‘భక్తుల్లో అపోహలు కల్పించవద్దు’ అని టీటీడీ పేర్కొంది. తిరుమల ఆలయం ఫోటోను సంబంధం లేని వార్తకు జత చేస్తూ భక్తులు భయపడేలా ప్రచురించిన కథనాన్ని టీటీడీ అధికారులు ఖండించారు.
మీడియా చాలా సందర్భాల్లో అతి చేస్తుంటుంది. ఒక సంఘటన జరిగితే.. దాని తీవ్రతను పెంచి చూపడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా ఎక్కువ మంది పాఠకుల దృష్టిని ఆకర్షించవచ్చు అనుకుంటుంది. ఇలాంటి పెడపోకడలు ఇటీవలి కాలంలో చాలా సాధారణంగా మారాయి. అయితే ఇలాంటి తప్పుడు అలవాట్లు.. టీటీడీ కలుగచేసుకునే దాకా రావడమే విశేషం.
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఈ కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫోటో జత చేశారు.
ఇలా చేయడం సరైంది కాదు. ఆ కథనానికి, ఫోటో కు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఫోటోలు ప్రచురించి భక్తుల్లో అపోహలు రేకెత్తించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై జరిగిన ప్రచారం కూడా వాస్తవం కాదు.తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకొనే పరిస్థితి ఉంది అని టీటీడీ అదికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
.