Warning: Undefined array key "pt-cv-view-type" in /home/adarsini/public_html/wp-content/plugins/content-views-query-and-display-post-page/includes/block_view.php on line 112
‘ఘంటసాల- భువన విజయము’ పేరిట విఎకె రంగారావు గారి సారథ్యంలో 1971లో ఒక పుస్తకం ప్రచురితం అయింది. ఆనందమోహన కావ్యమాల తరఫున, రంగారావు గారే ఆ పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలో ఘంటసాల వేంకటేశ్వరరావు గారు తన సొంతకథను తానే రాసుకున్నారు. (ఒకరకంగా సంక్షిప్త ఆత్మకథ). ‘మీ ఘంటసాల కథ’ శీర్షికతో ఆ సుదీర్ఘ వ్యాసం ప్రచురితం అయింది. ఆయన చెప్పుకున్న సొంత కథ adarsini.com పాఠకులకోసం తిరిగి అందిస్తున్నాం. ఘంటసాల శతజయంతి సంవత్సరంలో.. ఈ ఘంటసాల కథను వరుసగా అందిస్తాం. ఆదర్శినిలో ప్రచురణకు అనుమతించిన విఎకె రంగారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. -సంపాదకుడు
ఒక సామాన్య కుటుంబంలో 1922 డిసెంబరు 4వ తేదీని నా జీవిత కథ ప్రారంభం అయింది. మా తల్లిదండ్రులకు కలిగిన సంతానంలో నేను మధ్యముణ్ణి. మా తండ్రిగారు ఘంటసాల సూరయ్యగారు సంగీతజ్ఞులు. మృదంగం కూడా వాయించేవారు. ప్రధానంగా వారు తరంగ గానంలో ప్రత్యేక కృషి చేసిన వారు. నేడు తరంగ గానంలో సుప్రసిద్ధులైన వారు చాలమంది వారి నుండి శిక్షణ పొందిన వారే.
అయితే మా తండ్రిగారు సంసార జీవితంలో అతి నిర్లిప్తంగా ఉండేవారు. ఇంట్లో ఉంటే జపం చేసుకొంటూ ఉండడం, బయటకు పోతే ఏ ఏకాహాలలోనో, సప్తాహాలలోనో, భజన కాలక్షేపాలలోనో, తన్మయులై గానం చేస్తూ ఉండడం. ఇంతే వారి జీవిత విధానం. సంసార బాధ్యతలను విస్మరిస్తున్నారని బంధువులంతా విమర్శించేవారు ఆయన్ని.
మా తండ్రిగారి విషయంలో నా బాల్యస్మృతి ఒకటి ఎప్పుడూ మనస్సుకి తడుతూ ఉంటుంది. మృదంగం వీపున కట్టుకొని, నన్ను భుజం మీద ఎక్కించుకొని, ఎంత దూరమైనా ఎక్కడ భగవత్సంకీర్తనం జరిగితే, అక్కడకి హాజరయి, తాను మృదంగం వాయిస్తూ, పాడుతూ, నా చేత నృత్యం చేయిస్తూ ఉండేవారు.
నాటి నా బాల్య స్వరూపం, నృత్యం అందరికీ ముచ్చట కొలుపుతూ ఉండేవి. ఆ రోజుల్లో నన్ను ‘‘బాల భరతుడు’’ అని అందరూ ముద్దుగా పిలిచేవారు. ఎన్నో బంగారు పతకాలు, బహుమతులు కూడా అప్పట్లో లభించేయి. ఆ బాల్యపు రోజులలోనే విశ్వదాత కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి దర్శనం చేసుకొన్న మధుర స్మృతి ఉంది.
నా పదకొండవ యేట మా తండ్రిగారు కాలధర్మం చెందేరు. చివరి రోజుల్లో ఆయన నన్ను దగ్గరకి తీసుకొని, సంగీత విద్యలో తరించవలసిందిగా ఆదేశిస్తూ ఉండేవారు. మా తండ్రిగారి యావజ్జీవిత తపః ఫలమే నా అభ్యుదయానికి కారణం అని నా నమ్మకం.
మా తండ్రి గారు పోయిన తరువాత నా చదువు సంధ్యలు తిన్నగా జరగలేదు. దృష్టి ఎప్పుడూ ఆటపాటల మీద ఉండేది. మా కుటుంబం అంతా మా మేనమామ ర్యాలి పిచ్చి రామయ్య గారి సంరక్షణ క్రిందికి వచ్చింది.
చివరి రోజులలో తండ్రిగారు చెప్పిన మాటలు ఎప్పుడూ తలపుకి వస్తూ ఉండేవి. ‘ఏమైనా సరే సంగీత విద్య సాధించాలి’ అని నాలో నేను శపధం చేసుకుంటూ ఉండేవాణ్ణి. చుట్టుప్రక్కలనున్న చాలామంది సంగీత విద్వాంసులను ఆశ్రించేను శిక్షణ కోసం. అయితే గురుకుల వాస దీక్షకు నాటి నా బాల్య ప్రవృత్తి తట్టుకోలేకపోయింది. అంతటితో ఏ విధమైన విద్యా వ్యాసంగం లేక యేదో కాలక్షేపం ధోరణిలో పడింది జీవితం. ఈ పరిస్థితులలో ఒక సంగీత సమావేశంలో నేనూ, నా సంగీతం ఎంతో నవ్వుల పాలవడం జరిగింది. నాటినుండి ఒకే వేదన ప్రారంభం అయింది. ‘‘సంగీత విద్య సాధించాలి. తండ్రిగారి ఆత్మకు శాంతి కలిగించాలి. నన్ను అపహాస్యం చేసిన వారిని సంగీత విద్యలోనే ప్రతీకారం చేయాలి.’’ ఇదే నిరంతర ధ్యాస.
నాటికి ఆంధ్రదేశంలో ఏకైక సంగీత కళాశాల విజయనగరంలో మాత్రమే ఉంది. మహామహులు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు మొదలగు సుప్రసిద్ధ విజయనగర సంగీత విద్వాంసుల కీర్తి బాల్యం నుండి కూడా తెలియడం జరిగింది. సంగీత విద్య విజయనగర సంగీత కళాశాలలోనే సాధన చేయాలి. గత్యంతరం లేదు. విజయనగరం వెళ్లడానికి తగిన ప్రోత్సాహం యింట్లో లభించే ఆశ లేకపోయింది.
ఇంట్లో ఎవరికీ తెలియకుండా చేతినున్న బంగారు ఉంగరం విక్రయించి ఆ సొమ్ము పట్టుకుని విజయనగరం చేరుకొన్నాను. సరీగా ఆ సమయానికి సంగీత కాలేజీ వేసవి సెలవల మూలంగా మూయబడి ఉంది. అంతే కాకుండా నేను విజయనగరంలో నిలదొక్కుకొని కాలేజీలో సక్రమంగా ప్రవేశించడానికి కూడా ఎంతో ప్రతికూల వాతావరణం యేర్పడింది.
ఇలాంటి ప్రతికూలతల మధ్య ఆయన సంగీత అభ్యాసం ఎలా జరిగింది..
adarsini.com లో రేపటి వ్యాసంలో చదవండి..

.