పుష్కరాలు అంటే అందరూ నదులకు సంబంధించిన అంశంగానే చూస్తారు. అయితే ఈ పుష్కరాలకు ఒక చారిత్రాత్మక కథనం మనకు వినిపిస్తుంది. పూర్వకాలంలో తుందిలుడు అనే ఋషి పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి తుందిలుడు తనను శివునిలో ఐక్యం చేసుకోవాల్సిందిగా కోరుకున్నాడు. పరమేశ్వరుడు తుందిలుని తనలో ఐక్యం చేసుకున్నాడు.
శివైక్యం పొందిన తుందిలుడికి పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలరూపం ప్రసాదించాడు. ఆవిధంగా తుందిలునికి పుష్కరుడు అనే పేరు వచ్చింది. పుష్కర అనే శబ్ధానికి వరుణుని కుమారుడు అనే అర్థం కూడా వస్తుంది. ఈవిధంగా పుష్కరునికి ఈశ్వరునిలోని మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు ఆధిపత్యం కలిగింది.
తర్వాత కాలంలో బ్రహ్మ సృష్టి కార్యం నిర్వహించడానికి పంచభూతాల అవసరం కలిగి పరమేశ్వరుని ప్రార్ధించాడు. పరమేశ్వరుని అనుగ్రహంతో పంచభూతాలలో ఒకటిగా పుష్కరుడు కూడా బ్రహ్మ అధీనంలోకి వెళ్లాడు. సృష్టికార్యంలో తోడ్పడుతున్న పుష్కరుడు బ్రహ్మ కమండలంలో ఒదిగిపోయాడు. తర్వాతికాలంలో సృష్టికార్యం పూర్తయిన తర్వాత ప్రాణులను నడిపించడానికి అవసరమైన ధర్మాన్ని నెరవేర్చడానికి, ప్రాణులకు జీవనాధారమైన నీటిని ఇవ్వవలసిందిగా బృహస్పతి బ్రహ్మను కోరాడు.
దీనికి బ్రహ్మ సరేనని పుష్కరుని ఇవ్వడానికి సంసిద్ధుడు కాగా దానికి పుష్కరుడు అంగీకరించలేదు. చివరికి బ్రహ్మ, బృహస్పతి, పుష్కరులు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎలాగంటే బృహస్పతి మేషం మొదలుగాగల పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులపాటు, మిగిలిన రోజులలో సంవత్సరమంతా మధ్యాహ్నం సమయంలో రెండు ముహూర్తాల కాలం పాటు పుష్కరుడు బృహస్పతితో ఉంటానని చెబుతాడు. దీనికి ముగ్గురూ సమ్మతించడంతో అప్పటినుండి ప్రతి ఏడాది బృహస్పతి మేషాదిగాగల పన్నెండు రాశులలోకి ప్రవేశించేటప్పుడు పన్నెండు నదులలో పుష్కరుడు ప్రవేశిస్తాడని పురాణాల్లోచెబుతారు.
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కథనాలు.. ఇవీ చదవండి : తుంగభద్ర అంటే.. ఆదివరాహస్వామి స్వేదం.. ఆ విశేషం మీకు తెలుసా? పుష్కరం అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పండుగ పుష్కరాల్లో ఎలాంటి పనులు చేయాలో తెలుసా? ఏయే నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసా? పరమశివుడి అష్ట మూర్తులు అంటే ఏమిటో తెలుసా?
బ్రహ్మ నుండి వచ్చిన వాడు కాబట్టి పుష్కరుని సప్తమహర్షులు ఆయన ఏ నదికి వస్తారో ఆ నది వద్దకు వచ్చి సూక్ష్మ రూపంలో పుష్కరునికి ఆతిధ్యం ఇచ్చి సేవించుకుంటారని నమ్మకం. అందుకే పుష్కరాల సమయంలో నదీ స్నానం చేయడం వల్ల మనకు పుణ్యం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు.
పుష్కరాలు.. నదీమతల్లులను పూజించడం, నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించడం, పెద్దలకు పిండప్రదానాలు చేయడం ఇదంతా మనకు తెలుసు. కానీ అసలు ఈ పుష్కరం ఏమిటో, పుష్కరుడు ఎవరో.. ఎందుకు ఈ ఆచారం వచ్చిందో వివరించే ఒకానొక పురాణ కథ ఇది.
Discussion about this post