వరదల వంటి విపత్తు సమయాల్లో ప్రభుత్వం ఉపేక్ష ధోరణితో ఉన్నప్పుడు.. అలసత్వంతో ప్రవర్తిస్తున్నప్పుడు.. అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవడంలో విఫలం అయినప్పుడు.. ప్రజల దుస్థితి తీరేదెలాగా? వారి మంచి చెడులు చూసేదెవరు? ఆదుకునేదెవరు? ఇలాంటి సమయంలోనే నేనున్నానంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఒక భరోసా కల్పిస్తున్నారు.
వరదలతో అతలాకుతలం అయిన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కడపజిల్లాలో నలభై మంది వరకు మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి గానీ.. అనధికారికంగా వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి వంద మందికి పైగానే మరణించి/ గల్లంతై ఉంటారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో సహాయక చర్యలు చాలా చోట్ల మొక్కుబడిగా జరుగుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధితులకు డబ్బులు వేసేస్తాం అని ప్రకటించి చేతులు దులుపుకుంది. స్థానికంగా అధికార పార్టీ సహా వివిధ పార్టీల వారు వర్ష బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులుగా అతలాకుతలం చేసేన భారీ వర్షాల దెబ్బకు ప్రజలు రోగాల బారిన పడ్డారు. దిక్కులేక అలమటిస్తున్నారు. అలాంటి వారి కోసం జనసేనాని పవన్ కల్యాణ్ మార్గదర్శకత్వంలో జనసేన నడుం బిగించింది.
జనసేన ఆధ్వర్యంలో ఈ మూడు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం నుంచి ఈ మెడికల్ క్యాంపులు వర్ష బాధిత ప్రాంతాల్లో సేవలు అందించనున్నాయి. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను కూడా అందజేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మెడికల్ టీమ్ లను ఏర్పాటు చేశారు.
నిజానికి ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు.. ప్రజల బాగోగులకోసం ప్రభుత్వమే మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. అలాంటి ఊసు కనిపించకపోగా.. జనసేన పూనుకుని వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడం విశేషం.
జగన్ పనిని జనసేనాని చేయడం ఇవాళ కొత్త కాదు. రోడ్ల మరమ్మతుల గురించి ప్రభుత్వం పట్టించుకోకుండా ఉపేక్ష ధోరణితో ఉన్నప్పుడు జనసేనాని పూనుకుని.. శ్రమదానం ద్వారా రోడ్ల మరమ్మతులు చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. ఆ చర్యలు ప్రభుత్వంలో కూడా కదలిక తెచ్చాయి. ఇప్పుడు జనసేన మెడికల్ క్యాంపులతో ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చి.. వర్ష బాధిత ప్రాంతాల్లో సమస్తంగా.. బాధితులందరినీ ఆదుకునేలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తే బాగుంటుంది.
.
Discussion about this post