చంద్రబాబునాయుడును అడ్డగోలుగా తిట్టిపోయడం అనేది.. ఆయనను ద్వేషించే వారికి ఎప్పుడూ తీయగానే అనిపిస్తుంది. కొడాలి నాని వారికి ఆరాధ్య నాయకుడు అవుతాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు శృతిమించిపోయే సందర్భాలు ఎక్కువైతే.. పార్టీ ప్రతిష్ఠకు ఎంతోకొంత నష్టం తప్పక చేస్తాయనే సంగతి ఆ పార్టీ వారికి కూడా తెలుసు. అంతా నిజమే గానీ.. ఆ మాట బయటకు చెబితే మాత్రం సహించేట్లు కనిపించడం లేదు.
ఈ నాయకులు వాడుతున్న భాష, తిట్టు, వ్యవహార శైలి వలన వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తగ్గుతుందని అన్నందుకు సొంత పార్టీ నాయకుడినే చంపడానికి బయల్దేరారు ఒక దురభిమాన దళం. కొడాలి నాని వంటి నాయకుల మాటలు పార్టీకి వచ్చే ఎన్నికల్లో చేయగల చేటు ఎంతనో తెలియదు గానీ.. పార్టీ పరువును ఇప్పటికిప్పుడు బజార్లో పెట్టేసిన ఇలాంటి ఘటన ఒంగోలులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..
ఒంగోలులో సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సన్నిహితుడు కూడా. ఈనెల 12న బాలినేని జన్మదినం నాడు ఆ వేడుకలకు వెళ్లిన సందర్భంలో పార్టీ పరిస్థితి మీద తన అభిప్రాయం వెలిబుచ్చారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ల తీరువల్ల పార్టీకి వచ్చే ఎన్నికల్లో 20 శాతం ఓటింగ్ తగ్గుతుందని ఆయన అన్నారు. ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా శనివారం అర్ధరాత్రి సమయంలో మంత్రి కొడాలి నాని అభిమానులుగా భావిస్తున్న వ్యక్తులు సుమారు 20 మంది బాగా తాగి, ముఖాలకు మాస్కులు తొడుక్కుని సదరు సుబ్బారావు ఇంటిమీదికి దాడికి తెగబడ్డారు. ఆయన ఇంటివద్ద నానా బీభత్సం సృస్టించారు. ఇంట్లోకి చొరబడి భార్య, ఇతరులతో అసభ్య పదజాలంతో బెదిరింపులకు దిగారు. సుబ్బారావు దొరికితే చంపేస్తాం అంటూ హెచ్చరించారు. అక్కడి వాహనాన్ని ధ్వంసంచేశారు.
ఇదంతా జరిగే సమయానికి సుబ్బారావు అక్కడ లేరు. ఫోనులో కూడా అందుబాటులో లేరు. స్విచాఫ్ రావడంతో చాలా అనుమానాలు వ్యాపించాయి. సాయంత్రానికి ఆయన పోలీసు సీఐకు ఫోనుచేసి తాను సురక్షితంగా ఉన్నట్లు చెప్పిన తర్వాత.. వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.
అయితే సొంత పార్టీ నేత మీదనే.. ఇలా దాడికి తెగబడడం.. హల్ చల్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
ఈ దాడి ఏం సకేతం ఇస్తోంది?
1. పార్టీకి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా.. ఆ విషయాన్ని బహిరంగంగా మాట్లాడకూడదు అని చెప్పదలచుకున్నారా? అదే వారి సంకేతం అయితే.. దానిని సమర్థించవచ్చు. పార్టీలోని వ్యక్తుల.. తమ పార్టీ లోపాలను అంతర్గతంగానూ, ఘనతలను బహిరంగంగానూ మాట్లాడడమే మంచిది. కానీ.. ఆ విషయం తెలియజెప్పడానికి మాటలు సరిపోతాయి. దాడి అనవసరం. ఈ దాడికి తెగబడిన వారి తీరు ఆ విధంగా లేదు. చాలా దారుణంగా ఉంది.
లేదా,
2. తాము ఆరాధించే కొడాలి నాని వంటి నాయకుడిని పల్లెత్తు మాట అన్నా సరే.. స్వపక్షం విపక్షం అని తేడాలు చూడకుండా.. అంతుచూడడమే లక్ష్యంగా తెబడగతామని సంకేతం ఇవ్వదలచుకున్నారా? అదే అయితే.. పార్టీలో ఎవ్వరు ఎలా తెగబడి పెచ్చరిల్లుతున్నా.. తతిమ్మా నాయకులంతా ఎప్పటికీ నోరు మూసుకుని ఉండాల్సిందేనా?
అధికార పార్టీ నిజమైన శ్రేయస్సు కోరే నాయకులు.. పార్టీ ఎప్పుడైనా గాడి తప్పితే.. పెడతోవ పడితే.. పార్టీ నాయకులు కార్యకర్తలు పెడతోవ పడితే.. దానిని గుర్తించి హెచ్చరించడానికి , తద్వారా పార్టీని ప్రజల దృష్టిలో ఎప్పటికీ సమున్నతంగానే నిలపడానికి ప్రయత్నించాలా వద్దా?
ఇప్పుడు ఒంగోలు దాడి తరహాలో మరికొన్ని సంఘటనలు జరిగితే.. పార్టీ నాయకుల్లోని లోపాలను బయటకు చెప్పడానికి ఎవ్వరైనా సాహసిస్తారా? దానివలన పార్టీకి మేలు జరుగుతుందా? చేటు జరుగుతుందా? వారే తర్కించుకోవాలి?
.

Discussion about this post