ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతిలో మాత్రమే ఉండాలని ఆ ప్రాంతానికి చెందిన రైతులు దీర్ఘకాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. వ్యవహారం కోర్టులో ఉన్నందువల్ల ఎటూ తేలకుండా చతికిలపడి ఉంది. అమరావతి రైతులు రకరకాల కార్యక్రమాలూ నిర్వహిస్తూనే ఉన్నారు.ఇప్పుడు తిరుమలకు మహాపాదయాత్ర చేస్తున్నారు. అయితే ఇది ఫలితమిస్తుందా?
అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడుతున్న వైనం చాలా గొప్పది. కానీ.. అదే పోరాటం ముసుగులో వారు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు కామెడీగా తయారవుతున్నాయి. తీర్థయాత్రలు చేయదలచుకున్న వాళ్లంతా.. దానికి అమరావతి పోరాట ముసుగు తొడిగి దేవుళ్ల దగ్గరకు వెళ్లి నివేదించుకుంటున్నాం అని ప్రకటించుకుంటూ లాఫింగ్ స్టఫ్ అవుతున్నారు. తమ పోరాటాన్ని హాస్యాస్పదంగా మారుస్తున్నారు.
తాజాగా అమరావతి రైతులు మహా పాదయాత్రను సంకల్పించారు. వారు ప్రకటించిన ప్రకారం..
నవంబర్ 1 నుంచి 50 రోజుల పాటు రైతు మహా పాదయాత్ర జరుగుతుంది. రాజధాని అమరావతిపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా మహా పాదయాత్ర చేపట్టనున్నారు. నేలపాడులోని హైకోర్టు నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర ద్వారా అమరావతి అవసరాన్ని, ఆవశ్యకతను, 3 రాజధానులతో రాగల ఇబ్బందులను గ్రామ, గ్రామాన ప్రచారం చేయనున్నారు.
సంకల్పం బాగానే ఉంది. కానీ తిరుమల దేవుడి దర్శనార్థం ‘కాలినడకన వస్తాం’ అని మొక్కుకున్న భక్తులందరూ.. దానికి అమరావతి పోరాటం ముసుగు తగిలించి నడక సాగిస్తారనే విమర్శ వస్తే దానికి వారు ఏం సమాధానం చెప్పుకుంటారు. గ్రామగ్రామాన, రాజధానిగా అమరావతి అవసరం గురించి చైతన్యం కలిగించడమే వారి లక్ష్యం అయితే గనుక.. దానిని తిరుమలకు తీసుకువెళ్లడం ఎందుకు? తిరుపతి దాటి కుప్పందాకా ఎందుకు వెళ్లదలచుకోలేదు? అక్కడిదాకా వెళితే.. రాజధాని విశాఖకు తరలడం వల్ల మరింత ఇబ్బంది పడే ప్రజలకు ఆ సమస్య తీవ్రతను తెలియజెప్పినట్టు అవుతుంది కదా? ఇవన్నీ ప్రశ్నలు!
రాజధానిగా అమరావతి.. యావత్ రాష్ట్రానికి అందుబాటులో ఉంటుంది. అందులో సందేహం లేదు. కానీ అమరావతి రాజధాని నిర్మాణం అనే అంశాన్ని ట్రంప్ కార్డ్ లాగా వాడి.. దాన్ని పూర్తి చేయడానికి ప్రజలు తనకు మళ్లీ అధికారం ఇస్తారని చంద్రబాబు అనుకున్నప్పటికీ ఆ ప్లాన్ బెడిసికొట్టింది. దానికి తగ్గట్టుగా.. అమరావతిలో రాజధాని ఆనవాళ్లు, చంద్రబాబు ప్రభ లేకుండా చేయడానికి.. విశాఖకు తరలించాలని జగన్ కంకణం కట్టుకున్నారు. దానికి వ్యతిరేకంగా భూములు ఇచ్చిన రైతులు పోరాడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది.
కానీ వారి పోరాటం ఎలాంటి బాటలు తొక్కుతోంది. అమరావతిలోనే రాజధాని ఉండాలనే డిమాండ్ తో కేవలం.. అమరావతి ప్రాంత రైతులు మాత్రమే శిబిరాల్లో కూర్చుని ఎన్ని సంవత్సరాలు దీక్షలు చేసినా.. ప్రభుత్వం నుంచి స్పందన ఉండదు. కోర్టు ద్వారా సాధించాల్సిందే తప్ప.. ప్రభుత్వంలో కదలిక తీసుకురాలేరు. అదే సమయంలో.. అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలనే డిమాండ్ తో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దీక్షలు జరిగితేనే, పోరాటం జరిగితేనే ప్రభుత్వం తమ నిర్ణయం పట్ల జంకుతుంది. ఇతర ప్రాంతాల్లో సంఘీభావం సాధించడం అమరావతి రైతులకు సాధ్యం కావడం లేదు. అది సాధించడానికి ఇలాంటి మహాపాదయాత్రలు వారికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
పాదయాత్రలో ఏం చేస్తే మంచిది?
అయితే.. వారు ఆ యాత్రను తిరుమలకు చేస్తుండడమే హాస్యాస్పదం. మహాపాదయాత్ర చేస్తూ దార్లోని గ్రామాల్లో రాజధాని గురించి చైతన్యం కలిగిస్తామని అంటున్నారు. వారు తమ ప్రచారంలో చెప్పవలసింది.. అమరావతి రైతుల కష్టాలు కాదు. అమరావతిలో ఇప్పటిదాకా జరిగిన నిర్మాణాల ప్రగతి- అలాగే, అమరావతిలో మాత్రమే రాజధాని ఉంటే రాష్ట్రానికి ఎలా మేలు జరుగుతుంది? అనే సంగతి! అలాకాకుండా.. రైతుల కష్టాలు మాత్రం చెప్పుకుంటాం అంటే పెద్ద స్పందన ఉండదు.
రాంగ్ డైరక్షన్ లో వెళుతున్నారా?
అమరావతి ప్రాంతానికి ఒక వైపున- అంటే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడానికి జగన్ డిసైడ్ అయ్యారు. ఇప్పుడు రైతులు దానికి వ్యతిరేక దిశగా, ఆపోజిట్ డైరక్షన్ లో తిరుపతి వైపు తమ పాదయాత్ర చేపట్టారు. ఇది తిరుమల యాత్ర కావచ్చు, చైతన్య యాత్ర కావచ్చు.. ఏదైనా సరే.. విశాఖకు మరింత దూరంగా జరిగే ప్రాంతాల్లోనే వారి యాత్ర సాగబోతోంది. ‘విశాఖ వద్దు- అమరావతి ముద్దు’ వంటి నినాదాలను రైతులు ఇస్తే.. వారికి సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. రాజకీయ ప్రేరేపిత శక్తులు తప్ప.. ప్రజలు వారిని వ్యతిరేకించకపోవచ్చు. ఎందుకంటే.. వారు నడిచే దిశ మొత్తం.. విశాఖకు మరింత దూరమయ్యే ప్రాంతం మాత్రమే. విశాఖలో రాజధాని వస్తే.. మరింత ఇబ్బంది పడే ప్రాంతం మాత్రమే. కాబట్టి ప్రజలు స్పందిస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు.
EXCLUSIVE ARTICLES
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
అదే అమరావతి రైతులు.. విశాఖ వైపుగా పాదయాత్ర సాగించి.. అటువైపు ప్రజల్లో కూడా చైతన్యం కలిగించి.. అమరావతిలో రాజధాని ఉండడం వల్ల వాటిల్లగల మేలును వివరించి.. వారిని ఒప్పించగలిగితే.. గొప్ప విజయం సాధించినట్టు లెక్క. ప్రజాస్వామ్యంలో ప్రభువు మనోగతం ఎలా ఉన్నప్పటికీ.. ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలిగితే ప్రయోజనం ఉంటుంది. తిరుమల దిశగా కాకుండా, సింహాచలం దిశగా అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టి.. మార్గంలోని అన్ని ప్రాంతాల వారికి అమరావతి గురించిన తమ వాదన వినిపించాలి. ఇంకా చెప్పాలంటే.. తిరుమలలో ఆపకుండా కుప్పం వరకు వెళ్లాలని అన్నట్లే.. సింహాచలంతో ఆపకుండా ఇచ్ఛాపురం వరకూ కూడా యాత్ర వెళ్లాలి. ఉత్తరాంధ్ర వాసులకు విశాఖ రాజధాని కావడం మీదనే ఇష్టం ఉంటుంది. కానీ.. అమరావతిలో రాజధాని ఉంటే ఎలా మరింత మేలు జరుగుతుందో.. ఎలా ఒక అతిగొప్ప రాజధాని అక్కడ రాష్ట్రానికి వన్నె తెచ్చేలా ఆవిష్కృతమవుతుందో అమరావతి రైతులు చెప్పగలగాలి.
విశాఖ వైపు వెళ్లకుండా, ఆపోజిట్ డైరక్షన్ లో తిరుమల వెళ్లడం అంటే.. రాంగ్ డైరక్షన్ లో వెళ్లడమే అనే అభిప్రాయం కలుగుతోంది.
అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా ఉండడానికి అమరావతి రైతుల పోరాటం సరిపోదు. రాష్ట్రవ్యాప్త స్పందన, చైతన్యం అవసరం. అందుకు ఇలాంటి పాదయాత్రలు వారికి ఎంతో ఉపకరిస్తాయి. అయితే ఇవి ఆధ్యాత్మిక యాత్రలని, పుణ్యం పురుషార్థం కలిపి దక్కించుకోవడానికి చేస్తున్న యాత్రలని పలుచన అభిప్రాయం ప్రజల్లో కలగడం మంచిది కాదు. ఇవి తీర్థయాత్రల్లాగా కాదు.. ఉద్యమ/ పోరాటయాత్రల్లాగా ఉన్నప్పుడు మాత్రమే అసలు ఫలితం సిద్ధిస్తుంది.
.. సురేష్ పిళ్లె
సంపాదకుడు

ఇవి కూడా చదవండి :
‘రామ్’ బాణమ్ : సినిమా వాళ్లు పాలిటిక్స్ కు పనికొస్తారా?
సురేష్ పిళ్లె : ఒక మా ఎలక్షన్.. మీడియా ఓవరాక్షన్
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.
Discussion about this post