సినిమా అంటేనే పెద్ద కలర్ ఫుల్ కంగాళీ డ్రామా. దక్షిణాది ప్రేక్షకుల మెదళ్ళకు రాజకీయాల కన్నా బాగా ఎక్కి కిక్కు ఇచ్చి రచ్చరచ్చ చేస్తున్నవి సినిమాలు మాత్రమే. మనోళ్లకు కథానాయకులు, నాయికలు దేవుళ్ళ కన్నా ఎక్కువ. తెర మీద కనిపించే వాళ్ళు దివ్యలోకాల నుంచి దిగివచ్చిన స్పెషల్ కాటగిరీగా ఈ జనం నమ్ముతారు.
కొందరు హీరోల మాటలు వేదం. హీరోయిన్లు షాపుల ఓపెనింగ్ కు వస్తే సొల్లు కార్చుకుంటూ ఎగబడి మరీ చూస్తారు. అభిమానం ఒక సుమధుర భావన అయితే, ఈ తరహా వీర ఆరాధన ఒక పిచ్చ, జబ్బు, గబ్బు! ఫిలిమ్స్ ప్లస్ పాలిటిక్స్ ఈజ్ ఈక్వల్ టు బీభత్సం, భయానకం, వికృతం, ఉన్మాదం. అందుకే ఈ ఈక్వేషన్ మనదగ్గర బాగా పండింది. జనం కోసం స్వచ్ఛంగా, చచ్చిందాకా పనిచేసిన నికార్సైన నాయకులు సైతం హీరో ఎంట్రీ తో జీరో అయిపోయి బోర్లాపడ్డారు. సినిమా హవా లాంటిది మరి.
సినిమా అంటేనే అతి చేయడం. ఎగ్జాగరేషన్ అన్నదే ఇందులో పెద్ద సూత్రం. చాలా మంది కండల వీరులను బక్కపలచ హీరో తుక్కురేగ కొట్టడం, అత్తమ్మతో మాట్లాడటానికి ఐదు నిమిషాల్లో రైల్వే స్టేషన్లో జనం లేకుండా చేయాలంటే చేసిపారేయడం వంటివి ఇందులో మామూలే.
వినోదం పేరుతో, సృజనాత్మకత ముసుగులో సమాజాన్ని గబ్బుపట్టించడంలో తమవంతు పాత్ర ఘనంగా పోషిస్తున్న తెలుగు సినిమావాళ్ళు ఒక పదిహేను ఇరవై రోజులుగా తిక్కరేగి చేస్తున్న ప్రకటనలు పరమ రోతగా, సభ్యసమాజం సిగ్గుపడేలా అసహ్యంగా ఉన్నాయి ఇప్పుడు.
కరోనా క్రిమి రెండు విడతలుగా ఎడాపెడా కుమ్మి కుదేలు చేశాక, మూడో విడత లేదని అర్థమయ్యాక ఆగస్టులో కొంత ప్రశాంత పరిస్థితి ఏర్పడింది. సాధారణ వాతావరణం ఇంకా పూర్తిగా ఏర్పడక ముందే, జనం ఇంకా షాకు నుంచి కోలుకోకముందే.. జరిగిన నాలుగు పరిణామాలు పిచ్చెక్కిస్తున్నాయి. ఒకటి- డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల గ్రిల్లింగ్, రెండు- ‘మా’ ఎన్నికలు, మూడు- పవన్ కళ్యాణ్ ప్రసంగం-ప్రతిస్పందనలు, నాలుగు- అక్కినేని వారింట్లో మరో పెళ్లి పెటాకులు కావడం.
ఒకటి రెండేళ్ల కిందటి డ్రగ్స్ కేసులో తాజాగా సినీ ప్రముఖులను ప్రశ్నించడంతో హడావుడి మొదలయ్యింది. ఇది పాత కేసే గానీ ఇప్పుడు ఎందుకు హడావుడి జరుగుతున్నదో జనాలకు అర్థం కావడం లేదు. విచారణలో ఉన్న ఈ సున్నితమైన కేసు మీద వ్యాఖ్యలు చేయకుండా వదిలేయడం మంచిది. ఇక రెండో అంశం, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు. ప్రతి రెండేళ్ళకొకసారి జరిగే ఈ ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో జరుగుతున్నాయి.
ఆ పోటాపోటీ మాటలు, హామీలు, వ్యూహప్రతివ్యూహాలు శృతిమించి గార్ధభ రాగాన పడుతున్నాయి. సినిమాల్లో ఆరేడు తరాలకు సరిపడా సంపాదించిన వాళ్ళు పెద్ద సంఖ్యలోనే ఉన్న ఈ రంగంలో చిన్న చిన్న టెక్నీషియన్స్ను, చితికిపోయిన వాళ్ళను ఆదుకున్నది పెద్దగా లేదు కానీ ‘మా’ ఎన్నికలు అనగానే మంచి కాకపుట్టిస్తారు. ప్రతి సారీ ఈ రచ్చ ఉండేదే కానీ త్వరలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సినీ కళాకారుల సంఘం ఎన్నికలకు ప్రాముఖ్యత ఏర్పడింది-తెరవెనుక పాలిటిక్స్ మూలంగా.
పాత సంఘం మీద ఒకరిద్దరు చేసిన వ్యాఖ్యలు సీక్రెట్ ఆడియోల రూపంలో బయటపడడం, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒక ప్యానల్ తో ముందుకురావడంతో ‘మా’ వ్యవహారం ఊపందుకుంది. ఒక అరడజను దాకా నటులున్న మెగాస్టార్ కుటుంబం అందండలు ఉన్నాయని అనుకున్న ప్యానల్లో నటి-నిర్మాత జీవిత ఉన్నారు. ఈ లోపు, ఆమె ఒక్కతే తనకు నచ్చలేదంటూ మెగా వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్ బైటికొచ్చి టెలివిజన్ ఇంటర్వ్యూ లలో తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసిరి రక్తికట్టించారు.
తను ఒంటరిగా రంగంలో ఉంటానని, ఒక వంద డబల్ బెడ్ రూమ్లు పేద కళాకారుల కోసం కట్టిస్తానని, హీరోలతో ప్రోగ్రామ్స్ చేయించి రెండు మూడు గంటల్లో పాతిక కోట్లు తేవడం తనకో లెక్క కాదని ఆయన చెబుతుండగానే, మరో సీనియర్ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు మరో సినీ-పొలిటీషియన్ బాబూ మోహన్ వంటి వారితో తన ప్యానల్ ప్రకటించడం వేడిని పెంచింది. మరో వారం రోజుల్లో జరిగే 2021-23 కార్యవర్గం కోసం మొత్తం 26 మందిని ఎన్నుకోవాల్సి ఉండగా 56 మంది రంగంలో ఉన్నారు. ఇంత హడావుడి చేసిన గణేష్ పోటీ నుంచి తప్పుకోవడం సినిమా ట్విస్టు. తప్పుకునేలా తనకు మార్గదర్శనం చేశాడని ఆయన చెప్పుకున్న దేవుడు లేదా దైవసమానుడు ఎవరో మరి?
రైల్వే టికెట్స్ మాదిరిగాఒక పోర్టల్ ద్వారా సినిమా టికెట్స్ తనే అమ్మాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్న సమయంలోనే వినాయక చవితి సమయంలో మెగా కుటుంబంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం పెద్ద చర్చకు దారి తీసింది. స్పోర్ట్స్ బైక్ మీద వేగంగా వెళ్తూ జారిపడి స్పృహ తప్పి సాయి ధరమ్ తేజ ఆసుపత్రిలో చేరారు. సరిగ్గా అదే సమయంలో అత్యాచారానికి-హత్యకు గురైన ఆరేళ్ళ గిరిజన బాలిక కన్నా హీరోకు ఎక్కువ కవరేజ్ ఇచ్చారని బాధితుల కుటుంబీకులు ఆసుపత్రి దగ్గర కూడా ఆగ్రహం ప్రదర్శించారు. అటు ‘బాహుబలి’ హీరోగానీ, ఇటు ‘రాఖీ’ హీరో గానీ బాధితురాలి కుటుంబీకులను పరామర్శించలేదని కూడా వాళ్ళు ఆవేదన తెలిపారు.
అవినీతిపై పోరాడిన అధికారిగా సాయి ధరమ్ తేజ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో అసలు సిసలైన సినీ-రాజకీయ దుమారం మొదలయ్యింది. తనపై కక్షతో జగన్ ప్రభుత్వం మొత్తం సినీ పరిశ్రమను శిక్షిస్తున్నదని అనడమే కాకుండా తన సామాజిక వర్గానికి చెందిన మంత్రిని సన్నాసి అంటూ తనదైన శైలిలో పవన్ రెచ్చిపోయి గబ్బులేపారు. మరో సీనియర్ కారెక్టర్ నటుడు పోసాని కృష్ణ మురళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ‘కడుపు మండి’ చేసిన ప్రకటనలు వినోదాన్ని పంచుతూనే జనాలను విస్మయానికి గురిచేశాయి.
రచయిత కూడా అయిన పోసాని నోటికి అడ్డూ అదుపూ ఉండదు. ఈ సారి అది మరీ శృతిమించింది. తన భార్య పై జనసేన కార్యకర్తలు చేసినట్లుగా చెబుతున్న అసభ్య ఆరోపణలతో అయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘కడుపు చేసి’ డబ్బులిచ్చారు.. అంటూ పోసాని చాలా తేలిగ్గా అంటే, మరొక మాజీ టీవీ యాకర్ ఎవరికి కడుపు చేసిందీ ఒక ఆడియోలో చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద విసిరిన ఆడియోల గురించి రాయడం కుదరదు. కడుపులు చేయడం గురించి కూడా ఆమె కుండలు బద్దలు కొట్టారు.
ఈ మసాలా చాలనట్లు, అక్కినేని కుటుంబంలో ఎన్నాళ్ల నుంచో నానుతున్న ఒక విషయం నిన్న ఒక కొలిక్కి వచ్చింది. అక్కినేని నాగార్జున మొదటి వివాహం కుమారుడు నాగ చైతన్య, మరో ముద్దుల నటి సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరి వైవాహిక జీవితం గురించి చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మూడు రోజుల కిందట వీటిని ఖండించిన సమంత తాము విడిపోతున్నట్లు ప్రకటించి సంచలనమ్ సృష్టించారు. దసరా పండగ అంతా దీనికి సంబంధించిన ఊహాగానాలు, వార్తలతో కాలక్షేపం ఖాయమయ్యింది.
సినీ ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలను మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా సోషల్ మీడియా ప్రభావశీలంగా ప్రసారం చేస్తున్నాయి. వార్తలు, వ్యాఖ్యలు, విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు నిరాఘాటంగా సాగుతున్నాయి. ఓరి నాయనా.. కాస్త నాలుక అదుపులో పెట్టుకుని మాట్లాడండని చెప్పడం, వేదిక ఉందని ప్రతి చెత్తా సామాజిక మాధ్యమాల్లో పెట్టి కంపు చేయవద్దని కోరండం అత్యాశే అవుతుంది.
.. రాము సూరావజ్ఝల
సీనియర్ పాత్రికేయులు

ఇవి కూడా చదవండి :
వేదనలో సమంత.. లొకేషన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న వైనం
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
.

Discussion about this post