బీమా అంటే మనం డబ్బు కడితే మనకు రక్షణ కల్పించేది అనే మనకు తెలుసు. కానీ మనకున్న క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో కూడా మనం బీమా రక్షణ పొందవచ్చు. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. మనలో చాలామంది క్రెడిట్ కార్డు, లేదా డెబిట్ కార్డు వాడేవారే ఉంటారు. అయితే అందరికీ ఈ ఉచిత ప్రమాద బీమా గురించి తెలియదు. ఇంతకీ ఈ బీమా ఎలా పొందాలో తెలుసుకుందామా..
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అది రకరకాల వేరియంట్ల రూపంలో మానవాళిని బలితీసుకుంటోంది. మనదేశంలో సుమారు 4.65లక్షలమంది కరోనా కాటుకు బలయ్యారు అని అధికారిక లెక్కలు. కానీ లెక్కల్కోకి ఎక్కని కరోనా మరణాలు ఎన్నో మనకు తెలియవు.
అయితే కరోనా ప్రజలకు పలు పాఠాలను నేర్పిందనే చెప్పాలి. అందులో ప్రధానమైనది శుభ్రత కాగా మరొకటి ఉన్నదానితో సర్దుకుపోగల నేర్పు.. పొదుపు. కరోనా దెబ్బకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా అత్యంత దీన పరిస్థితులను ఎదుర్కొన్నాయి.
ఎందరో కరోనా సోకి ఆసుపత్రులపాలై, వైద్యం కొరకు అప్పులపాలై చివరికి కుటుంబ సభ్యులకు అప్పులను మిగిల్చి తాము మాత్రం ఈ లోకం నుండి తప్పుకున్నారుకూడా. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఇలా అనారోగ్యానికి గురై మరణిస్తే అలాంటి వారి కుటుంబాలకు సహాయం చేయడానికి జీవిత బీమా అనేది ఒక ఆర్ధికపరమైన సాధనంగా చెప్పవచ్చు.
మనదేశంలో అందరూ ఇలా జీవిత బీమా చేసుకుని ధీమాగా ఉంటారని చెప్పలేంకదా.. అయితే బ్యాంకు ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరికీ క్రెడిట్, లేదా డెబిట్ కార్డు అనేది మాత్రం కచ్చితంగా ఉంటుంది.
ఈ కార్డులు ప్రభుత్వ, లేదా ప్రైవేటు బ్యాంకులు జారీ చేసినవైనాకూడా సదరు కార్డు హోల్డరు ప్రమాదంలో మరణించినా, లేదా మరేదైనా ప్రమాదం వల్ల ఆసుపత్రులపాలైనా వారి జేబులోని కార్డులు వారికి బీమా కవరేజిని అందిస్తాయట. కానీ ఈ విషయం మనలో చాలామంది కార్డు హోల్డర్లకు తెలియదు. నిజానికి మనదేశంలో సెప్టెంబరు 2021 నాటికి సుమారుగా 92కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది.
మనవద్దనున్న క్రెడిట్, లేదా డెబిట్ కార్డుల విలువనుబట్టి మనకు సుమారు 50 వేలనుండి 10 లక్షల రూపాయల వరకు బీమా రక్షణ లభిస్తందని మనకు తెలియదు. మనకు ఏదైనా ప్రమాదం జరిగిన కారణంగా ఆసుపత్రులపాలైతే, లేదా ప్రమాదంలో మరణిస్తే ఈ బీమా మనకు లభిస్తుంది. అయితే మనకు ప్రమాదం జరిగడానికి కనీసం 90 రోజుల ముందు మనం సదరు కార్డులను వాడి ఉండాలి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి.
అంటే మన కార్డులను ఏటిఎంలలో, లేదా పాయింట్ ఆఫ్ సేల్, ఇ కామర్స్ వంటి వాటిల్లో మనం వాడి ఉండాలి. అలాంటప్పుడే మనం బీమా క్లైం చేసుకోవడానికి వీలుంటుంది.
ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాల్సి ఉంది. ఏమంటే ప్రమాదం జరిగిన 90 రోజుల లోపే మనం బీమా గురించి క్లైమ్ చేసుకోవాలి. అలాకాకుండా 90 రోజుల తర్వాత బీమా గురించి క్లైమ్ చేస్తే బ్యాంకువారు దీన్ని తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ పెద్ద ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు సదరు వ్యక్తి ఏబ్యాంక్ లో ఖాతావుందో, అందులో తన నామినీగా ఎవరిని నమోదు చేశాడో, సదరు వ్యక్తి వెళ్లి వివరాలు బ్యాంకువారికి అందజేసి బీమాని క్లైమ్ చేసుకోవాలి.
అంతేకాదు.. కార్డు హోల్డరుకు ఇతర బీమా కవరేజీ ఉన్నాకూడా ఈ బీమా క్లెయిమ్ పొందడానికి ఎలాంటి అడ్డం ఉండదు. అయితే ఇందుకు కావలసిన కొన్ని ముఖ్యమైన పత్రాలను.. అనగా ప్రమాదం తర్వాత మరణించినా, లేదా శాశ్వత వైకల్యం పొందినా వాటిని ధృవీకరించడానికి అవసరమైన పత్రాలను బ్యాంకువారికి సమర్పించాల్సి ఉంటుంది.
మనలో చాలామందికి ఎస్.బి.ఐ రూపే కార్డులు ఉంటాయి అలాంటి వారు ఈ బీమాను పొందడానికి అవసరమైన పత్రాలు ఏవంటే
- సరిగా నింపిన క్లైమ్ పత్రాలు
- మరణిస్తే దానిని ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు
- ప్రమాదాన్ని తెలుపుతూ పోలీసు రికార్డుల్లో నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్. ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ కాపీ
- కెమికల్ ఎనాలసిస్, ఎఫ్.ఎస్.ఎల్. రిపోర్టులతో కూడిన పోస్ట్ మార్టం రిపోర్టు ఒరిజినల్ లేదా దానిని ధృవీకరించిన కాపీ
- ఎవరైతే నామినీగా ఉన్నారో వారిది, అలాగే కార్డు హోల్డర్ ది ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు
- కార్డుకు సంబంధించిన వివరాలను ధృవీకరిస్తూ బ్యాంకు అధికారులు సంతకం చేసి, స్టాంపు వేసిన డిక్లరేషన్, దీనితోబాటు బ్యాంక్ స్టేట్ మెంట్, నామినీ పేరు, అతని బ్యాంకింగ్ పాస్ బుక్ వివరాలు, ఇంగ్లీషు లేదా హిందీలోకి తర్జుమా చేసిన ఎఫ్.ఐ.ఆర్. నకలు, ఇంకా ఇ-మెయిల్ ఐడీతో సదరు బ్యాంకు అధికారి పేరు, కాంటాక్ట్ వివరాలు అందజేయాలి.
ఈ వివరాలను అందజేస్తే మన జేబులోని కార్డు కేవలం మన అవసరాలకే కాకుండా మనం ప్రమాదానికి గురై, మనకేదైనా జరిగినా మన కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్, డెబిట్ కార్డులను వాడేవారు..!
.