వేదన ఎందుకు కలుగుతుంది. సరదాగా చెప్పుకోవాలంటే.. ‘ప్రేమ ఎందుకు కలుగుతుంది’ లాంటి ప్రశ్నలాగా ఉంటుంది ఇది. ఇదమిత్థమైన సమాధానం దొరకదు. అలాగే, వేదనకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నకు కూడా!
వేదన, కోపం, పరితాపం, దుఃఖం ఇలాంటి, మనం నెగటివ్ గా అనుకునే ఏ భావనలైనా సరే మనమీదనే ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడా వాటి వ్యతిరేక భావనలతో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ కూడా వాటిని అధిగమించలేని మన అసమర్థతకు వ్యక్తరూపాలుగా బయటకు వచ్చేస్తుంటాయి.
ఇవన్నీ కూడా స్వయంకృతాలు. వేదన, కోపం, బాధ కలిగినప్పుడు వాటికి మూలాలను రుజుమార్గంలో అన్వేషిస్తే.. కర్తలుగా మనకు మనమే కనిపిస్తాం.
ఉదాహరణకు- స్నేహితుడితో ఘర్షణ పడతాం. వేదన కలుగుతుంది. అయితే ఈ వేదనకు కారణాలను అన్వేషించడంలో మనం ఎంత రుజుమార్గంలో ఉన్నామనేది కీలకం. సరైన కారణాలను తెలుసుకోలేనప్పుడు పరిష్కారం కూడా సులువుగా దొరకదు. డయాగ్నసిస్ సరిగా చేయకుండా రోగానికి ఏ మందు ఇస్తే మాత్రం ఫలం ఏముంటుంది.
స్నేహితుడితో ఘర్షణ పడిన తర్వాత కలిగే వేదనకు మూలాలను అన్వేషించే క్రమంలో.. స్నేహితుడు ఏ పొరబాటు చేశాడా అనే దిశగానే మన ఆలోచన సమస్తం నడుస్తుంది. అలా జరగడమే డయాగ్నసిస్ దారి తప్పిపోవడం. ఘర్షణ తలెత్తే సమయానికి మనల్ని మనం లిప్తపాటు నియంత్రించుకోలేకపోయామనే స్పృహ మరుగున పడిపోతుంది. ఆ క్షణం నియంత్రణ సాధ్యమై ఉంటే అసలు ఘర్షణే ఉండేది కాదని- వేదనకు ఆస్కారమే లేదని అర్థం చేసుకోము.
స్వయంకృతం అనే పదాన్ని ప్రతిసారీ, అపరాధం అనే పదంతో ముడిపెట్టేయవద్దు. అదేమీ నెగటివ్ పదం కాదు. ఆనందాలు, సంతోషాలు, విజయాలు అన్నీ కూడా స్వయంకృతాలే. అలాగే బాధలు వేదనలు కూడా స్వయంకృతాలే.
బాధలకు మూలాల్ని వెలుపల వెతికే మనం వాటి పరిష్కారాలకు దేవుడిని ఆశ్రయిస్తుంటాం. మన అసమర్థత వలన కలిగే బాధలు, వేదనలకి పరిష్కారం మన సమర్థతలోనే ఉండగలదనే సంగతి తెలుసుకోకుండా వ్యవహరిస్తుంటాం.
భగవంతుడు మనలోనే ఉంటాడని ప్రతి ఒక్కరూ అంటూనే ఉంటారు. కానీ.. కష్టం వచ్చినప్పుడు మాత్రం- భగవంతుడు బయటినుంచి వచ్చి పరిష్కరించాలని ఆశిస్తుంటారు.
పవిత్రగ్రంథం ఖురాన్ లో ఒక మంచి మాట ఉంటుంది.
‘‘వ-ఇన్ యమ్సస్క అల్లాహు బిదుర్రిన్ ఫలా కషీఫా లాహు ఇల్లా హు
వ-ఇన్ యమ్సస్క బిఖైరిన్ ఫహు ఆలా కుల్లి షయిన్ క్వదీర్’’
– అల్ అన్ ఆమ్ (6వ సూరా) – 17వ ఆయత్
‘పరమాత్ముడు ఒకవేళ నీకు ఏదైనా ఆవేదన కలిగిస్తే దానిని దూరం చేయగలవాడు ఆయన తప్ప మరొకరు లేరు. ఒకవేళ ఆయన నీకేదైనా మేలు చేకూరిస్తే, ఆయన ప్రతి పనినీ కూడా చేయగల సమర్థుడు’ అని ఈ ఖురాన్ వాక్యం చెబుతుంది.
ఈ ఆయత్ లోని మాటలలో ‘పరమాత్ముడు’ అనే పదం ఉన్న చోట ‘నువ్వు’ అని రీప్లేస్ చేసి చదువుకుందాం.
‘నీకు ఏదైనా వేదన కలిగితే.. దానిని దూరం చేయగలిగేది నువ్వు మాత్రమే. మరొకరు కాదు. నీకు నువ్వు ఏ సంతోషం కలిగించినా, నువ్వు సమస్తమూ చేయగల సమర్థుడివి.’
ఇది మన మీద మనకు విశ్వాసాన్ని పెంచుతుంది. ఏదైనా సాధించడానికి మాత్రమే కాదు. ఏ దుఃఖంలోనూ, ఏ వేదనలోనూ కూరుకుపోకుండా ఉండే శక్తిని కూడా ఇస్తుంది. భగవంతుడు మనలోనే ఉంటాడని, అంతఃచైతన్యమే భగవత్ స్వరూపం అని నమ్మడంలో ఉండే బలం అది.
ఇవి కూడా చదవండి :
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
మన విలువను వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడం అవసరం
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
.

Discussion about this post