ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ బాధ్యతలు తీసుకున్నారు. ఆదిత్యనాధ్ దాస్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంలోనే రాబోయే రోజుల్లో ఆయన ఎదుర్కొనవలసిన అసలు సవాలు.. బహిరంగ సంకేతంలాగానే ధ్వనించింది. నిధుల సమీకరణే కొత్త సీఎస్కు పెద్ద సవాలు- అని వీడ్కోలు తీసుకున్న సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ అనడంలో మర్మం ఇదే.
ఆదిత్యనాధ్ దాస్ కు మరో మూడు నెలలు పదవి పొడిగింపు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి.. సమీర్ శర్మను తక్షణం సీఎస్ పదవిలోకి తేవడానికి మొగ్గు చూపడం వెనుక కీలకం కూడా.. అదే. నిధుల సమీకరణే. కేంద్రంతో ఎంతో మంచి సంబంధాలు, కేంద్రంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం, కేంద్రంలోని పెద్దలతో సాన్నిహిత్యం, ప్రొసీజర్ మీద అపారమైన పట్టు ఇవన్నీ కలిపి.. సమీర్ శర్మ.. ఇక్కట్లలో ఉన్న రాష్ట్రప్రభుత్వానికి అండగా ఉండగలరనే ఉద్దేశంతోనే.. జగన్ ఆయనను ఇప్పటికిప్పుడు సీఎస్ గా తీసుకువచ్చారు.
ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు.. అనేది ఈ సందర్భానికి వర్తించే సిద్ధాంతం. ఆదిత్యనాధ్ దాస్ మరో మూడు నెలలు పదవిలోనే ఉంటే.. ఈలోగా రెండు నెలల సర్వీసు మాత్రమే ఉన్న సమీర్ శర్మ రిటైరవుతారు. తర్వాత కుదరదు. అదే ఇప్పుడే సీఎస్ చేసేస్తే గనుక.. రెండు నెలల సర్వీసుకు అదనంగా రెండువిడతలుగా ఆరునెలల ఎక్స్టెన్షన్ ఇస్తే ఎనిమిది నెలల పాటు సమీర్ శర్మ సేవలు అందుబాటులో ఉండగలవనేది వ్యూహం.
తర్వాత్తర్వాత శ్రీలక్ష్మి ఖరారే!
సమీర్ శర్మ పదవీకాలం ముగిసిన తర్వాత.. జవహర్ రెడ్డి గానీ నీరభ్ కుమార్ ప్రసాద్ గానీ సీఎస్ అయ్యే అవకాశం ఉంది. అయితే వారు కూడా ఆ పదవిలో కొన్ని నెలలు మాత్రమే కొనసాగుతారు. ఆ తర్వాత శ్రీలక్ష్మి చీఫ్ సెక్రటరీ కావడం మాత్రం ఖరారు అని విశ్వసనీయంగా తెలుస్తోంది.
యెర్రా శ్రీలక్ష్మి ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్న కేసుల్లో కొన్నింటిలో ఆమె కూడా నిందితురాలుగా ఉన్నారు. ఓబులాపురం మైనింగ్ కు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కొంటున్నారు. ఇదంతా ఇలా ఉండగానే.. రాష్ట్ర విభజన సమయంలో.. తెలంగాణకు కేటాయింపబడిన శ్రీలక్ష్మిని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా విన్నవించి మరీ.. ఏపీ సర్వీసుకు తెప్పించుకుంది.
ఏపీ సర్వీసులోకి వచ్చిన తర్వాత.. తొలుత ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చి, రెండునెలల వ్యవధిలోనే తిరిగి స్పెషల్ చీఫ్ సెక్రటరీ చేశారు. మొత్తానికి సమీర్ శర్మ తర్వాత, మరొకరు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించిన తరువాత.. తిరిగి చీఫ్ సెక్రటరీగా పగ్గాలు శ్రీలక్ష్మి చేతికి వస్తాయని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
మన విలువను వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడం అవసరం
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
శ్రీలక్ష్మికి ఇంకా సుదీర్ఘమైన కెరీర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ప్రకారం.. వచ్చే ఎన్నికల సమయానికి చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి ఉంటారు. కోర్టులో నలుగుతున్న కేసులు ఆమె చీఫ్ సెక్రటరీ కావడానికి పెద్దగా ప్రతిబంధకం కాకపోవచ్చుగానీ.. విపక్షాల విమర్శలను ప్రభుత్వం ఎలా తట్టుకుంటుందో చూడాలి.
.

Discussion about this post