారి సన్నిధిలో సంగీత సాధన ప్రారంభించేను.
విజయనగరంలోని ఇంగ్లీషు, సంస్కృతం, సంగీత కళాశాలల విద్యార్థులకు కొన్ని వందల మందికి మహారాజావారి సత్రంలో భోజన వసతి కల్పించబడింది. నేను సంగీత కళాశాలలో ప్రవేశించి, సత్రంలో భోజనపు యేర్పాటు అయే పర్యంతరం జీవితం గడపడం ఏవిధంగా అనే సమస్య యేర్పడింది.
ఆనాటికి యింకా సంస్కృత విద్యార్ధులు, మధుకరం చేయడం, వారాలు చేసుకొనడం అనేది చాలా సహజం అనే భావింపబడుతూ ఉండేది.
మొట్టమొదటి మధుకరపు జోలె భుజాన వేసుకొని తిరిగిన ఆ రోజు అనుభవం ఎన్నటికీ మరపురాదు.
ఏమైనా నాడు యే తల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆ వాత్సల్య పూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తునే ప్రసాదించింది.
సెలవలు పూర్తి అయిన తరువాత నేను సంగీత కళాశాలలో ప్రవేశించడం జరిగింది. నాటి సంగీత కళాశాల ప్రిన్సిపాలు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు నా సంగీత జ్ఞానం పరీక్షించి, నా గాత్రం సుశరీరంగా నిర్ణయించి నన్ను గాత్ర సంగీతమే సాధన చేయవలసిందిగా ప్రోత్సహించేరు. లేని పక్షంలో నేను వయొలిన్ విద్యార్ధిగా చేరి ఉండేవాడినేమో. ఆ రోజుల్లో ఆ వాతావరణంలో శ్రీ నాయుడు గారి శిష్యులని అనిపించుకోవడం గొప్పగా భావింపబడేది.
మా గురువులు సీతారామశాస్త్రి గారి సమక్షంలో ఆరు సంవత్సరములు దీక్షగా శాస్త్రీయ సంగీతం అభ్యసించి కళాశాల పరీక్షనిచ్చి పూజ్యులు ద్వారం వెంకట స్వామినాయుడు గారి నుండి కళాశాల పట్టం పొందేను. విద్యార్ధి దశలోనే గవర్నమెంటు సంగీత పరీక్షలలో హయ్యరు పరీక్షలో కూడా ఉత్తీర్ణుడనయ్యేను.
మా గురువుల ఉపదేశ మహాత్మ్యం వలన సంగీత విద్య లక్ష్య, లక్షణము లేకుండా కాకుండా నాదశుద్ధి, శృతిశుద్ధి ఏర్పడ్డాయి. గురువుగారు విద్యార్థులలోని భావనాశక్తిని, నిర్మాణాత్మక శక్తిని, స్వాతంత్రాన్ని, రసదృష్టిని ప్రోత్సహించేవారు. వారి ప్రభావము వలననే భవిష్యత్తులో నా సంగీతానికి ఒక విశిష్ట ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడ్డాయి.
నేను సంగీత కళాశాల విడిచిపెట్టిన నాటికి ప్రస్తుతం, విజయవాడ సంగీత కళాశాల అధ్యక్షులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, వీణ విద్వాంసులు శ్రీ అయ్యగారి సోమేశ్వరరావు, హైదరాబాదు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ నూకల చిన సత్యనారాయణ, శ్రీ జనగాం ఆంజనేయులు మొదలగు నేటి సుప్రసిద్ధ విద్వాంసులు చాలామంది విద్యార్థి దశలోనే ఉండేవారు.
సంగీత కళాశాల పట్టం పొంది విజయనగరం విడిచిపెట్టే తరుణంలో సుప్రసిద్ధ హరికథకులు శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ భాగవతారు గారు నాచేత ఒక సంగీత సభ ఏర్పాటు చేయించేరు. నాటి సభలో ఆటపాటలమేటి శ్రీమదజ్జాడాదిభట్ల నారాయణదాసు గారు నాకు ఒక తంబూరా బహుకరించేరు. ఆరోజు నిజంగా నా జీవితంలో ఒక పర్వదినం.
నా విజయనగర జీవితంలో, ఎన్నడూ మరవలేని వ్యక్తి శ్రీ సరిదె లక్ష్మీనరసమ్మ (కళావరు రింగు). విద్యార్థి దశలో ఆమె నా యెడల కనపర్చిన ఆదరాభిమానములు ఎన్నడూ మరవలేను.
ఘంటసాల చెప్పుకున్న సొంత కథ- 3వ భాగం : జీవనం ఎలా మొదలైందంటే..

.