సుగతకుమారి- భారతీయ సాహిత్యంలో, ప్రత్యేకించి మళయాళ సాహిత్యంలో తనకంటూ ఒక అధ్యాయం కలిగిఉన్న కవయిత్రి- ఉద్యమకారిణి! ఆమె కరోనాతో కన్నుమూయడం పట్ల సాహిత్య ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. తల్లినుంచి పాండిత్యాన్ని, తండ్రినుంచి కవన కౌశలాన్ని, ఉద్యమశీలతను అందిపుచ్చుకున్న వ్యక్తి సుగతకుమారి.
భారతీయ కవయిత్రి, పర్యావరణ, సామాజిక కార్యకర్త అయిన సుగతకుమారి కేరళలో పర్యావరణ, స్త్రీవాద ఉద్యమాలు జరుగుతున్న సమయంలోనే పుట్టింది. ఆమె తల్లి కార్తియాయిని. ఆమె సంస్కృత పండితురాలు. ఆమె తండ్రి బోధేశ్వరన్, కవి. స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా ఉన్న వ్యక్తి. తండ్రి కార్యకలాపాలు సుగతకుమారిని ప్రభావితం చేశాయి. ఆమె 22 జనవరి 1934లో బ్రిటిష్ వారు పాలన కాలం నాటి ట్రావెన్కోర్ రాజ్యంలోని అరణ్ములలో పుట్టింది. ఆ ప్రాంతం ఇప్పుడు పత్తనంతిట్టగా ప్రాచుర్యంలో ఉంది. తన సుదీర్ఘ ప్రస్థానంలో మళయాళ సాహిత్యంలో గొప్ప కవయిత్రిగా ఆమె పేరు తెచ్చుకుంది.
సుగతకుమారికి చాలా అవార్డులు వచ్చాయి. వాటిలో కొన్ని, కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్ (1968), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ (1978), వయలార్ అవార్డ (1984), ఇంకా మరెన్నో..! 2012లో ఆమె సరస్వతి సమ్మాన్ పురస్కారం కూడా పొందింది. ఆమె ఈ అవార్డ్ పొందిన మూడవ మలయాళ రచయిత.
కవితలలోనే కాకుండా, సమాజానికి, ప్రకృతికి, ఆమె చాలా సేవ చేసింది. ప్రకృతి కోసం ఏర్పరచిన ప్రకృతి సంరక్షణ సమితికి మాత్రమే కాకుండా, అనాధ ఆడవాళ్లకు, మానసిక అనారోగ్యుల కోసం ఏర్పరచిన అభయకు ఆమె వ్యవస్థాపక కార్యదర్శి. కేరళ రాష్ట్ర మహిళల కమిషన్కు చైర్పర్సన్గా ఉంది.
సుగత కుమారి సామాజిక ఉద్యమకారిణి కూడా. పాలక్కడ్ సైలెంట్ వాలీలో ఒక హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ రాబోతోంది అని అక్కడి వాళ్లకు తెలియగానే, అక్కడి స్కూల్ టీచర్లు, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ వారు కలిసి ‘సేవ్ సైలెంట్ వాలీ’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో సుగతకుమారి చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు.
తిరువనంతపురంలోని యూనివర్సిటీ కళాశాలనుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక, 1955లో ఫిలాసఫీ మాస్టర్స్ డిగ్రీ తీసుకుంది. ఆ తరవాత 3 ఏళ్ల వరకు మోక్ష భావనకు సంబంధించి పరిశోధన చేసింది కానీ థీసిస్ పూర్తి చేయలేకపోయింది.
ఆమె పర్యావరణ పరిరక్షణ పట్ల చేసిన సేవకు భారత ప్రభుత్వం ఆమెకు మొదటి ఇందిరా ప్రియదర్శిని వృక్ష మిత్ర అవార్డు ఇచ్చింది.
మన దేశం కోసం ఇన్ని మంచి పనులు చేసిన సుగతకుమారి, 2020 డిసంబర్ 23న తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కోవిడ్-19 మూలాన చనిపోయారు. కోవిడ్-19 కు పాజిటివ్ వచ్చాక ఆమెకు బ్రాంకియల్ న్యుమోనియా కూడా వచ్చింది. దీని వల్ల ఆమె ఇతర ప్రధాన అవయవాలు కూడా దెబ్బ తిని, ఆమె చనిపోయింది.
.