మండే ప్రచండ భానుడిలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భగభగలాడుతున్న ప్రజల హర్షాతిరేకాల మధ్య భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు చేపట్టిన రెండో విడత “ప్రజాసంగ్రామ యాత్ర” రెండో వారం రెట్టించిన ఉత్సాహంతో సాగింది. కల్వకుంట్ల కుటుంబ ప్రజా వ్యతిరేక విధానాలు, తప్పుడు ప్రచారాలను అడుగడుగునా ఎండగడుతూ యాత్ర సాగగా, ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం పలు విధాలుగా ప్రయత్నాలు చేసింది.
యాత్రకు లభిస్తున్న స్పందనను మీడియాలో వీక్షించి, ఇంటెలిజెన్స్ నివేదికలను చూసి మంత్రులు గాబరా పడి విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు రావడంలేదన్న ప్రచారాన్ని వారు ముమ్మరం చేశారు. సంజయ్ గారి వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే ప్రచారాలు ఈ రెండో వారంలో తెరాస నాయకులు పెంచి భంగపడ్డారు.
ఏప్రిల్ 27 న తెరాస వ్యవస్థాపక దినోత్సవం పేరిట అధికార పార్టీ నాయకులను సమాయత్తపరిచి, బీజేపీ మీద నిందలు, కువిమర్శలు పెంచారు. ఈ సందర్భంగా బండి సంజయ్ గారు ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో తాను ఈ ఎనిమిదేళ్ల కాలంలో సాధించినదేమిటో వెల్లడించాలని కోరుతూ 21 ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలు ముఖ్యమంత్రి లో నిస్పృహకు పెంచాయి తప్ప సరైన సమాధానాలు రాలేదు. అంతకు ఒక రోజు ముందు ఏప్రిల్ 26న – అసెంబ్లీ సాక్షిగా చేసిన ఉద్యోగ ప్రకటనలో భాగంగా 63,425 పోస్టులకు నోటిఫికేషన్స్ ఎప్పుడని నిరుద్యోగుల పక్షాన సంజయ్ గారు రాసిన లేఖకు ప్రభుత్వం నీళ్లునమిలింది.
పాదయాత్ర మాత్రమే నేపథ్యం కాకపోతే, తెరాస నాయకులకు వాళ్ళ నాయకత్వం మున్నెన్నడూలేని గౌరవం ఇచ్చేదా? ముఖ్యమంత్రి ఉచ్ఛనీచాలు మరిచి కేంద్ర ప్రభుత్వంపై అంత చేటు విషం కక్కేవారా? నిన్న మొన్నటిదాకా తమ గురించి బాకా కొట్టుకున్న తండ్రీ కొడుకులు యాత్ర ప్రభావంతో, బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలతో దిక్కుతోచక తమ ప్రసంగాల్లో అసత్యాలు, అర్థ సత్యాలు గుప్పించి ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. క్షేత్రస్థాయిలో చేసింది శూన్యం అని బీజేపీ ప్రతిరోజూ నిరూపించబట్టే కావచ్చు ప్లీనరీ ప్రసంగంలో ‘బంగారు తెలంగాణ’ అన్న మాటే వాడకుండా ప్రసంగాలు సాగాయి. ప్రజా సంగ్రామ యాత్ర రెండో వారం సమీక్ష ఇదీ..
8వ రోజు (గురువారం- ఏప్రిల్ 21, 2022)
పట్టించుకునే నాథుడు లేక విలవిల్లాడుతున్న అనేక గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను పలకరించి, వారి సాధకబాధకాలను వివిధ మాధ్యమాల ద్వారా ఎత్తిచూపిన యాత్ర గద్వాల జిల్లా కేంద్రంలో ఎనిమిదో రోజు కొనసాగింది. శెట్టి ఆత్మకూరు నుండి ప్రారంభమైన యాత్ర మదనపల్లి, ఈడిగోనిపల్లి, పెద్దపాడు, యమ్మలోనిపల్లి, చింతరేవుల, జూరాల ప్రాజక్టు మీదుగా నందిమల్ల వరకు సాగింది.
పోరెడ్డి కిషోర్ రెడ్డి ఇతర వ్యాసాలు కూడా చదవండి
ప్రజాసంగ్రామ యాత్ర లక్ష్యమిదే
జోగులాంబ దీవెనతో మొదలై.. కేసీఆర్ గుండెల్లో గుబులై..
కమలం కీర్తిని దొంగిలిస్తున్న కల్వకుంట్ల ద్వయం
గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక టీకొట్టు వద్ద యువకులతో బండి సంజయ్ గారు, డీకే అరుణ గారు ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. ఉద్యోగ ప్రకటనలు రావడం లేదని, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని యువకులు ఆవేదనతో చెప్పినప్పుడు, సమస్యల పరిస్కారానికి బీజేపీ పోరాటం చేస్తుందని బండి సంజయ్ గారు హామీ ఇచ్చారు.
చింతరేవులలో నిర్వహించిన ‘ప్రజల గోస-బీజేపీ భరోసా’ కార్యక్రమంలో మాట్లాడుతూ-నడిగడ్డ ప్రజలకు ఆరు మాసాల్లో ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు నీరందిస్తామని సంజయ్ గారు ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకానితనం వల్ల ఆర్డీఎస్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు నీరందడం లేదనీ, ఆర్డీఎస్ ద్వారా నీరందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కేవలం 2 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందడం లేదని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
గద్వాల సభ సందర్భంగా నేను పలువురు నాయకులను, స్థానికులను పలకరిస్తే – వారిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆగ్రహావేశాలు కనిపించాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, డికె. అరుణ గారు, ఈటెల రాజేందర్ గారు, స్వామిగౌడ్ గారు, తదితరులతో పాటు బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ఐ.పీ.ఎస్. అధికారి అన్నామలై కుమారస్వామి గారు పాల్గొని ప్రసంగించారు. లిక్కర్ షాపులను నడపడంలో రిజర్వేషన్ అమలుచేస్తున్న ప్రభుత్వం, అదే సామాజిక న్యాయం అని భ్రమిస్తోందని, దేశంలో ఉన్న అప్రజాస్వామిక-దురహంకార ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒకరని అయన అన్నారు. రాజ్యాంగ హోదాలో ఉన్న మహిళా గవర్నర్ ను ప్రభుత్వంలోని మంత్రులు అవమానించడం పట్ల అయన తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.
ఇదే రోజున సంజయ్ గారు ముఖ్యమంత్రికి ఒక లేఖ రాస్తూ, రైతు రుణమాఫీ జరగడంలేదని, 14 లక్షల మంది కౌలు రైతులకు రక్షణ లేకపోవడంపై తనను యాత్రలో భాగంగా కలుస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలపై రైతు సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో వెంటనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
9వ రోజు (శుక్రవారం- ఏప్రిల్ 22, 2022)
తొమ్మిదో రోజు గద్వాల, ధరూర్, పెద్దచింతరేవుల, నర్సన్ దొడ్డి చౌరస్తా మీదుగా జూరాల జలాశయం వరకు సాగింది. రాత్రికి పాదయాత్ర వనపర్తి జిల్లాలో ప్రవేశించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గార్లతో సహా పలువురు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈర్లదిన్నెలో సంజయ్ గారు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్దపాడులో బండి సంజయ్ గారు రైతులతో మాట్లాడారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్దంగా ఉందన్నారు. తెరాస ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని ఆ పార్టీ నేతలను నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హమీలను అమలు చేయడంలో తెరాస విఫలమైందన్నారు. ఫాంహౌస్ నుండి పాలన సాగిస్తున్న కేసీఆర్ కు మరో సారి పగ్గాలు అప్పగిస్తే మరో ఐదేళ్ల పాటు ఇంతకు మించిన కష్టాలు తప్పవన్నారు. ఖమ్మంలో బీజేపీ నాయకుడు సాయి గణేష్ మరణానికి కారణమైన ఎవ్వర్నీ వదలబోమని అయన హెచ్చరించారు. సాయి గణేష్ మృతికి సంతాప సూచికంగా జూరాల ప్రాజెక్ట్ మీద సెల్ ఫోన్ టార్చిలతో పాదయాత్ర జరగడం విశేషం.
10వ రోజు (శనివారం- ఏప్రిల్ 23, 2022)
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం అమరచింత మండలంలో జరిగిన పాదయాత్ర ఒక మైలురాయిని చేరుకుంది. ఈ రోజుతో సంజయ్ గారి పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. క్రిష్ణంపల్లి చౌరస్తా వరకు చేరుకోగానే 100 కి.మీల నడక పూర్తయిన సందర్భంగా… అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు సంజయ్ గారిపై పూలు చల్లి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఇతర పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
తిట్ల పురాణంలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల్లో లబ్దిపొందే ఎత్తుగడలను రాష్ట్ర ప్రజలు నమ్మె స్దితిలో లేరని సంజయ్ గారు చెప్పారు. ఇసుక, మైనింగ్, మాదక ద్రవ్యాలు, లిక్కర్, భూ ఆక్రమణ మాఫియాగా రాష్ట్ర మంత్రులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించుకుంటే ప్రజలపై భారాలు తగ్గుతాయన్నారు. వనపర్తి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ గారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని 18 రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాయని గుర్తు చేశారు. కేంద్రం కూడా ఇప్పటికే పెట్రోలు మీద లీటరుకు 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు సుంకం తగ్గించిందన్నారు. పద్మశాలిలు సహా అన్ని వర్గాలను సీఎం మోసం చేసారని విమర్శించారు. గత రెండు రోజులుగా తెరాస నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ – ఆల్కహాల్ కు, డ్రగ్స్ కు అలవాటు పడిన తెరాస నాయకులు, తాను లవంగాలు తింటే పొగాకు తిన్నట్లు ప్రచారం చేసి తృప్తిపడుతున్నారని చెప్పారు.
11వ రోజు (ఆదివారం- ఏప్రిల్ 24, 2022)
జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవమయిన ఏప్రిల్ 24 న, యాత్ర పదకొండో రోజు సర్వ వద్ద బహిరంగ సభతో ప్రారంభమైంది. ఎక్కడకు వెళ్లినా వాల్మీకి, బోయ, మాదాసి కురవ, ముదిరాజ్, విశ్వకర్మ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను సంజయ్ గారి దృష్టికి తెచ్చారు. అనంతరం సర్పంచులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ – గత ఐదేళ్లలో ప్రతి పెద్ద గ్రామ పంచాయితీకి కేంద్ర ప్రభుత్వం దాదాపు కోటి రూపాయల చొప్పున కేటాయించిందని చెప్పారు.
గ్రామాల్లో అభివృద్ధి కేంద్రం నిధులతో జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోవడంలేదని అన్నారు. పథార్ చేడు వద్ద బీరప్ప ఆలయాన్ని సందర్శించారు. వడ్రంగి వృత్తుల వారితో సమావేశమయ్యారు. గ్రామ సభలో పాల్గొని రాత్రి మంథన్ గాడ్ గ్రామ శివారులో రాత్రి బస చేశారు. వడ దెబ్బ, ఎసిడిటీ భారిన పడిన సంజయ్ గారికి డాక్టర్ శరత్ చికిత్స అందించారు. కొంత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికీ పాద యాత్ర కొనసాగింపు వైపే సంజయ్ గారు మొగ్గు చూపారు.
నారాయణపేట జిల్లా సర్వ, మంతన్ గోడ్ గ్రామంలో నిర్వహించిన సభలో అయన మాట్లాడారు. రాష్ట్రంలో గడీల పాలన పోయి, గరీబోళ్ల రాజ్యం రావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ లాంటి మోసకారి ప్రపంచంలోనే లేడన్నారు. రాష్ట్రంలో తెరాస నేతల ఆకృత్యాలు పెరిగాయని ఆంధోళన వ్యక్తం చేశారు. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా మండలంలోని చెరువులకు సాగునీరు అందని దుస్ధితి ఏర్పడిందన్నారు. బీజేపీ కి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.
12వ రోజు (సోమవారం-ఏప్రిల్ 25, 2022)
పన్నెండో రోజు మక్తల్ మండలంలో సంజయ్ గారి పాదయాత్ర సాగింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు, జాతీయ కార్యదర్శి విజయ్ రహత్కర్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ గారు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి గారు, కోశాధికారి శాంతికుమార్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ ఛైర్ పర్సన్ పావని మల్లికార్జున్ గారితో సహా పెద్ద ఎత్తున స్థానిక ప్రజా ప్రతినిధులు పాద యాత్రలో పాల్గొన్నారు.
ఈ లోపు రెండు రోజుల పాటు కేసీఆర్ తో ప్రగతి భవన్ లో సేదదీరిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు ముమ్మరం చేశారు. ఈ పరిణామాన్ని మక్తల్ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన సభలో ప్రస్తావిస్తూ – కాంగ్రెస్ తో, ఎంఐఎం లతో తెరాస పొత్తు ఖరారైందని సంజయ్ గారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి గ్యారంటీ లేదని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదని తెలిపారు. రంజాన్ పండుగకు ఫ్లెక్సీలు కట్టి శుభాకాంక్షలు తెలుపుతున్నారని, అందులో తప్పేమి లేదని, దసరా దీపావళి, ఉగాది పండుగలకు ఎందుకు అలా చేయడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సంస్ధలకు ప్రభుత్వం 70 వేల కోట్లు బకాయి పడిందని, పాత బస్తీలో వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయని వివరించారు.
13వ రోజు (మంగళవారం- ఏప్రిల్ 26, 2022)
పదమూడో రోజు ప్రజా సంగ్రామ యాత్ర ఐదు కిలోమీటర్లు మాత్రమే సాగింది. మక్తల్ పట్టణ శివారులో ఏర్పాటు చేసిన శిబిరం నుండి ప్రారంభమైన యాత్ర లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకుంది. ప్రజలతో మాట్లాడుతూ సంజయ్ గారు ముందుకు సాగారు. మధ్యలో గడ్డి తీసుకెళ్తున్న ట్రాక్టర్ కనిపించడంతో కొద్ది దూరం నడిపారు.
గత ఎనిమిదేళ్ల కాలంలో పోలీసు శాఖలో ఏర్పడిన ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తూ, ఇతర శాఖలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.
తెరాస నియంతృత్వ పాలనకు ఎవరూ కూడా అడ్డురాకూడదనే పాలకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి బండి సంజయ్ గారు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఎప్పటి వరకు ఇస్తారో తెలియచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిస్వాల్ కమిటీ నివేదక ప్రకారం ప్రభుత్వంలో 1.91 లక్షల ఖాళీలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం మాత్రం శాసనసభలో 80 వేల 38 ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించిందన్నారు. 2018లో ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి అమలు కావడంలేదన్నారు. ఒప్పంద పొరుగు సేవల (కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్) ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరారు.
14వ రోజు (బుధవారం- ఏప్రిల్ 27. 2022)
ఓబులాపూర్ నుండి చిన్నపోర్ల, మల్లేపల్లి గేట్, ఎడవల్లి గేట్ మీదుగా కొల్లూరు వరకు పద్నాలుగో రోజు పాదయాత్ర సాగింది. దారిపొడవునా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గ మధ్యలో మహిళలు, చిన్నారులు, యువతను ఆప్యాయంగా పలకరిస్తూ సాగారు. వృద్ధుల ఆసరా గురించి ఆరా తీస్తూ, మహిళల క్షేమాన్ని తెలుసుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఊట్కూరులో ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ గారు మాట్లాడుతూ – భాజపా అధికారంలోకి రాగానే హైదరాబాద్ పాత బస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయం, భైంసా పట్టణం, ఉట్కూరు గ్రామాలను, దత్తత తీసుకుంటామని ప్రకటించారు.
భైంసా, ఊట్కూరులో హిందువులను చిత్రహింసలు పెట్టిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. హిందూత్వమే తమ అజెండా అని ప్రకటించారు. తెరాస పాలనపై తాము ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుంటే కేసీఆర్ భయపడుతున్నాడని చెప్పారు. భాజపాను ఎదుర్కొలేక కేసీఆర్ కాంగ్రెస్ ఎంఐఎంలతో కుమ్మక్కవుతున్నారని అన్నారు.
.. పోరెడ్డి కిషోర్ రెడ్డి
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ

.

Discussion about this post