రైస్ బకెట్ ఛాలెంజ్!
ఎవరో సవాలు విసిరారు. అది అలా అలా ఎగిరి మా ఆఫీసులో వాలింది.
పిడికెడైనా పర్లేదు, బస్తాడైనా వద్దనేది లేదు. అలా సేకరించిన బియ్యాన్ని అవసరార్థులకు- వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు- ఇవ్వాలి. మంచి పనే. మన వంతు నడుం బిగిస్తే నష్టమేముంది!
మా ఫౌండేషన్ నుంచి కంపెనీ ఉద్యోగులందరికీ ఒక మెయిల్ పంపించాను. నాలుగు రోజులు గడిచినా స్పందన లేదు. అయిదో రోజు ఎన్విరాన్మెంటల్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి నా దగ్గరకొచ్చి ‘సర్, నా వంతుగా ఒక బస్తా బియ్యం ఇస్తా’నన్నాడు. అభినందించాను. అదే విషయాన్ని మేం పంపిన మెయిల్కు జవాబుగా అందరికీ పెట్టమన్నాను. అతనలాగే చేశాడు. ఇక మొదలైంది స్పందన. ఒకరి తర్వాత మరొకరు. కొందరేమో విభాగాల వారీగా విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని మాకందించారు. దాదాపు అందరూ తమ విరాళాలను ఫౌండేషన్ అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేసి, మమ్మల్నే బియ్యం కొనమని సూచించారు. తద్వారా ఒకే రకం బియ్యం సేకరించి, అవసరమున్న వారికి పంచవచ్చన్నది ప్రణాళిక.
నాకు తెలిసిన మిల్లు యజమానితో మాట్లాడాను. ఆయన సరసమైన ధరకే మంచిరకం బియ్యం పంపించారు.
మంచానికే పరిమితమైన వృద్ధులకు సేవలందిస్తున్న ఆశ్రమం, అంధ బాలికల వసతిగృహం, బధిరుల వసతిగృహం, అనాథ మహిళల వసతిగృహం.. ఇట్లా నిస్వార్థంగా సేవలందిస్తున్న పదిమందిని మా ఆఫీసుకు ఆహ్వానించాం. తలో చెయ్యివేసి సేకరించిన యాభై బస్తాల బియ్యాన్ని తలా అయిదు బస్తాల చొప్పున అందించాం. పది ఆటోలు మాట్లాడి, ఛార్జీలు కూడా మేమే చెల్లించాం. ఆ పదిమంది కళ్లల్లో నీటిజాడ.
ఆటో ఎక్కబోయి వెనక్కి వచ్చిన ఓ ఆనాథాశ్రమం నిర్వాహకుడు ‘‘అయ్యా! మాకు నెలకో బస్తా బియ్యం అవసరం. కరోనా తర్వాత మాకు విరాళాలు తగ్గాయి. నాలుగైదు నెలలుగా నానా తంటాలు పడుతున్నాం. పాపాత్ముణ్ని.. బియ్యం లేక నాలుగు సార్లు పిల్లల్ని పస్తు పెట్టాను. ఇప్పుడు ఇంకో అయిదు నెలలు దిగుల్లేదు. మీ రుణం తీర్చుకోలేను’’ అన్నాడు రెండు చేతులూ జోడించి.
ఆ మాటలకు మా హెచ్ఆర్ మేనేజర్ సుమతి కదిలిపోయింది. కళ్లు తుడుచుకుంటూ ఆ పెద్దాయన దగ్గరకొచ్చి ‘‘దిగులు పడకండి. ఈ బియ్యం అయిపోయాక ఇంకో అయిదు నెలలకు నేను బియ్యం పంపిస్తాను’’ అంది.
ఆయన దండం పెట్టి, ఆటో ఎక్కాడు.
ఇలాంటి దృశ్యాలు అలవాటులేని మా కంపెనీ ఉద్యోగులు వెళ్తున్న ఆటోల వంక తడి హృదయాలతో చూస్తుండిపోయారు.
* * *
గుప్పెడు బియ్యం!
ఎవ్వరికీ భారం కాదు. భరించలేనంత బరువూ కాదు. ప్రతిరోజూ మనం ఇంట్లో అన్నం వండుకుంటామా! అందుకోసం బియ్యం కడిగిపెడతామా! ఆ కడిగేముందు, బియ్యం కొలుస్తామా! అప్పుడు ఇంకో గుప్పెడు బియ్యం పక్కన మరో సంచిలో వేయాలి. ఇంటింటికీ ఆ ఖాళీసంచులు ఇచ్చివెళ్లిన స్వచ్ఛందసంస్థ నెలాఖరున నిండుసంచులు తీసుకెళ్లిపోతుంది. అలా సేకరించిన బియ్యాన్ని ఆశ్రమాలకు సరఫరా చేస్తుంది.
ఎంతటి నిస్వార్థ సేవ!
ధాన్యం- బతుకుబండికి ఇంధనం.
* * *
ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుంటే, మూడుచోట్ల ట్రాఫిక్జామ్. ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యమైన మూడు పార్టీల నాయకులూ గొంతు చించుకుని అరుస్తున్నారు.
అంశం ఒక్కటే. ధాన్యం కొనుగోలు చేయాలి!
వీళ్లు వాళ్ల మీదా, వాళ్లు వీళ్ల మీదా, మూడో పార్టీ మిగతా ఇద్దరి మీదా.
ఇంటికి వెళ్లి, భోజనానికి కూచోగానే పళ్లెంలో మా ఊరి వరిపొలం ప్రత్యక్షమైంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దమ్ముజేసి, నారు పోసి, ప్రకృతి బీభత్సాలతో సహవాసం చేసి, మట్టిలోంచి సృష్టించిన ధాన్యాన్ని కళ్లకద్దుకునే కనీస శక్తి కూడా లేదా ఈ ప్రభుత్వాలకు?
ఉద్యోగుల టీఏ, డీఏలు పెరిగాయి. ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి. డిపార్టుమెంట్లు కొత్త కార్లతో కళకళలాడుతూనే ఉన్నాయి. భవనాలు అలంకరణలతో మెరిసిపోతూనే ఉన్నాయి.
ఏ అవసరాన్ని కొనుగోలు చేయకుండా నిగ్రహిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు?
‘దానే దానే పర్ ఖానేవాలా కా నామ్ లిఖా హువా రహతా హై’ అంటారు. ప్రతి గింజమీద తినే వాళ్ల పేరు రాసి ఉంటుందని పెద్దలు చెప్తారు.
అబద్ధం. రాస్తే గీస్తే రైతు పేరు మాత్రమే రాయాలి.
కొందరు మహానుభావులు మరింత అడ్వాన్సైపోయి బియ్యపుగింజ మీదా బినామీల పేర్లు రాస్తున్నారు!
.. ఎమ్వీ రామిరెడ్డి
పాత్రికేయుడు, రచయిత, సీఈఓ- రామ్కీ ఫౌండేషన్

.