ఫేస్బుక్ మిత్రుడొకరు ఆ మధ్య ఒక చెక్కును ఫోటో తీసి మిత్రులతో పంచుకున్నాడు. అది హైదరాబాద్లోని నవోదయ బుక్ హౌస్ వారు పంపిన చెక్కు. ఆ సాహితీ మిత్రుడు తను రాసిన పుస్తకాలను 40 శాతం డిస్కౌంట్కు ఇవ్వగా వారు వాటిని అమ్మాక లెక్కలు చూసి తమ డిస్కౌంట్ పోను మిగిలిన మొత్తానికి ఇచ్చిన చెక్కు ఇది.
మామూలుగా అయితే ఇందులో వార్తాంశం, పదుగురితో పంచుకోవలసిన ముఖ్య విశేషమేమీ లేదు. కానీ ఆ రచయిత చెక్కు అందుకున్న ఉద్వేగంలో మిత్రులకు ఆ ఆనందాన్ని పంచుకోవాలనుకున్నాడు.
చాలా సాధారణ విషయాలు కూడా ఈ రోజుల్లో గొప్ప ఘనకార్యాలుగా చలామణి అవుతున్నాయి.
పుస్తకాల షాపుల వాళ్లందరూ పుస్తకాలను అమ్మి ఆరునెలలకోమారు లెక్కలు చూసి రచయితలకు, పబ్లిషర్లకు ఠంచనుగా డబ్బులు పంపిస్తే అసలు పేచీయే ఉండదు. కానీ అలా జరగడం లేదు. సోకాల్డ్ అభ్యుదయ ప్రగతిశీల భావాలను జండాలుగా భుజాల కెత్తుకున్న పార్టీల వారి పుస్తకాల దుకాణాలు కూడా ఇప్పుడు ముఖం చాటేసి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మేం అమ్మినా డబ్బులు ఇవ్వంగాక ఇవ్వం అని తెగేసి చెప్పకున్నా.. చేతల్లో మాత్రం అదే రుజువు చేస్తున్నారు.
మరి ఇలాంటి పరిస్థితిలో చెక్కు అందుకోవడం ఆ రచయితకు మహదానందకారకం కాక ఏమవుతుంది?
ప్రభుత్వ, ప్రయివేటు అనే తేడా లేకుండా రాను రాను అన్ని వ్యవస్థల్లో ఒక అవ్యవస్థ పాతుకుపోతోంది.
ఏ ప్రభుత్వ ఆఫీపసుకైనా వెళ్లి లంచం లేకుండా పని చేయించుకు రాగలిగిన సామాన్యుడు హిమాలయ శిఖరం ఎక్కినంతగా పరవశించిపోతున్నాడు.
ప్రభుత్వ కార్యాలయాలున్నది ప్రజల కోసం. ప్రజలు కట్టే పన్నులతోనే వారికి జీతాలు, ఇంక్రిమెంట్లు చెల్లిస్తున్నారు. మరి ఆ ప్రజల సేవకోసమే పనిచేయాల్సిన ఉద్యోగులు లంచం లేకుండా, పేచీ పెట్టకుండా పనిచేయడం గొప్ప ఘనకార్యంగా చలామణీ అవుతోంది ఈ రోజుల్లో.
also read ఒక్క ప్రకటన: పరువు తానే తీసుకున్న ఈనాడు
బస్సులో టికెట్ పైకం పోను అణాపైసల్తో చిల్లర తిరిగిచ్చే కండక్టరు తారసపడితే బడుగు ప్రయాణికుడికి ప్రాణం లేచివస్తుంది. ఈ కాలంలోనూ ఇంతటి పుణ్యపుంగవులు ఉంటారా? అని విస్మయం చెందాల్సి వస్తోంది.
ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ వెళ్తే అసలు సమస్యలే ఉండవు.
ఓటర్లు ప్రలోభాలకు లొంగి ఓటు అమ్ముకోకుండా ఉంటే, ప్రజాసేవకే అంకితమైన పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. తన ఉద్యోగుల పనితీరును చక్కదిద్దుతుంది.
also read : ‘రామ్’ బాణమ్ : ఇండిపెండెంట్ జర్నలిజం కూడా దారి తప్పుతోందా?
సామాన్యుడు సరిగా ఉంటే, కుల మత ప్రాంత సాలెగూడులో చిక్కుకోకుండా వివేచనతో మెలిగితే అతడే అసామాన్యుడై కొత్త చరిత్ర లిఖించడా?
ఇప్పుడు మనం అల్పసంతోషులం. ‘లంచం తీసుకుంటే తీసుకున్న వాడు తొందరగా పనిచేసిపెట్టాడు’ అనే అల్ప సంతోషులం.
‘లక్షల్లో బిల్లులు గుంజినా ప్రాణాలు నిలిపావు డాక్టరు బాబూ!’ అని పరవశించే సగటుజీవులం.
‘బురద చల్లుకుంటూ వెళ్తే వెళ్లావు, కారును నా మీదకు ఎక్కించనందుకు ఆనందం’ అని పొంగిపోయే పాదచారులం.
‘ఆకలిచూపు చూస్తే చూశావు. అఘాయిత్యానికి తెగబడలేదు’ అని సర్దిచెప్పుకోవాల్సిన పాడులోకం.
‘లాఠీ విరిగితే విరిగింది దొరా! ప్రాణాలు పోయేట్టు కొట్టలేదు సంతోషం’ అనుకునే అమాయకులం.
‘ఫీజు గుంజితే గుంజావు. ఎగస్పార్టీ లాయరుతో కుమ్మక్కవకుండా కేసు నా పక్షాన్నే వాదించావు. నువ్వు సల్లంగుండాల’ అని సంబరపడే సగటు మనుషులం.
ఇలా చెప్తూపోతే ఈ అల్పసంతోషాల జాబితాకు అంతే ఉండదు.
.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్

.