పోలీసు ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీమ్ జీవితం వెండితెరమీద ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్స్ వార్ కు చెందిన నక్సలైట్ల మీద ప్రతీకార హత్యలు, పోలీసులతో చెట్టపట్టాలు, భూకబ్జాలు, వందల కోట్ల రూపాయల దందాలు, అధికార పార్టీ నాయకులకు కూడా బెదిరింపులు.. ఇలా అనేక రకాలుగా వార్తల్లో హాట్ టాపిక్ గా చాలాకాలం పాలు నిలిచిన గ్యాంగ్స్టర్ నయీమ్ హతమైపోయాడు.
నయీమ్ జీవితంలో కేవలం ప్రపంచానికి తెలిసిన దందాలు, చీకటి పార్శ్వాలు మాత్రమే ఉన్నాయా? గ్యాంగ్స్టర్ నయీమ్కు ఇంకొక కోణం ఉంటుందా? ఉండదా? అనే సంగతి ప్రజలకు తెలియజెప్పడానికే అన్నట్లుగా.. సాధికారమైన పరిశోధనతో.. అతనిజీవితంలోని అనేక సంఘటలను తెలుసుకున్న దర్శకుడు దామూ బాలాజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్వతహాగా పీపుల్స్ వార్ లోనే తను కూడా పనిచేసిన అనుభవం ఉన్న దామూ బాలాజీకి, నయీమ్ చరిత్ర శోధించడం పెద్ద పని అయిఉండకపోవచ్చు.. కానీ.. ఆ జీవితాన్ని తెరకు ఎక్కించడం మాత్రం పెద్ద సవాలే.
గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న ‘నయీం డైరీస్’ చిత్రం అన్ని హంగులూ పూర్తి చేసుకుని ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాము బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నారప్ప ఫేం వశిష్ఠ సింహ లీడ్ రోల్ చేశారు. సీఏ వరదరాజు నిర్మాత. ఇటీవల విడుదలైన ట్రైలర్ చక్కని స్పందన వచ్చింది. నయీమ్ జీవితంలో తెలియని కోణాలపై ఆసక్తి కలిగించేలా ఉంది.
నయీం కథ వినగానే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాగుంటుందని చేశాం. వశిష్ట సింహ నటన హైలెట్ గా ఉంటుంది అని నిర్మాత సీఏ వరదరాజు అంటున్నారు.
రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయి అన్నది ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని గురించి పూర్తిగా అధ్యయనం చేశాను. తను అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నేనూ విప్లవకారుడుగా ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్నాను. ఒక విప్లవకారుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో చూశాను. అవన్నీ డ్రమటిక్గా సినిమాలో చూపించాను అని దర్శకుడు దాము బాలాజీ అంటున్నారు.
నయీం పాత్ర పోషించిన వశిష్ఠ సింహ నటన సినిమాకు హైలైట్గా ఉంటుందని మేకర్స్ నమ్ముతున్నారు. యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశి కుమార్, జబర్దస్త్ ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – సురేష్ భార్గవ్, సంగీతం– అరుణ్ ప్రభాకర్, ఎడిటర్ – కిషోర్ మద్దాలి, నిర్మాత సీఏ వరదరాజు, రచన దర్శకత్వం దాము బాలాజీ.
Discussion about this post