Warning: Undefined array key "pt-cv-view-type" in /home/adarsini/public_html/wp-content/plugins/content-views-query-and-display-post-page/includes/block_view.php on line 112
ఒకసారి ఒక మెట్టు ఎక్కిన తర్వాత.. మళ్లీ కిందిమెట్టు మీదికి వెళ్లాలంటే.. చాలా అంతర్మధనం ఉంటుంది. జీవితం కిందిమెట్టు మీదనే స్థిరపడిపోతుందని, కెరీర్ స్తంభించిపోతుందని, సమాధి అయిపోతుందని రకరకాల భయాలు వెంటాడుతుంటాయి. సరైన అవకాశం కోసం ఎదురు చూడడమా? ఏదో ఒకటి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందడుగు వేయడమా? చాలా మందికి ఏదో ఒక దశలో ఎదురయ్యే ఈ గుంజాటన చిన్నది కాదు! ఘంటసాల జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళ్దాం..
నేటి తరం గాయకులు పదోచ్ఛారణ సరిగా చేయలేకున్నా.. అవకాశాలకోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తూ.. ఎలాగోలా అవకాశాలు దక్కించుకుని గాయకులుగా చెలామణి అవుతున్నారు. కానీ ఘంటసాల మనందరికీ అమరగాయకుడిగా చిరపరిచితుడు. ఆయన గానమాధుర్యం ముందు ఎవరూ సరిరారు. అలాంటి ఘంటసాల జీవితం వడ్డించిన విస్తరి కాదని మనలో చాలామందికి తెలియదు.
తండ్రి నుండి వచ్చిన సంగీత పరిజ్ఞానంతో ఎలాగైనా తాను పెద్ద సంగీత విద్వాంసుడిని కావాలనే పట్టుదలతో అనేక ప్రయత్నాలు చేసిన ఘంటసాల.. తన సంగీత జ్ఞానాన్వేషణలో భాగంగా పలువురు సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసి, ఇందులో భాగంగా వారి ఇళ్లలోని పనులను చేస్తూ, విద్యను అభ్యసించారు.
ఇలా ఇంటిపనులు చేయడానికి కారణం తగినంత ఆర్ధిక స్థోమత లేకపోవడం. సంగీతాధ్యయనానికి గురువుగారికి ఇవ్వవలసిన సొమ్ము తనవద్ద లేకపోవడంతో ఇలా ఇంటిపనులను చేస్తూ తాను సంగీతాన్ని అభ్యసించాడు.
ఇలా తాను సంకల్పించిన సంగీతాధ్యయన యజ్ఞంలో భాగంగా అనేక కష్టాలను అనుభవించాడు. అయినా ఆయన వెనుకాడలేదు. ఆయన కష్టానికి తగిన ఫలితంగా ఆయనకు తొలి సినిమా అవకాశం వచ్చింది. నేపధ్యగాయకుడిగా స్వర్గసీమ సినిమాతో తన గళం వినిపించాడు. తర్వాత అదేసంవత్సరం చిత్తూరు నాగయ్య దర్శకత్వంలో వచ్చిన త్యాగయ్య చిత్రంలో తన గళం వినిపించాడు.
ఇక్కడ మనం ఘంటసాల గానాన్ని గుర్తించే అవకాశం ఉండదు. ఎందుకంటే సహజంగానే గాయకుడైన చిత్తూరు నాగయ్య త్యాగయ్య సినిమాలోని పాటలన్నింటినీ తాను పాడుకున్నారు. అయితే ఇందులో ఒక పాటలో త్యాగయ్య శిష్యబృందం గానం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి బృందగానంలో ఘంటసాల తానూ గొంతుకలిపి గానాలాపన చేశారు.
Also Read these articles :
ఒకసారి నేపథ్య గాయకుడి అవతారం ఎత్తిన తర్వాత.. మళ్లీ వెనక్కు వెళ్లి, కోరస్ లో పాడడం అంటే ఎవరైనా అవమానకరంగా భావిస్తారు. కానీ.. ఘంటసాల అలాంటివేం పట్టించుకోలేదు.
అంటే మంచి అవకాశం కోసం ఎదురుచూడకుండా ఏచిన్న అవకాశం దొరికినా దాన్ని అందిపుచ్చుకుని ముందుకు రావడానికి ఘంటసాల ప్రయత్నించేవారని మనకు అర్థం అవుతుంది.
తర్వాత 1947 స్వాతంత్ర్యం సిద్ధించిన సంవత్సరంలో విడుదలైన పల్నాటి యుద్ధం సినిమాలో ఘంటసాలకు మళ్లీ పాట పాడే అవకాశం లభించింది. ఒకటి ఘంటసాల కోరస్ తో కలిసి పాడగా,. ‘తెరతీయగరాదా దేవా’ అంటూ ఆలపించే మరో పాటలను ఆనాటి మరో మేటి గాయని, నటీమణి కన్నాంబతో కలిసి ఆలపించారు. పల్నాటియుద్ధం ముగిసిన తర్వాత అటు బ్రహ్మనాయుడిలోను, ఇటు నాగమ్మలోను పశ్చాత్తాపం రావడంతో వారిద్దరూ కలిసి చెన్నకేశవుడి సన్నిధిలో ఈ పాటను ఆలపిస్తారు. ఆ పాట ఇలా సాగుతుంది..
ఘంటసాల : తెరతీయగరాదా దేవా
తెరతీయగరాదా దేవా
తెరతీయగరాదా దేవా
తెరతీయగరాదా
కన్నాంబ : తనవారూ పెరవారలనీ
తనవారూ పెరవారలనీ
తరతమ భావములు మానీ
తరతమ భావములు మానీ
ఘంటసాల : జగదానందమే పరమార్థముగా
జగదానందమే పరమార్థముగా
నరులు బ్రతుకరాదా కాదా
నరులు బ్రతుకరాదా కాదా
తెరతీయగరాదా
ఘంటసాల, కన్నాంబ : సత్యము శివము సుందరమౌ
సాత్విక రూపము నిత్యముకాదా
మాలో ఇక అనురాగము సమత
మాలో ఇక అనురాగము సమత
శాంతి శాశ్వతము కావా
శాంతీ శాశ్వతమూ కాదా
ఈ చిత్రంలోనే ఘంటసాల మరో పాటను కూడా ఆలపించారు. తర్వాత అదే ఏడాది కె.వి.రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న యోగి వేమన చిత్రంలో కూడా ఘంటసాలకు ఒక పాట పాడే అవకాశం లభించింది.
ఇలా చిన్న చిన్న అవకాశాలను కూడా వదులుకోకుండా అందిపుచ్చుకుంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ చివరికి శిఖరాగ్రానికి ఎగబాకి.. తెలుగు ప్రేక్షకుల హృదయ పీఠాలపై తిష్టవేసుకున్నాడంటే అతిశయోక్తి కాదేమో..! అలాంటి ఘంటసాలను రోజూ ఏదో ఒక పాట రూపంలో తలచుకొందాం.
.. ఆరంబాకం అన్నపూర్ణ
తెర తీయగ రాదా పాటను దిగువ చూడండి :

.