కోవిడ్ వల్ల రాష్ట్రం, దేశం ఎదుర్కుంటున్న ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు (27వ తేదీ వరకు) శ్రీ యాగం నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
లోక కళ్యాణం కోసం 50 సంవత్సరాల తరువాత టీటీడీ ఈ యాగం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.
గురువారం రాత్రి జరిగిన శ్రీ యాగం అంకురార్పణ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
పాంచ రాత్ర ఆగమం ప్రకారం ప్రతిరోజు యాగ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. చివరిరోజు మహాపూర్ణాహుతి తో యాగం ముగుస్తుందని సుబ్బారెడ్డి వివరించారు.
భక్తులు ఈ యాగాన్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కల్పించాలని భావించినా, కోవిడ్ వల్ల ఏకాంతంగా నిర్వహించాల్సి వస్తోందన్నారు. ఈ యాగం వల్ల దేశ ప్రజలకు ధనం, ధాన్యం, గో సంతతి అభివృద్ధి చెందుతాయన్నారు.
శ్రీయాగానికి వేడుకగా అంకురార్పణ
ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుచానూరు ఆలయంలో శుక్రవారం నుండి ఏడు రోజుల పాటు జరుగనున్న శ్రీయాగానికి గురువారం రాత్రి వేడుకగా అంకురార్పణ జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో అర్చకులు శ్రీ వేంపల్లి .శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఏకాంతంగా ఈ యాగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు ఈ యాగాన్ని వీక్షించవచ్చు.
ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆచార్య రుత్విక్ వరణం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు.
జనవరి 21న మొదటిరోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యాగశాల హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహామంగళహారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. జనవరి 22 నుండి 26వ తేదీ వరకు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీయాగం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జనవరి 27న చివరిరోజు ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు చతుష్టానార్చన, హోమాలు, మహాప్రాయశ్చిత్త హోమం, మహాశాంతి హోమం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు మహాపూర్ణాహుతి చేపడతారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు అభిషేకం మరియు అవభృతం నిర్వహిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
శ్రీయాగం కారణంగా జనవరి 20 నుండి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవను టిటిడి రద్దు చేసింది. జనవరి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ దర్శనం రద్దు చేయడమైనది.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి అర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.
Discussion about this post