విజయానికి అయిదుమెట్లు ఎక్కించే పుస్తకాలు మనకు ఉన్నాయి. అలాంటి పుస్తకాలు విజయాన్ని తమదైన శైలిలో నిర్వచిస్తాయి. ఆ మాటకొస్తే విజయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోరకంగా నిర్వచిస్తారు. అయితే విజయం ఒక్కటే కాకుండా.. జ్ఞానం కూడా జీవితానికి అవసరం అనుకునే మనుషులు కొందరు ఉంటారు. దానిని పొందడానికి మార్గాలేమిటి?
జ్ఞానం అనేది పంచేకొద్దీ పెరుగుతుంటుంది.. ఎంత ఎక్కువ మందికి పంచి పెడితే, అంతగా పెరుగుతుంటుంది.. లాంటి హితోక్తులు మనం పెద్దలనుంచి వింటూ ఉంటాం. నిజానికి ఇలాంటి హితవాక్యాలు పరిమిత సత్యాలు మాత్రమే.
సంపదతో పోల్చినప్పుడు జ్ఞానం పంచేకొద్దీ తరిగిపోకుండా ఉండవచ్చు. కానీ పంచేకొద్దీ పెరుగుతూ ఉండడం అంత ఈజీకాదు . పెరుగుతూ ఉండాలంటే పంచుతూ ఉండడంతో పాటు ఇంకా చాలా కృషి జరగాలి.
ఒక తులనాత్మక ఉదాహరణ చూద్దాం..
మనం ఒక నీటి ట్యాంకును నీటితో నింపుతాం. కింద కొళాయి తిప్పి నీటిని పట్టుకుంటూ ఉంటాం. అందరికీ పంచిపెడతాం. కొన్నాళ్లకు ట్యాంకు ఖాళీ అవుతుంది. మళ్లీ నింపితే తప్ప నీళ్లు రావు. ఇది అచ్చంగా సంపదకు వర్తిస్తుంది. మళ్లీ ఖజానాను నింపితే తప్ప మళ్లీ అందరికీ పంచిపెట్టడం సాధ్యం కాదు.
జ్ఞానం విషయంలో పరిస్థితి వేరు. ఈ తరుగుదల అనేది ఉండదు. నీళ్లు అందరికీ పంచి పెడతాం. మనదగ్గర తరగదు- అందరి వద్ద పెరుగుతుంది. ఇంతవరకు ఓకే. మరి అందరి దగ్గర నీళ్లు సమృద్ధంగా ఏర్పడిన తర్వాత.. ఇంకా ఏం పంచిపెట్టగలం? అక్కడితో ఆగిపోతుంది.
అలా ఆగిపోకుండా ఉండాలంటే.. ఎలా? అలా ఆగిపోయేది అసలు జ్ఞానం ఎలా అవుతుంది?
ఆగిపోకుండా ఉండాలంటే జ్ఞానం కూడా అప్ డేట్ అవుతుండాలి. పంచిన జ్ఞానం అందరికీ చేరేలోగా.. మనలో కొత్త జ్ఞానం కూడా అందిరావాలి. అంటే నిరంతరం అధ్యయనం ఉండాలి. అలా ఉండేదే నిజమైన జ్ఞానం. దాన్ని అందుకోవడానికి ఈ అయిదు మెట్లూ ఉన్నాయి.
యః పఠతి లిఖతి పశ్యతి పరి పృచ్ఛతి పణ్డితాన్ ఉపాశ్రయతి ।
తస్య దివాకరకిరణైః నలినీ దలమివ విస్తారితా బుద్ధిః ॥
నిత్యం చదువుతూ ఉండడం- అంటే అధ్యయనం చేయడం, రాస్తూ ఉండడం- అంటే సాధన చేయడం, పశ్యతి- చూస్తూ పరిశీలిస్తూ ఉండడం, పృచ్ఛతి- ప్రశ్నిస్తూ ఉండడం, పణ్డితాన్ ఉపాశ్రయతి.. గొప్పవారిని ఆశ్రయించడం.. లాంటి పనులు చేస్తున్న వారిలో.. సూర్యకిరణాలు తాకిన తామరపూవు వికసించినట్టుగా బుద్ధి వికసిస్తుందని శ్లోకంలోని భావం.
ఇవి కూడా చదవండి :
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టడం ఎప్పటినుంచి మొదలైందో తెలుసా?
ఒక్క జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టుల నుంచి రక్షించే చట్టం.. సెక్షన్ 41(ఎ)
నిజమైన జ్ఞానాన్ని పొందడం అంటే అధ్యయనం అవసరం అనుకున్నాం కదా. అధ్యయనంలో ఈ అయిదు అంశాలు మిళితమై ఉంటాయి. చదవాలి అంటే తెలుసుకోవాలి, రాయాలి.. తెలుసుకున్నది గుర్తుండాలంటే ప్రాక్టీస్ అవసరం. అక్కడితో ఆగదు.. ఆ రెండు పనుల ద్వారా తెలిసినదానిని పరిశీలనతో మెరుగుపరచుకోవాలి. నిజమో కాదో చూడాలి. ఆ పరిశీలన సవ్యంగా జరిగినప్పుడు.. సందేహాలు కలుుగుతాయి. ప్రశ్నించుకోవాలి. ఒక విషయం గురించి మనలో ప్రశ్న ఉదయించిందంటే.. మనం జ్ఞానాన్ని పొందే దారిలో ఉన్నాం అని అర్థం. అక్కడివరకు వచ్చిన తర్వాత.. జ్ఞానుల్ని, మేధావుల్ని ఆశ్రయించి అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలి.
ఈ అయిదు దశలు పూర్తి చేస్తే.. ఖచ్చితంగా మనలో బుద్ధి, జ్ఞానం అనల్పంగా వికసిస్తుంది.
అందుకే
1. చదవడం
2. రాయడం
3. చూడడం (పరిశీలించడం)
4. ప్రశ్నించడం (సందేహాలు)
5. గొప్పవారిని ఆశ్రయించడం (సందేహ నివృత్తికి)
ఈ అయిదు కూడా జ్ఞానానికి అయిదు మెట్లు అని మనం అభివర్ణించవచ్చు.
ఉన్న జ్ఞానాన్ని పంచిపెట్టేయడంతో పాటు నిరంతర అధ్యయనం సాగుతున్నప్పుడే ఆ జ్ఞానానికి కూడా శాశ్వతమైన రాణింపు ఉంటుంది. ‘నేర్చుకోవడం అయిపోయింది’ అనే భావన ఏ దశలోనూ రాకుండా సాగేదే జ్ఞానార్జన.
.

Discussion about this post