“ఏంటోరా, ఉదయం నుంచి ఏమీ తోచడంలేదు. బోరుగా ఉంది. ఏం జీవితమో ఏమో! ఏ పనీ కావడంలేదు. ఇప్పుడు నాకు టైం బాగలేదేమోరా. క్షణమొక యుగంలా గడుస్తోంది” అని కొందరు…
“అసలు టైం ఎలా గడిచిపోతుందో తెలియడంలేదురా. మొన్న టెన్త్ చదివినట్లు ఉంది. అప్పుడే పెళ్ళైపోయి, పిల్లలు కూడా పుట్టి, వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి” అని మరికొందరు తరచూ మాట్లాడుకుంటుంటారు.
ఎందుకంటే.. మన పరిస్థితులు ఎలా ఉన్నా, మారినా, మారకపోయినా కాలం అనేది మాత్రం ఎవరికోసమూ ఆగక అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది.
ఎంతటి ధనికుడైనా, నిరుపేదైనా కాలం దృష్టిలో సమానమే.
ఎవరైనా రోజులో ఇరవై నాలుగు గంటలకు లోబడే తన కార్యకలాపాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కరి కార్యకలాపాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి.
ఎవరు ఏ పని చేసినా ఏదో ఒక సందర్భంలో సుఖం, దుఃఖం అనేవి ప్రతిఒక్కరికీ అనుభవంలోకి వచ్చేవే. ఎవరూ ఎప్పుడూ సుఖంగానూ ఉండలేరు. అదేవిధంగా దుఃఖంగానూ ఉండలేరు. ఎప్పుడూ సుఖంగా ఉన్నా నరకమే. ఎప్పుడూ దుఃఖంగా ఉన్నా నరకమే. రెండూ ఉంటేనే జీవితానికి అసలైన మజా.
కానీ, మనం ఆ విషయాన్ని గుర్తించక, ఎప్పుడూ సుఖాన్నే కోరుకుంటాం. అందువల్ల జీవితం నరకప్రాయంగా అనిపిస్తుంది.
‘సుఖదుఃఖాల సమ్మేళనమే జీవితం’ అని తెలిసినా, ఏదైనా సమస్య కలిగినప్పుడు…”ఎందుకు నాకే ఈ సమస్యలు కలుగుతున్నాయి. నేనేం పాపం చేశాను?” అని తెగ బాధపడిపోతుంటాం. నిజానికి ఆ సమస్య వల్ల బాధ కలగదు. దాని గురించి ఆలోచనే మనల్ని మరింత బాధిస్తుంది. అంతేకాదు అదే సమస్యలు తనతోపాటు ఇతరులకు కలిగినప్పుడు మనకు అంత బాధ అనిపించదు.
అంటే.. ఏదైనా మనకు కలిగిన బాధ- అందరికీ కలిగితే సంతోషం. అదే మనకు కలిగిన సంతోషం- అందరికీ కలిగితే దుఃఖం.
వాస్తవం ఏంటంటే.. లోకంలో ఎవరూ సుఖంగానూ లేరు. అలాగని దుఃఖంగానూ లేరు. అందరూ సుఖదుఃఖాలను సమంగానే అనుభవిస్తున్నారు.
ఎలాగంటే.. మన శరీరంలోని ఏ భాగానికైనా అస్వస్థత కలిగినప్పుడు ఆ బాధను శరీరమంతా అనుభవిస్తుంది. అలాగే మన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగినప్పుడు ఆ బాధను ఇంట్లో వాళ్ళందరూ అనుభవిస్తారు.
అదేవిధంగా ఊర్లో ఎదైనా ఉపద్రవం కలిగినప్పుడు ఆ బాధను ఊరంతా అనుభవిస్తుంది. అలాగే దేశానికి సంబంధించిన బాధ కలిగినప్పుడు ఆ బాధను దేశ ప్రజలంతా అనుభవిస్తారు.
అదేవిధంగా.. సంతోషం విషయంలో కూడా అందరూ అదే అనుభవంలో ఉంటారు.
అంటే.. సుఖదుఃఖాలనేవి అందరికీ సమంగా పంచబడుతాయి అనేది సుస్పష్టం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
అందువల్లే.. ఏ కారణం లేకపోయినా ఒక్కోసారి మనసు బాధగాను, ఒక్కోసారి సంతోషంగాను అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం సుఖదుఃఖాలు అనేవి ప్రపంచమంతా సమంగా పంచడంవల్లే.
కారులో పయనించే వాడు ప్రశాంతంగా ఉంటాడని, కాలినడకన కదలాడేవాడు కష్టాలలో ఉంటాడని మనం అనుకుంటాం. కానీ, కారులో పయనించేవాడైనా, కాలినడకన కదలాడేవాడైనా ఇద్దరూ అనుభవించేది ఒకే సుఖం. ఒకే దుఃఖం అనేది వాస్తవం.
సృష్టిలో సుఖదుఃఖాలనేవి అందరికీ ఒకేవిధంగా ఉంటాయనే విషయాన్ని మన పూర్వీకులు స్పష్టంగా తెలుసుకున్నారు కనుకనే వాళ్ళు నిశ్చింతగా ఉండిపోయారు. ఆ నిశ్చింత వల్లే.. మన పూర్వికులు వాళ్ళవాళ్ళ వృత్తిని ఇష్టంతో చేసుకోవడంతోపాటు సాయంత్రపు వేళల్లో తమ ఇంటి ముందు అరుగులపై ఆనందంగా కాలక్షేపం చేసేవారు.
అంతేకాకుండా.. తీరిక సమయాలలో హరికథా కాలక్షేపం, బుర్రకథా కాలక్షేపం, పురాణ కాలక్షేపాలలో కుటుంబంతో కలిసి ఆనందంగా కాలం గడేవారు.
ఇప్పుడు.. మనమూ టీవీ సీరియల్స్, ఫోనులతో కాలక్షేపం చేస్తున్నాము. కాకపోతే వాళ్ళు చేసిన కాలక్షేపంలో సుఖం ఉండేది. మనం చేసే కాలక్షేపంలో సుఖంలేదు. అంతేతేడా.
మరి ఇప్పుడు మనం కూడా మన పూర్వీకులలాగే నిశ్చింతగా ఉండాలంటే ఏంచేయాలి?
‘సుఖదుఃఖాలు అందరికీ సమమే’ అనే విషయాన్ని మనసులో స్థిరపరచుకోవడంతోపాటు, “నాకు ఏ పరిస్థితి తటస్థించినా, అందుకు నేను అర్హుడనే” అని ఉండగలిగితే ఏ బాధలు మనస్సుకు అంటవు. నీవు అనుకున్నా, అనుకోకపొయినా సుఖదుఃఖాలు అనేవి ప్రతిఒక్కరినీ స్పృశించక మానవు.
కాబట్టి.. సుఖదుఃఖాల విషయంలో మనం చేసేదేమీలేదు. సుఖం వచ్చినప్పుడు సుఖపడాలి. దుఃఖం వచ్చినప్పుడు దుఃఖ పడాలి. అందుకు వేరే మార్గమేమీలేదు. అదే స్థితప్రజ్జత. అంటే, సుఖాన్ని ఎలా స్వీకరిస్తామో, దుఃఖాన్ని కూడా అలానే స్వీకరించాలి.
సుఖమైనా, దుఃఖమైనా భగవత్ప్రసాదంగా స్వీకరించడమే శరణాగతి..
దుఃఖాన్ని తప్పించుకోవాలంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలి. అంటే ఏదో ఒక పనిచేస్తూ ఉండాలి. ఒకవేళ పని పూర్తి అయితే తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
అంటే.. పుస్తకాలు చదువుకోవడమో, రాసుకోవడమో లేకపోతే స్నేహితులతో సంభాషించుకోవడమో ఏదోకటి చేస్తూ ఉండాలి. అంతేగాని ఖాళీగా కూర్చుని దేన్ని గురించీ ఎక్కువ ఆలోచించకూడదు.
కొందరికి ఆధ్యాత్మిక ఉపన్యాసం వింటూ కాలక్షేపం చేయడం ఇష్టం. మరికొందరికి పేకాట ఆడుతూ కాలక్షేపం చేయడం ఇష్టం. ఇంకొంతమందికి పుస్తకాలు చదువుతూనో, సెల్ ఫోను చూసుకుంటూనో కాలక్షేపం చేయడం ఇష్టం. వెరసి అందరూ చేసేది కాలక్షేపమే. అంటే ఎవరికి ఎందులో సుఖం దొరుకుతుందో దాంతో కాలక్షేపం చేస్తారు. ఇందులో మనం ఎవరినీ తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం కాబట్టి. పైగా అందులో వారికి ఎదురయ్యే కష్టసుఖాలను కూడా వారే భరిస్తారు కనుక.
అందుకే…
‘Life is a matter of passing time’.
ఏదో ఒక వ్యాపకంతో కాలాన్ని వెళ్లబుచ్చడమే జీవితం అంటే..
సో ఫైనల్ గా తేలింది ఏంటంటే.. తెలిసో, తెలియకో మనమందరం ఏదో ఒకవిధంగా కాలక్షేపం చేస్తూ జీవితాన్ని గడిపేస్తున్నామన్నమాట..
..దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.

.
Discussion about this post