అకాల మరణం పొందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించాలని, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్ టి యు) చిత్తూరు జిల్లా శాఖ, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ను కోరింది.
బుధవారం ఉదయం ఎస్టీయు చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కడియాల మురళి, జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గంటా మోహన్ తదితరులు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు ను వికోట లోని వారి స్వగృహంలో కలిసి వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అకాల మరణం పొందిన టీచర్ల కుటుంబ సభ్యులకు నియామకాలు కల్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలు ఉన్న ఏ శాఖలోనైనా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులకు సవరణలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పాఠశాలల్లో ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అత్యవసర పనులకు సెలవులు పెట్టాలన్నా టీచర్లు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఖాళీ పోస్టులలో వెంటనే విద్యావలంటీర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు.
పాఠశాలల్లో వివిధ యాప్ లు, ఫోటోలు అప్ లోడింగ్, సమాచార సేకరణ, బోధనేతర పనుల వలన బోధనకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లను పూర్తిస్థాయిలో బోధన కే పరిమితం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నూతన విద్యా విధానం అమలులో లోపాలను సరిదిద్దే విధంగా చొరవ చూపాలని కోరారు.
రాష్ట్రంలోనే మొట్టమొదట గుర్తింపు పొందిన సందర్భంగా 75 సంవత్సరాల ఉద్యమ చరిత్రతో వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఎస్ టి యు నేపథ్యాన్ని వివరించారు
జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు స్పందిస్తూ ఉపాధ్యాయులు అంటే తమకు అమితమైన గౌరవం ఉందని ఉద్యోగ ఉపాధ్యాయులకు సంతృప్తి కలిగే నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
కారుణ్య నియామకాల విషయంలో ఉన్నత అధికారులతో చర్చిస్తానని తెలిపారు. ఎస్టియు ఉద్యమ చరిత్ర ఘనమైనది అని ప్రశంసించారు.
కార్యక్రమంలో ఎస్టియు నాయకులు దండు అమర్నాథ్ ,ఇలియాస్, సుధాకర్ , రవి, వినోద్, తారకనాధ్, అనిల్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post