జనసేనాని పవన్ కల్యాణ్ తన సంస్కారాన్ని చాటుకున్నారు. రాజకీయాలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, వాటికంటె ముందు మనం సంస్కారవంతులైన మనుషులుగా అయి ఉండాలని ఆయన నిరూపించుకున్నారు. చంద్రబాబునాయుడుకు కన్నీళ్లు తెప్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ దురహంకారుల ఆగడాలను పవన్ కల్యాణ్ ఖండించారు.
పవన్ కల్యాణ్ ఉదాత్తత, సంస్కారం ఏమిటో ప్రపంచానికి మరోసారి తెలిసింది. తన వ్యక్తిగత జీవితం గురించి, తన భార్యల గురించి వైఎస్సార్ సీపీ నాయకులు నీచంగా మాట్లాడిన సందర్భాల్లో కూడా పవన్ కల్యాణ్ చాలా పరిమితంగానే స్పందించారు తప్ప.. వారిని ఎన్నడూ అలా కించపరిచేలా మాట్లాడలేదు.
తెలుగుదేశం వారు తనకు అండగా ఉన్నారా లేదా? తనకు మద్దతుగా మాట్లాడారా లేదా ఆయన పట్టించుకోలేదు. కానీ ఇవాళ చంద్రబాబునాయుడుకు అవమానం జరగగానే ఆయన స్పందించారు.
రాజకీయంగా చంద్రబాబునాయుడుతో ఎంతగా విభేదిస్తున్నప్పటికీ అంతటి నాయకుడు కళ్లమ్మట నీళ్లు పెట్టుకోగానే.. జనసేనాని పవన్ కల్యాణ్ ఊరుకోలేదు. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను లాగి అవమానించే కుసంస్కారం తగదంటూ ఖండించారు.
పవన్ కల్యాణ్ ప్రకటన యథాతథంగా..
కుటుంబ సభ్యులను కించపరచటం తగదు
ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. ఒకపక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.
తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కంట తడి పెట్టడం బాధాకరం. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉంది.
ఈ మధ్యకాలంలో సభలు, సమావేశాలు, చివరికి టి.వి. చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోంది. గౌరవనీయ ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయం. ఈ వ్యాఖ్యలు నిర్హేతుకంగా ఖండించదగినవి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి కుటుంబసభ్యులను తక్కువచేసి కొందరు మాట్లాడినప్పుడు ఆనాడు కూడా ఆ వ్యాఖ్యలను ఇదే రీతిలో ఖండించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
ముఖ్యంగా ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మహిళలను కించపరచడం, వారి గౌరవ ప్రతిష్ఠలకు హాని కలిగించడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరు ఖండించవలసిన అవసరం ఉంది. లేని పక్షంలో ఇది ఒక అంటు వ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉంది. రాజకీయ వ్యవస్థను ప్రజల దృష్టిలో పలుచన చేయవద్దని ఈ సందర్భంగా కోరుతున్నాను.
.

Discussion about this post