ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి హస్తినయాత్ర ప్రహసనప్రాయంగా ముగిసింది. సందర్భానికి తగినట్లుగా వెంటనే స్పందించి.. తలచిన రీతిలో.. దుష్ప్రచారాన్ని సాగించడంలో తెదేపా దళాలు.. ఇంకా చాలా చురుగ్గా అప్రమత్తంగా మెదలుతున్నాయనడానికి జగన్ ఢిల్లీ టూర్ ఒక ఉదాహరణ. జగన్మోహన రెడ్డి షెడ్యూలు ప్రకారం.. సోమవారం అమిత్ షాను కలవడం జరగలేదు. ఆ వెంటనే.. షా.. జగన్ తో భేటీకి నిరాకరించినట్లుగా ఒక ప్రచారం సోషల్ మీడియాలో మొదలైపోయింది. ఆ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి వైకాపా దళాలు ఇచ్చిన వివరణలు ఇంకొంత డేమేజీ చేశాయి.
సోమ, మంగళవారాల్లో జగన్ రెండురోజుల ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. సోమవారం అమిత్ షాతో భేటీ అవుతారని ప్రకటించారు. అది కుదర్లేదు. మంగళవారానికి వాయిదాపడింది. పుట్టినరోజు వేడుకల మధ్యలో వెళ్లి కలిశారు. అధికారిక ప్రకటన లాగా 45 నిమిషాలూ షాతో భేటీ అయ్యారో లేదో గానీ.. మొత్తానికి శుభాకాంక్షలు తెలిపి, కానుకలు యిచ్చి, వినతిపత్రం కూడా నివేదించి వచ్చారు. మొత్తానికి మంగళవారం మరో ఇద్దరు కేంద్ర మంత్రులతో ఉన్న భేటీ అపాయింట్మెంట్లను జగన్ రద్దు చేసుకుని తిరిగివచ్చారు.
ఇతర కేంద్ర మంత్రులను కలవకుండా.. వచ్చేస్తున్నారని తెలియగానే, షాతో భేటీ పట్ల జగన్ అసహనానికి గురైనట్లుగా ఒక ప్రచారం జరిగింది. వైకాపా శ్రేణులు దీనికి కౌంటర్ ఇచ్చాయి. జగన్ విజ్ఞప్తుల పట్ల ఇతర శాఖల మంత్రులతో కూడా తానే మాట్లాడతానని అమిత్ , జగన్ కు హామీ ఇచ్చారని అందుకే ఆయన వారిని కలవడం లేదని వారు లీకులు ఇచ్చారు. అధికారిక వార్తల్లో ఇలాంటి మాట లేదు.
అమిత్ షా.. జగన్ తరఫు రాయబారిలాగా ఇతర కేంద్రమంత్రుల వద్దకెళ్లి.. ఏపీ విజ్ఞప్తులకోసం లైజానింగ్ చేస్తారా? అనాలోచితంగా వైకాపా శ్రేణులు ఇచ్చిన వివరణలు అలాంటి అర్థాలనే సంకేతమాత్రంగా తెలియజేస్తున్నాయి. పైగా అమిత్ షా వద్ద జగన్ ప్రధానంగా ప్రస్తావించిన డిమాండ్లు కూడా ఒకపట్టాన కార్యరూపం దాల్చేవి కాదు. పత్రికల్లో వస్తున్న వార్తలను బట్టి.. ప్రత్యేకహోదా డిమాండ్ వినిపించినట్లుగా, అది లేకపోతే పరిశ్రమలు రావని చెప్పినట్లుగా… గోదావరి జలాలను సాగర్ కు తెచ్చే ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని కోరినట్లుగా… తెలుస్తోంది. హోదా అనేది కల్ల. నదుల అనుసంధానం కూడా కేంద్రం ఏమాత్రం చెవిన వేసుకుంటుందో అనుమానమే.
ఇలాంటి శుష్కమైన డిమాండ్ లతో ఢిల్లీ వెళ్లడం వల్ల రాష్ట్రానికి, జగన్ నాయకత్వ యశస్సుకు కూడా పెద్ద ఉపయోగం ఉండదు.
.