ప్రజాబలంతో ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వాలను… ‘డౌన్ డౌన్’ అంటూ గద్దెదిగాలని ప్రతిపక్ష పార్టీలు రోజూ డిమాండ్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యింది. చట్ట సభలు సజావుగా సాగకుండా విపక్షాలు అడ్డుకుంటుంటే, ఇష్టానుసారంగా చట్టాలు చేసుకోవడానికి ఇదే అదనని అధికార పక్షాలు భావిసున్నాయి.
సిద్ధాంతాలు, విధానాలు, కార్యక్రమాల ప్రాతిపదికన కాకుండా కసి, కోపం, అక్కసు, ఈర్ష్య, ద్వేషంతో రాజకీయ నాయకులు మెలుగుతున్నారు. వచ్చే ఎన్నికలకు కనీసం ఏడాది ముందువరకూ అధికార, విపక్షాలు సమాజ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాస్తంత సామరస్యం, సమన్వయాలతో వ్యవహరించాలని అభిలషిస్తూ సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్.రాము రాసిన వ్యాసం.
రాజకీయాల్లో చేరామా?
మందిని పోగుచేసి ప్రతి దానికీ నానా గొడవ చేశామా?
ప్రత్యర్థులపై నోరు పారేసుకున్నామా?
మతం కార్డు వాడామా? కులం బురదలో మునిగామా?
కొన్ని కోట్లు నాయకులవారికి గిఫ్టిచ్చి టికెట్ తెచ్చుకున్నామా?
మరికొన్ని కోట్లు పెట్టి బీరు- బిర్యానీ- నోట్లు పంచి గెలిచామా?
మంత్రి పదవి కోసం మరికొంత సమర్పించామా?
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వాటా కొట్టామా?
వివిధ టెండర్లలో మనోళ్లకు పనులిప్పించి సొమ్ము చేసుకున్నామా?
బదిలీల్లో కొంత, అవినీతి అధికారుల నుంచి కొంత గుంజామా?
చౌకగా వందల ఎకరాలు పోగేశామా? కబ్జాలు పెట్టి ఇంకొంత కాజేశామా?
నోరెత్తిన వాళ్ళను పోలీసోళ్ళకు చెప్పి బొక్కలో తోయించామా?
మాట చెల్లడం కోసం రూల్స్ వంచామా? నోట్లు వెదజల్లామా?
పెట్టుబడి కి పదింతలు సంపాదించి వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యామా?
కాటికి పోయేలోపు కొడుకును జనాల నెత్తిన యువనేతగా రుద్దామా?
లెక్కలు తేడాగా ఉంటే రాత్రికి రాత్రే పార్టీ మారామా?
ఏ పార్టీలో ఉన్నా ఒక నాలుగు తరాలు కూర్చొని తిన్నా తిరగకుండా ఏర్పాటు చేశామా?
ఇది కాదూ.. నిత్యం మన కళ్ళ ముందు జరుగుతున్నది. వెనకబడిపోతున్న మన దేశం పట్ల భక్తి, సమస్యలతో సతమతమవుతున్న సమాజం పట్ల అనురక్తి, బతుకులు మారని జనాల పట్ల సానుభూతి ఉన్న ప్రతి ఒక్క పౌరుడూ రాజకీయాలను చూసి విలవిల్లాడుతున్నారు, మౌనంగా రోదిస్తున్నారు. నూటికో, కోటికో నికార్సయిన, నిస్వార్ధ పుచ్చలపల్లి సుందరయ్యలో, గుమ్మడి నర్సయ్యలో, నర్రా రాఘవ రెడ్లో కనిపించి ఆశలు సజీవంగా ఉంచుతున్నారు గానీ, ప్రస్తుత రాజకీయ వ్యవస్థను, చట్ట సభల తీరుతెన్నులను చూస్తే అయ్యో ఇదేమి ఘోరమన్న బాధనిపించి, లైన్లో నిలబెట్టి కాల్చిపారేయాలన్నంత కోపం వచ్చి, ఛీ ఛీ ఇంత దిగజారుడా? అన్న అసహ్యం కలిగి, చావనీలే మనకెందుకొచ్చిన గొడవన్న నైరాశ్యం కలుగుతున్నది.
Also Read : మంచితనం నిరూపించుకున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన
ఎక్కడైనా అటూ ఇటుగా ఒకేరకంగా ఉండే రాజకీయ నాయకుల రూపురేఖల విలాసాలు, వారి అఘాయిత్యాలు- అకృత్యాలు- ఘోరాలు- నేరాలు చూశాక మనోధైర్యం కోల్పోయి విద్యావంతులు, సంఘ జీవులు, బుద్ధిమంతులు ఎడంగా జరిగిపోయి తమ పనులు తాము చూసుకోవడం ఉత్తమమని తొలగిపోతున్నారు. దీని మూలంగా– పోరాట యోధుల బలిదానాలతో ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రజాస్వామ్యం నిత్యం ఖూనీ అవుతోంది.
Also Read : ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరుట!
అధికారపక్షం, విపక్షం అనుక్షణం తిట్టుకోవడం, రోజూ బూతులు దోక్కోవడం, వీలున్నపుడల్లా కొట్టుకుచావడం చూసి రాజకీయాలు గూండాగాళ్ళు, రౌడీగాళ్ల పనన్న భావన జనాల్లో నాటుకుపోయింది. ఎన్నికలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సీపీ-తెలుగు దేశం మధ్యన, తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి- వైరిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మధ్యన సఖ్యత సంగతి వదిలేయండి.. కనీసం ప్రాథమిక సభ్యతాయుతమైన మానవ సంబంధాలైనా లేకుండా పోతున్నాయి. ఎడమొహం, పెడమొహంగా ఉండవచ్చు గానీ, హద్దుమీరిన మాటలు, కసి- ద్వేషం తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయి. తిలా పాపం తలా పిడికెడే!
Also Read : చంద్రబాబు కన్నీళ్లు ఆయనకు మేలు చేస్తున్నాయా? నిజమేనా?
1994 జనవరిలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు- విదేశాంగ విధానంలో కాకలుతీరిన, రాజకీయంగా అనుభవజ్ఞుడైన విపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజపేయిని అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు భారత ప్రజల తరఫున మాట్లాడేందుకు ఎంపికచేసి పంపారంటే నమ్మబుద్దికాదు. వైరి పార్టీ నాయకుడి సమర్థతకు ఇంత పెద్దపీట వేయడం ఊహించగలమా? కేసులు చుట్టుముట్టి, గాంధీ కుటుంబం బహిష్కరించి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న పీవీ రచించిన ‘ఇన్ సైడర్’ పుస్తకాన్ని వాజపేయి ప్రేమతో ఆవిష్కరించడం కూడా అబ్బురపరిచే అంశమే. 1971 డిసెంబర్లో పాకిస్థాన్తో యుద్ధం జరిగినప్పుడు సభలో సభ్యులంతా ఇందిరాగాంధీ ప్రభుత్వానికి అండగా నిలిచారు.
అంతకు ఎనిమిది నెలల కిందటనే ఎన్నికల్లో కంగుతిన్న విపక్ష నేతలు (జన సంఘ్ నాయకుడు పీతాంబర్ దాస్, కాంగ్రెస్ చీలిక నేత మురార్జీ దేశాయ్ సహా) సభలో నిలబడి ముక్తకంఠంతో ఇందిరకు మద్దతు, అభినందనలు తెలిపారు. రాజ్యసభలో విపక్షనేత అయిన కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్కు వీడ్కోలు పలుకుతూ ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ సభలో కన్నీరు కార్చడం, మిమ్మల్ని రిటైర్ కానివ్వననీ, మీ సలహాలు కావాలని అనడం కూడా ఎప్పుడో గానీ కనిపించని వింత. విదేశీ శత్రువుకు వ్యతిరేకంగా ఒకతాటిపైకి వచ్చినట్లు దారిద్య్ర నిర్మూలన, సుపరిపాలన కోసం కూడా రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి పనిచేస్తే ఎంత బాగుణ్ణు!
Also Read : మగాళ్ల దినోత్సవం రోజున మోడీ వెనక్కి తగ్గితే, చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చాడు
రాజ్యాంగ నిర్మాతలు అనుకున్న ప్రకారం విపక్షం అనేది అధికార పక్షాన్ని సన్మార్గంలో పెట్టే కాపలా కుక్క (వాచ్ డాగ్) లాంటిది. రెండింటి పరమావధీ ప్రజలకు మేలు చేయడం, అభివృద్ధి సాధించడం. విపక్షం పని ప్రభుత్వ విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సద్విమర్శలు (పాజిటివ్ క్రిటిసిజం) చేయడం. ఇదంతా పోయింది. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ విమర్శించడం, అందులో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను ఎత్తిచూపి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు అనుక్షణం ప్రయత్నాలు చేయడం, ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలని ఉద్యమించడం సాధారణమై పోయింది.
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగ పాఠాన్ని చించి విసిరేయడం, చర్చలు లేకుండా ఆర్డినెన్స్ రూపంలో నిర్ణయాలు అమలు చేయడం, చర్చలేకుండా మూజువాణీ అనే ఒక దరిద్రపు, కంటితుడుపు ఓటుతో బిల్లులు ఆమోదింపజేసుకోవడం, నిండు సభలో ప్రత్యక్ష ప్రసారాలు సాగుతుండగానే మైకులు విరుచుకోవడం, అరుచుకోవడం, విపక్షాలు మాటిమాటికీ బాయ్కాట్ చేయడం వంటివి అన్ని సభల్లో సర్వసాధారణం అయి ప్రజాస్వామ్యాన్ని పలుచన చేస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ తంతు సేమ్ టు సేమ్ ఇంతే!
Also Read : మాట మార్చేసి ఏమార్చే నేత జగన్
ఇంకో పక్కన- అధికారంలో ఉన్న పార్టీ విధానాలు బాగోలేవని ఆరోపిస్తూ.. గతంలో వచ్చిన అవార్డులను కవులు, కళాకారులు, ఇతర ప్రముఖులు తిరిగి ఇచ్చేయడం, ‘గో గవర్నమెంట్.. గో’ అంటూ నినదించడం ఎక్కువయ్యింది. దీనిబదులు, ఈ బుద్ధిజీవులు ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచే బృహత్ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకోవాలి. అందుకు, పత్రికల్లో వ్యాసాలూ, బ్లాగులు తదితర సామాజిక మాధ్యమాల్లో తమ వాదనను క్రమం తప్పకుండా వినిపిస్తూ సర్కార్లకు కనువిప్పు కలిగించాలి, ఓటర్లను చైతన్య పరచాలి.
ప్రజామోదం పొందిన ప్రభుత్వాన్ని ఫలితాలు వచ్చిన మర్నాటి నుంచే ‘డౌన్ డౌన్’ అనడం ఓటర్లను అవమానించినట్లే కదా! ప్రజా క్షేత్రంలో దూకి గళం వినిపించకుండా ప్రతిసారీ ప్రభుత్వాన్ని కూలదోయడమే ధ్యేయంగా పనిచేస్తే లాభం ఏముంటుంది? అంతా ఆ రాజకీయ తానులో ముక్కలే కదా! పోలింగ్ నాటి ప్రలోభాల వల్ల మంచీ చెడూ నిర్ణయించే సామర్ధ్యం, స్థైర్యం కోల్పోతున్న ఓటర్ల చైతన్యం మీద దృష్టి కేంద్రీకరించాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పగ, ప్రతీకారాలతో వ్యవహరిస్తున్న తీరు బాధకలిగిస్తున్నది.
Also Read : కరవును వెనక్కు నెట్టిన వరద
గతంలో బాబు చేసిందే జగన్ ఇప్పడు చేసి చూపిస్తున్నారు, తన స్టైల్ లో. చరిత్ర పునరావృతమవుతున్నదంతే, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఖూనీ అవుతున్నాయంతే! కుప్పంలో ఓడిపోయిన చంద్రబాబును సభలో చూడాలని ఉందని సీఎం కోరుకోవడం, సభకు వచ్చిన చంద్రబాబుపై రన్నింగ్ కామెంట్రీ అనే పొలిటికల్ స్లెడ్జింగ్, విపక్ష నేత బాయ్కాట్, తన భార్యను అవమానించారని అయన వెక్కివెక్కి ఏడవడం ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. ‘ఈ సభకు సీఎం గానే వస్తా’ అని చెప్పి వెళ్లిపోవడం వాళ్లకూ వీళ్లకూ ఒక అలవాటయ్యింది.
Also Read : ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి!
జనం ఓట్లేసింది.. సభలో ఉండి అర్ధవంతమైన చర్చ జరపాలని కదా! పీఠం, కుర్చీ, పవర్ ఉంటేనే సభలో ఉంటానని చెప్పి వెళ్లిపోవడం ఏమిటి? కీలకమైన సభా కమిటీలలోనే కాదు, అడుగడుగునా పాలిటిక్స్ చేయడమేమిటి?
‘కష్టపడే వారికే టికెట్లు, షో చేసేవారికి కాదు’ అని చంద్రబాబు అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఆత్మ గౌరవ సభలు రాష్ట్రమంతటా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక పక్కన రెండు మూడు పాదయాత్రలు తెలంగాణలో క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడేమి చెబుతారో, ఎప్పుడేమి చేస్తారో, ఎన్ని మాటలు మారుస్తారో తెలియక జనం జుట్టుపీక్కుంటుంటే తెరాస, కాంగ్రెస్ నుంచి పాతిక మంది టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ ఛుగ్ అన్నట్లు కూడా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ముందుగానే ఎన్నికల వాతావరణం వచ్చింది. ఇది జనం చావుకొచ్చింది.
ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ అధికార, విపక్ష నేతలు సభలు సమావేశాల్లో, టీవీ చర్చల్లో, పార్లమెంట్- అసెంబ్లీల్లో (అంటే టీవీ కెమెరాలు ఉన్న చోటల్లా) తిట్టుకుచస్తారు గానీ ఒకరి ఇంట్లో పెళ్లిళ్లకు, ఇతర శుభ అశుభ కార్యాలకు మరొకరు వెళ్లి వస్తారని, ఫోన్లో టచ్ లో ఉండి పనులు చక్కబెట్టుకుంటారనేది అబద్ధం కాదు. మనమే బీపీలు పెంచుకుని, వ్యవస్థ పాడైనదని ఏడుస్తుంటాం. లోపల్లోపల ఆత్మీయత, బంధుత్వాలు బాగా ఉండబట్టే వీళ్ళు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పాతరేసి గెలిచిన మర్నాడే కండువా మారుస్తున్నారు, పదవులు అలంకరిస్తున్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
పరమ పవిత్రమైన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిన్న (నవంబర్ 26, 2021) జరిగిన కార్యక్రమాన్ని కూడా విపక్షాలు బహిష్కరించాయి. ఆ సమావేశంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చెప్పినట్లు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఒక కీలక భాగస్వామి. రాజకీయ పార్టీల మధ్య పోటీ శత్రుత్వం కారాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వోన్నత శిఖరమైన చట్ట సభల గౌరవం కాపాడే బాధ్యతను అధికార, విపక్ష సభ్యులు మోస్తూ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేయాలి. లేకపోతే, ఈ రాజకీయాలు మరీ భ్రష్ఠు పట్టి పోతాయి.
ఈ సమస్యకు నా దగ్గర ఒక ఐదు పరిష్కారాలున్నాయి.
1) అధికార- విపక్ష నాయకులు ప్రజా ప్రయోజనం కోసం కలిసే ప్రతి ప్రదేశంలో టెలివిజన్ కెమెరాలు ఉండకూడదు.
2) అన్ని ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి, ఆయన/ ఆమె సమీప ప్రత్యర్థి, మూడో స్థానం పొందిన నాయకుడు కలెక్టర్ సమక్షంలో ప్రతి నెలా కలిసి తమ ప్రాంతంలో సమస్యల గురించి విపులంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే ఒక ప్రత్యేకమైన ఏర్పాటుచేయాలి. ఇలాంటి మీటింగ్స్ బహిష్కరించే నాయకులు వచ్చే ఎన్నికల్లో పాల్గొనకుండా నిబంధన ఉండాలి.
3) చట్ట సభల్లో మతి భ్రమించి సభ్యతా సంస్కారం లేకుండా నోటికొచ్చింది మాట్లాడే వారిని సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించేందుకు సివిల్ సొసైటీ ప్రముఖులతో కూడిన ఒక నిష్పాక్షిక కమిటీని నిత్యం సభా కార్యక్రమాల పర్యవేక్షణకు నియమించాలి.
4) పనితీరు ప్రాతిపదికన నాయకులకు ప్రతి పౌరుడు ప్రతి మూడు నెలలకొకసారి రేటింగ్ ఇచ్చే విధానాన్ని వ్యవస్థీకృతం చేయాలి.
5) ఎన్నికలకు సంవత్సరం ముందుదాకా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ కార్యక్రమాల మీద మాత్రమే మాట్లాడాలి. తప్పులను ఎత్తి చూపుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే న్యాయపోరాటం చేయాలి తప్ప మాటిమాటికీ రాజీనామా డిమాండ్లతో యాగీ చేస్తూ ప్రభుత్వాలను పనిచేయనివ్వకుండా విసిగించకూడదు.
.. డాక్టర్ ఎస్.రాము
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం బోధకుడు

.
Discussion about this post