ధరల పెరుగుదలకు నిరసనగా ఉద్యమిద్దామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం తొట్టంబేడు మండలం కాసరం పంచాయతీ పరిధిలో కరపత్రాలు, అగ్గిపెట్టె, కొవ్వొత్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గాలి చలపతి నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసరకుల ధరలు విపరీతంగా పెంచేస్తున్నారని చెప్పారు.
వీటితో పాటు విద్యుత్ ఛార్జీలు మూడేళ్ల వ్యవధిలో ఏడు సార్లు పెంచారన్నారు. ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల నియంత్రించాలంటే పార్టీలకు అతీతంగా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి రాగానే విస్మరించార్నారు. ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తాన్నారని విమర్శించారు. వెకిలి నవ్వులు నవ్వుకుంటూ జనాన్ని నానా ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో హుందాతనంగా వ్యవహరించి, ప్రజల మన్ననలు పొందారని చెప్పారు.
భారతదేశ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాసరం తేదేపా సీనియర్ నాయకులు చెన్ను సుబ్బరామయ్య అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని ఆస్పత్రిలో చికిత్స పొంది, స్వగ్రామం చేరుకున్న అతనిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళీ నాయుడు, భాస్కర్ నాయుడు, రాఘవులు, రత్నయ్య నాయుడు, మాధవయ్య, శ్రీనివాసులు రెడ్డి, మస్తాన్, చెంగల్రాయులు, చెంచయ్య, వెంకటసుబ్బయ్య, గోవర్ధన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
.