వ్యక్తిత్వ వికాసం బోధించే వాళ్లు ఓ సంగతి చెబుతుంటారు. ‘తమమీదకు ఎవరైనా రాళ్లు విసురుతూ ఉంటే ఆ రాళ్లకు భయపడి పారిపోయేవాడు మామూలు వ్యక్తి.’ అని… అలాగే ‘తన మీదకు అందరూ విసిరే అదే రాళ్లను ఏరుకుని గోడగా, దుర్గంగా నిర్మించుకునే వాడు గొప్పవాడు’ అని అంటుంటారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ రెండు రకాలకు చెందరు. ఆయన ఇంకోరకం..!!
తన మీదకు ఇతరులు విసిరే రాళ్లను.. ఏరుకుని.. రక్షణ కోసం అడ్డుగోడగా కాదు.. మెట్లుగా నిర్మించుకుని కొత్త శిఖరాలు అధిరోహించే ప్రయత్నం చేస్తాడు. తాజాగా పంజాబ్ లో రైతుల నిరసనల నేపథ్యంలో.. నరేంద్రమోడీ స్పందన, దేశవ్యాప్తంగా భాజపా నాయకులు దీని మీద స్పందించడం అంతా ఇదే తరహాలో కనిపిస్తోంది.
మరికొద్ది నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉన్న అయిదు రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఉంది. ఇదే నేపథ్యం అని మనం చెప్పకపోయినా.. పంజాబ్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని వెళ్లారు. హుసేనీవాలా అనే ఊర్లో రాలీలో కూడా మాట్లాడాలని అనుకున్నారు. భటిండా ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో అక్కడకు వెళ్లాలనుకున్నప్పటికీ.. వాతావరణం బాగాలేక చివరినిమిషంలో రోడ్డు మార్గం ఎంచుకున్నారు. రాష్ట్రప్రభుత్వానికి సమాచారం ఇచ్చి, భద్రత పరంగా డీజీపీ నుంచి క్లియరెన్స్ వచ్చాకే బయల్దేరారు.
రైతుల విషయంలోకి వస్తే.. వారికి ప్రధాని ఈ రోడ్డులో వస్తారని ముందుగా తెలియదు. అంటే ఇదేమీ కుట్రపూరితంగా ప్లాన్ చేసిన నిరసన అనడానికి వీల్లేదు. ప్రధాని హెలికాప్టర్ మానుకుని, రోడ్డమ్మట వస్తున్నారని టీవీల్లో వచ్చిన తర్వాతే.. ప్రజలకు తెలిసి ఉంటుంది. అప్పటికప్పుడు వారు తమ నిరసనను తెలియజేయాలనుకున్నారు. వందమందికిపైగా రోడ్డు మీదికి వచ్చారు. శాంతియుతంగానే ధర్నాకు దిగిన ప్రజలను తొలగించడానికి బలప్రయోగం చేయలేరు గనుక.. రాష్ట్ర పోలీసులు ప్రధాని కాన్వాయ్ కు ముందుగానే సమాచారం ఇచ్చారు.
చదవండి : ఎట్టకేలకు ఒక మెట్టు దిగిన జగనన్న
ధర్నా స్థలానికి ఇరవై నిమిషాల దూరంలోనే ఒక ఫ్లై ఓవర్ మీద ఆయన ఆగిపోయారు. (రోడ్ల మీద ఆగడం కంటె.. ఫ్లైఓవర్ మీద ఆగడం భద్రమని అనుకున్నారేమో తెలియదు. ఫ్లైఓవర్ మీద ఆగితే రెండు వైపులా నియంత్రిస్తే.. కాన్వాయ్ సురక్షితంగా ఉండే అవకాశం ఉంది.) అక్కడే ఓ ఇరవైనిమిషాలు కార్లోనే ఉన్న మోడీ.. వెనుతిరిగి భటిండాకు, అక్కడినుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు.
‘ప్రాణాలతో తిరిగిరాగలిగాను’ అంటూ ప్రధాని భటిండా ఎయిర్ పోర్ట్ లో రాష్ట్రప్రభుత్వ అధికార్లతో చెప్పడం విశేషం. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద తన ఆగ్రహం వ్యక్తం చేయడానికి, ఆ సీఎంను కార్నర్ చేయడానికి ఆయన ఆ మాట అని ఉండొచ్చు. కానీ.. ఈ ఒక్క మాట ద్వారా.. ఫిరోజ్ పూర్ రైతులు ప్రధానికి తెలియజేయదలచుకున్న నిరసనను కూడా ఆయన తన రాజకీయ మైలేజీకి వాడుకోదలచుకుంటున్నారని అర్థమైపోతోంది.
చదవండి : ఎంపీ ఉవాచ- బీజేపీ తాలిబన్లే ఆదర్శమట!
పంజాబ్ రైతులు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు, దీక్షలు చేశారు. ఎందరి ప్రాణాలను వారు పొట్టన పెట్టుకున్నారు. ఎంత శాంతియుతంగా వారు దీక్ష చేశారో దేశానికంతటికీ తెలుసు. ఇంకా కేంద్రమంత్రి కుమారుడే.. వాళ్ల మీదికి కారు నడిపి.. వాళ్లను హత్య చేశాడు. యూపీ ప్రభుత్వమే ఏర్పాటుచేసిన సిట్- మంత్రి కొడుకు దోషి అని తేల్చింది. సదరు మంత్రి కూడా రైతుల మీద, చివరికి జర్నలిస్టుల మీద కూడా పరుషమాటలు మాట్లాడి అనేక వివాదాల్లో ఉన్నారు. ఆ మంత్రి మీద చర్య తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయడంలో తప్పేం ఉంటుంది. సిట్ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత కూడా.. కనీస చర్యలు తీసుకోని మోడీ ప్రభుత్వమే.. అందుకు సిగ్గుపడాల్సి ఉంటుంది.
ఇదంతా పక్కకు వెళ్లేలా.. ఇప్పుడు ఫిరోజ్పూర్ రైతుల నిరసనను ప్రధాని తన మీద హత్యాప్రయత్నం స్థాయికి చిత్రీకరిస్తున్నారు.
రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టి రాజకీయ మైలేజీ సాధించుకోవాలనుకుంటే ఓకే. భద్రత ఇవ్వకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పడం వరకు బాగానే ఉంటుంది. కానీ.. అందుకు రైతులను అడ్డుగా పెట్టుకుని.. రైతులను ప్రధాని హత్యకు ప్లాన్ చేసిన తీవ్రవాదుల్లాగా చిత్రీకరిస్తూ, అలాంటి అర్థం వచ్చేలా మాట్లాడుతూ మైలేజీ తీసుకోవాలనుకోవడం మాత్రం నీతి బాహ్యం.
.
Discussion about this post