నరేంద్ర మోడీకి ఉన్నటువంటి అధికార బలం- వారికి లేదు! దేశవ్యాప్తంగా వారే ఉన్నారు గానీ.. ఆయనకు ఉన్న ప్రజాదరణ కూడా వారికి లేదు! ఆయనతో పోలిస్తే.. వారంతా ఎంతో బలహీనులు. అయినా సరే.. సమష్టిగా ఉన్నారు. ప్రస్తుతానికి భారత రాజకీయాలలో తిరుగులేని నాయకుడిగా చెలామణీ అవుతున్న నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించారు. చిట్ట చివరకు విజయం సాధించారు. నరేంద్ర మోడీ తన ఓటమిని అంగీకరించి, వారిని క్షమాపణ కూడా అడిగారు!!
అయితే ఈ ఓటమి నుంచి నరేంద్ర మోడీ ఏం పాఠం నేర్చుకున్నారు?
సాధారణంగా ప్రతి ఓటమి మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుందని పెద్దలు అంటూ ఉంటారు. ఈ ఓటమి మోడీకి ఏం నేర్పింది? దీనినుంచి ఆయన ఏ పాఠం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది?
తన ఓటమిని అంగీకరిస్తూ శుక్రవారం నాడు చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు అంటూనే, ఆ చట్టాలు చాలా గొప్పవి అని ఆయన వివరించారు. రైతుల కోసం రైతు పని చేస్తామని రైతుల శ్రేయస్సు కాంక్షించే ప్రభుత్వం తమదని చెప్పుకున్నారు.
అనేక మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్ధికవేత్తలు, ఆర్ధిక రంగ నిపుణులు అందరితో కలిసి రైతుల జీవితాలను బాగు చేయడం కోసం ఎంతో మేధోమధనం చేసిన తర్వాత ఈ చట్టాలను రూపొందించినట్లు చెప్పారు.
అయితే ప్రధాని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే మట్టిని నమ్ముకుని చెమటోడ్చి సేద్యం చేస్తున్నారో వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం విస్మరించారు. రైతులతో కాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు అనే ముద్ర ఉన్న వారితో మాట్లాడి చట్టాలను తయారు చేసేశారు. ఇది తగదు. ఆయన నేర్చుకోవాల్సిన చాలా పెద్ద పాఠం ఇదే!
ఎవరి లబ్ధికోసం అయితే కొత్త చట్టాలను తీసుకు వస్తున్నారో ఆ వర్గం యొక్క అభిప్రాయాలను ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా ఆ ప్రయత్నం చేయడం తప్పకుండా బెడిసి కొడుతుంది. అందుకే ఇవాళ మోడీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
రెండో పాఠం-
మేం తీసుకువచ్చినవి మంచి చట్టాలు. వాటి గొప్పదనం గురించి మేం రైతులకు తెలియజెప్పలేకపోయాం అని అనడం వేరు. ఆ చట్టాల గొప్పదనాన్ని ‘వారు అర్థం చేసుకోలేకపోయారు’ అంటూ నెపం రైతుల మీదకు నెట్టేశారు. అంటే మోడీ రైతుల్ని మూర్ఖుల కింద జమ కడుతున్నారా? తామంతా విజ్ఞులం అని.. చెప్పినా కూడా అర్థం చేసుకోలేని స్థితిలో రైతులు ఉన్నారని ఆయన అనుకుంటున్నారా? రైతుల్ని ఇలా చులకన భావంతో చూడడం తప్పు అని కూడా ఆయన పాఠం నేర్చుకోవాలి.
తమకు ఏం కావాలో రైతులకు తెలుసు. వాళ్లేమీ నిప్పును ముట్టుకుంటే కాలుతుంది అనే సంగతి కూడా తెలియనంత పసిపిల్లలు కాదు. వారికి తెలియదు, చెబితే అర్థం కాదు అనే మిషమీద- తమ సర్కారు తెచ్చిన చట్టాలను వారిమీద బలవంతంగా పులమడానికి చేసే ప్రయత్నం మంచిది కాదు. ఈ సంగతిని కూడా మోడీ తెలుసుకోవాలి.
జాతి విస్తృతప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారికోసం చట్టాలు తెస్తున్నప్పుడు.. ఆ జాతి యొక్క మనోభిప్రాయాలను గౌరవించడం మౌలిక బాధ్యత అని ఆయన తెలుసుకోవాలి.
.

Discussion about this post