శ్రీకాళహస్తి రెవిన్యూ డివిజను మొదటి ఆర్డీవోగా మీరు బాధ్యతలు తీసుకున్నందుకు ‘ఆదర్శిని’ తరపున అభినందనలు తెలియచేస్తున్నాం. మీరు పేదల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తారని మేము విన్నాం. ఇక్కడ కూడా అలానే ప్రజాసేవ చేస్తారని ఆశిస్తున్నాం.
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలను మీకు తెలియచేస్తున్నాం. ప్రజా సమస్యలు మీకు విన్నవించడం మా బాధ్యత. మీరు కూడా ఈ సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలని మా కోరిక.
*శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల పరిధిలో దీర్ఘకాలికంగా అనేక భూ సమస్యలు ఉన్నాయి.
*శ్రీకాళహస్తి పట్టణ శివారులోని రాజీవ్ నగర్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోంది. కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా చేయడం వలన పేదలకు అన్యాయం జరుగుతోంది.
*తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజీవ్ నగర్ వద్ద టిడ్కో ఆధ్వర్యంలో సుమారు 6వేల ఇళ్లు నిర్మించారు. ఈ అపార్టమెంట్ల కోసం పట్టణ వాసులు చాలా మంది ప్రభుత్వానికి డబ్బు కూడా చెల్లించారు. అయితే ఇంతవరకు ఆ ఇళ్లను పేదలకు పంపిణీ చేయలేదు. ఫలితంగా లబ్దిదారులు నష్టపోతున్నారు.
*తొట్టంబేడు మండలంలో భూ అక్రమాలకు అంతేలేదు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ మార్గాల్లో పెద్దలకు పంచి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 25,26వ తేదీల్లో తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులు తహసీల్దారు కార్యాలయంపై దాడులు చేశారు. రికార్డులు తనిఖీ చేశారు. వారి సిఫారసు మేరకు తహసీల్దారు పరమేశ్వర స్వామిని సస్పెండ్ చేశారు. ఈ అక్రమాల్లో అదే కార్యాలయంలో పని చేసే పని చేసే పలువురు ఉద్యోగుల పాత్ర ఉంది. అయితే వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇందుకు కారణం రాజకీయ ఒత్తిళ్లే కారణమని ప్రచారం ఉంది. ఈ కార్యాలయం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు నిజాయితీగా విచారణ జరిపితే తొట్టంబేడు మండలంలో జరిగిన భూ అక్రమాలు వెలుగులోకి వస్తాయని మా నమ్మకం.
*శ్రీకాళహస్తీశ్వర ఆలయం అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. దళారీ వ్యవస్థ కారణంగా సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రాహు-కేతు పూజా మండపాల్లో భక్తుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. ఈ అక్రమాలు అరికట్టాల్సి ఉంది.
*శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో చాలా చోట్ల దళితులకు స్మశాన వాటికలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య చాలా కాలంగా ఉంది. శ్రీకాళహస్తి పట్టణ శివారులో రాజీవ్ నగర్ లో సుమారు 10వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినా వారికి ఇంతవరకు స్మశానం కేటాయించలేదు. కొన్ని గ్రామాల్లో స్మశానానికి వెళ్లడానికి దారి లేదు. ఈ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనకు స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటినా ఆరు అడుగుల నేల కోసం పేదలు ఇబ్బందులు పడుతుండటం మనకే అవమానం.
* శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాలను సస్యశ్యామలం చేయడానికి ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన సోమశిల- స్వర్ణముఖి అనుసంధాన కాలువకు దశాబ్ద కాలం దాటి పోతున్నా… ఇంకా విముక్తి కలగలేదు. 2018 నుంచి ఆ కాలువ పనులకు రావాల్సిన బిల్లులు రూ.46కోట్లు పై మాటే. భూ సేకరణ జరిగినా… ఏర్పేడు మండల పరిధిలోని రైతులకు ఇంకా పరిహారం చెల్లించలేదు. నిధుల లేమితో ఈ కాలువ పనులు పూర్తిగా ఆగి పోయాయి. ఈ కాలువ పనులు పూర్తయితే లక్ష ఎకరాలకు పైగా సాగు నీరు అందుతుంది.
* రేణిగుంట మండల పరిధిలోని తారకరామనగర్ లో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను కొందరు దౌర్జన్యంగా ఆక్రమించి విక్రయిస్తున్నారు. దౌర్జన్యాలకు భయపడి పేదలు మిన్నకుండి పోతున్నారు. పేదల స్థలాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది.
*శ్రీకాళహస్తి మండలం మన్నవరం సమీపంలో 2010 సెప్టెంబరులో ఎన్టీపీసీ, బీహెచ్ ఈల్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్టు అంచనా విలువ రూ.6వేల కోట్లు. ఈ ప్రాజెక్టు కోసం 750 ఎకరాల భూమి కూడా కేటాయించారు. పాలకుల చిన్నచూపుతో ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇంతవరకు ఈ ప్రాజెక్టుకు కనీసం రూ.300 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే… ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 15వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అనుబంధ పరిశ్రమలూ వస్తాయి.
*శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు సమీపంలో పాదరక్షల పరిశ్రమ ఏర్పాటుకు రూ.700 కోట్లతో ఎంవోయూ కుదిరింది. పరిశ్రమ కోసం భూ సేకరణ చేశారు. అయితే మూడేళ్లు దాటుతున్నా… ఇక్కడ పరిశ్రమకు పునాది పడలేదు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే వందలాది మందికి ఉపాధి లభిస్తుంది.
*శ్రీకాళహస్తి నియోజక వర్గ పరిధిలోని స్వర్ణముఖినదిలో పెద్ద ఎత్తున ఇసక అక్రమ రవాణా జరుగుతోంది. ఫలితంగా భూగర్భ జలాలు అంతరించి పోతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ అక్రమ రవాణా అరి కట్టాల్సి ఉంది.
*ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మాడవీధులు, జయరామరావు వీధి, సినిమావీధి, పాత బస్టాండు, ఆర్టీసీ బస్టాండు, పీవీరోడ్డు ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఇది దీర్ఘకాలిక సమస్య. ఈ సమస్యపై దృష్టి పెట్టాలి.
*శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. ప్రతి చిన్న కేసునూ తిరుపతికి పంపుతున్నారు. ఇక్కడ మెరుగైన వైద్యం లేక పోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులు ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలి.
* శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో వేసవిలో తాగునీటి సమస్య తరచూ ఉత్పన్నమవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.
నూతన ఆర్డీవో ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం.
నమస్కారాలతో..
మీ ఆదర్శిని,
శ్రీకాళహస్తి.
.