రాజకీయ దూషణలు తొలుత విధానాల మీద ఉండేవి. తర్వాత అవి నిజాయితీ- అవినీతి మీదకు, నెమ్మదిగా వ్యక్తిత్వం మీదకు, వ్యక్తి స్వరూప స్వభావాల మీదకు మళ్లాయి. ఇప్పుడు ఆ దూషణలు ప్రత్యర్థి నాయకుడి నట్టింట్లోకి, పడకింట్లోకి కూడా దూరిపోయి.. కుటుంబసభ్యులందరినీ కలిపేసుకుంటే నీచమైన నయారూపు సంతరించుకుంటున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో నాయకులు వాడుతున్న పిచ్చి మాటలు తట్టుకోలేక తెలుగు భాష సిగ్గుతో తలవంచుకుంటున్నది, తీవ్రత భరించలేక బూతులు ఉరేసుకుంటున్నాయి. భరించలేకుండా ఉన్నాం, నోటికొచ్చింది వాగకుండా.. ప్రసంగాలు రాసుకొచ్చి చదవండ్రా నాయనా…అని రాజకీయ నేతలను అభ్యర్థిస్తూ సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్.రాము రాసిన వ్యాసం.
‘నా కొడకా…’
ఈ నాలుగక్షరాల మాట వాడినవాడిని ఓ నాటు, మొరటు రకమైన వాడిగా చూసేవారు- మొన్నీమధ్య వరకూ. సభ్యతా సంస్కారాలు, మంచీమర్యాద ఉన్న ఎవ్వరూ దీన్ని బహిరంగంగానైతే అస్సలు వాడేవారు కాదు. తెగబలిసిన మోతుబరి- బలహీనుడైన రైతుకూలీని పొలాల్లో ఒళ్ళు కొవ్వెక్కి అనే మాటది. పల్లెల్లో కుల దురహంకారంతో సన్నజాతి మనుషులపై చిన్నచూపుతో కటువుగా ఉండే దురహంకార్లు తిట్లపురాణంలో ప్రతి పిచ్చి తిట్టుకు ముందూ వెనకా వాడే మాటది. అక్కడా ఇక్కడా విని ఇదేదో మామూలు తిట్టనుకుని చెత్తకుప్పలో ప్లాస్టిక్ ఏరుకుని అమ్ముకునే వాళ్ళు కోపాన్ని ప్రదర్శించడానికని మాటిమాటికీ వాడే మాటది.
ఒక నోరు, అందులో కదలాడే ఒక నాలుక, దాన్ని అడ్డగోలుగా ఆడించే కోపం, కసి, ఈసడింపు వంటి మనోవికారాల వల్ల ఎవరైనా బుర్రలేకుండా వాడినా మర్యాదస్థులు తిరిగి ఉచ్ఛరించడానికి అస్సలు ఇష్టపడని మాటది.
ఏ వెర్రివెధవైనా, సంస్కారహీనుడైనా ఈ మాట వాడితే వాడు ఎదుటి మనిషిపై మానసిక, సాంస్కృతిక దాడి చేసినట్లు.
ఏ నీచుడైనా, కుసంస్కారైనా ఈ మాట వాడితే వాడు మన కుటుంబ వ్యవస్థను కించపరిచినట్లు.
ఏ దొంగ సచ్చిన దరిద్రపు తింగరి చుప్పనాతి వెధవైనా ఈ మాట వాడితే ఒక మహిళ శీలాన్ని శంకించినట్లు, లింగ వివక్షను బైటపెట్టుకున్నట్లు.
‘నీ యమ్మ’ అన్నదే దారుణమైన మాటైతే, ఈ నోటిదూలగాళ్లు ప్రజాక్షేత్రంలో పబ్లిగ్గా సిగ్గూఎగ్గూ లేకుండా లూజ్గా, కాజువల్గా ‘నా కొడక’ అంటున్నారు- మాటిమాటికీ. అనేవాడికి ఎలాగూ బుద్ధీ శుద్ధీ లేవు. ‘ఇంతటోణ్ణి నన్నే పట్టుకుని ఇంత పెద్దమాటంటావా?’ అని ఒక్కడూ అందుకు అభ్యంతరం చెప్పట్లేదంటే ఈ వెర్రిమొర్రి బుర్రతక్కువ వెధవలు ఇదో తేలికపాటి తిట్టని తీసుకుంటున్నట్టే కదా, హతవిధీ!
ఒరేయ్ నాయనా.. నీ తెలివి తగలబడ. అది మైకుల ముందు వాడదగిన మాట కాదురా నాయనా. అది తిట్టు కాదు, ఒక బూతు. నాగరిక సమాజంలో వాడకూడని మాట. అశుద్ధం, నిషిద్ధం. నీకు ఎవడిమీదనో కోపమొస్తే వాడితో తేల్చుకోకుండా ఇంట్లో ఉన్న వాడి అమ్మ గురించి అనడం నీ చేతకాని పుండాకోరుతనం. ‘నీ అయ్య’ అనకుండా ‘నీ అమ్మ’ అంటున్నావంటేనే నవమాసాలు మోసి, ప్రాణాలు పణంగా పెట్టి కని, కంటికి రెప్పలాగా చూసుకుని, కష్టపడి పెంచిన మనిషిని బజారు మాటల్లోకి ఈడ్చి మానసికంగా దెబ్బతీయాలనే చీప్ ట్రిక్, కుట్ర ఉన్నాయి. నువ్వీ మాట మరొకడిని అన్నా, నిన్ను ఎవడైనా అన్నా అది దారుణం, అమానుషం. బాబులారా.. ‘నీ యమ్మ’ అమ్మమ్మ అయిన ‘నా కొడక’ వాడకం ఆపండ్రా నాయనా.. రోజూ వినలేక సిగ్గుతో ఛస్తున్నాం.
జనసామాన్యం పదేపదే వాడడం వల్ల పదాలు వాడుకలోకి వచ్చి నలిగి నలిగి స్థిరపడిపోతాయి. సగం సంకరజాతి పదాలను ఈ డబ్బుపిచ్చి సినిమావాళ్లు సృజనాత్మకత పేరిట సృష్టించి సినిమాల్లో బాగా వాడి తెలుగులో స్థిరపడిపోయేలా చేశారు. ఇప్పుడు ఆ ‘సొగసైన’ పద సంపదను అమాంతం పెంచే బాధ్యతను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు (రానాలు) తమ భుజస్కంధాలపైకి ఎత్తుకుని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ‘చవటలు,’ ‘సన్నాసులు,’ ‘దద్దమ్మలు,’ ‘రాక్షసులు,’ ‘లఫూట్లు,’ ‘లుచ్ఛా,’ ‘బేవకూఫ్’ వంటి మాటలు ఒకరకంగా సరేగానీ, అనాలోచితంగానో, ఆర్థంతెలియకనో నాయకులు తేలిగ్గా వాడుతున్న పదాలు నాగరికులకు ఇబ్బందిగా అనిపిస్తున్నాయి.
ముదురు నేతలే కాకుండా, మహిళా నేతలూ ‘ఏమి పీకుతున్నారు?’, ‘ఏమి పీక్కుంటారో పీక్కోండి’ అని ఫ్లోలో అంటున్నారు. ‘పీకుడుగాడు’ అన్న పదం కూడా తరచూ వినిపిస్తోంది కానీ దాని అసలు అర్థం ఏమిటో? ‘వాడికి మ్యాటర్ లేదు’ అనీ తేల్చేస్తున్నారు. సరుకు (మేథో శక్తి) లేదు అంటే అర్థం చేసుకోవచ్చుగానీ, మ్యాటర్ అనే పదం వాడి ఇంకేదో అసమర్థతను బైటపెడుతున్నట్లు అర్థమొచ్చేలా మాట్లాడి ఇజ్జత్ తీయడం ఉద్దేశంలా ఉంది. ‘రానా’ల నోళ్ళలో రోజూ నానే ప్రశ్న.. ‘మగతనం ఉందా?’ అనేది. అటు మ్యాటర్ గానీ, ఇటు మగతనంగానీ ఉందీ లేనిదీ బహిరంగంగా నిరూపించుకోవాల్సిన విషయాలా? ఇవి గొప్పతనానికి లేదా ధైర్యసాహసాలకు పెద్ద ప్రతీకలా? పైగా, పందులుబొర్లే ఈ ఆధునిక మురికిగుంట రాజకీయాల్లో ఉండడానికి ‘మగతనం’ అసలెలా ఒక అర్హత అవుతుంది? మగతనానికి, ధైర్యానికి, రాజకీయ చతురతకు అసలు లింకు ఏమిటి? వీళ్ళ దృష్టిలో మగతనం అంటే ఏమిటి? దాన్ని నిరూపించుకునే వెసులుబాటు ఈ శుంఠలు కల్పిస్తారా?
‘ఇక్కడెవరూ గాజులు వేసుకుని లేరు,’ అని మాటిమాటికీ ప్రకటిస్తారీ రానాలు. గాడిద కొడకా.. అని ఒకడు మరొకడ్ని అంటే విని ఒక గాడిద ఏడ్చిందట.. ‘అయ్యో… ఇంత పనికిరాని చచ్చు పుచ్చుగాడు నా కొడుకా?’ అని. అట్లా ఉంది వ్యవహారం. అక్కలు, చెల్లెళ్లు చక్కగా ధరించి ముచ్చటపడే చూడ ముచ్చటైన మంచి రంగురంగుల గాజులను చెత్త రాజకీయ ప్రస్తావనల్లోకి తెచ్చి కించపరచడం అభ్యంతరకరం, ఒకటి. రెండోది- మగతనాన్ని సామర్ధ్యానికి చిహ్నంగా ఎలా భావిస్తున్నారో తెలీకుండానే గాజులను చేతగానితనానికి మారుపేరుగా వాడుతున్నారు మూర్ఖులు. గాజుల పవిత్రతను కంపు నోళ్లతో, నీచపు మాటలతో దిగజార్చడం అభ్యంతకరం. అలాగే, జులాయిలా తిరుగుతూ ఇష్టంవచ్చినట్లు మాట్లాడే వాళ్ళను అనుకుంటా.. ‘లంగాలు’ లేదా ‘లంగా గాళ్ళు’ అని కూడా తెలంగాణ లీడర్లు పదేపదే అంటారు.
చిల్లరగాళ్లే అయి ఉండొచ్చు గాక, లంగాలతో పోల్చడం సందర్భోచితమా? ‘ఒక అబ్బకు అమ్మకు పుట్టినోడివైతే..’ అన్న మాట కూడా తరచూ వినిపించేదే. అమ్మ, నాన్నలను వీళ్ళ చెత్త రాజకీయంలోకి తేవడం ఎందుకు? ఆ మధ్యన ఆంధ్రాలో ఒక తెలుగుదేశం నాయకుడు ‘బోసెడీకే’ అని అధికార పార్టీని రెచ్చగొట్టి కేసుపాలయ్యాడు. తల్లిని కించపరిచే ఘోరమైన అర్థం దానికున్నదన్న ప్రచారం జరిగింది. అప్పట్లో వెధవ అనేది పెద్ద తిట్టు. తిట్టు తిని కోపగించుకున్నవారిని అనునయించేందుకు అదొక దీవెన అన్న కలర్ ఇస్తూ.. దానర్థం ‘వెయ్యేళ్ళు (వె) ధనముతో (ధ) వర్థిల్లు (వ)’ అని చెప్పేవాళ్ళు. విధవ కు పుల్లింగం వెధవని భావిస్తూ వాడుతున్న వాళ్ళు కొందరైతే, తిట్టుగా వినసొంపుగా ఉందని అర్థం తెలియకపోయినా వాడేవాళ్లు మరికొందరు.
నిజానికి, బూతుల దగ్గరికి వచ్చేసరికి కమ్యూనిస్టులు ఉత్తములు. ఆచితూచి మాట్లాడతారు. మాజీ ఐ ఏ ఎస్ అధికారి, లోక్సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ గారికి ఈ విషయంలో ఫస్టు మార్క్. బూతులు వాడకుండా, సంసార పక్షంగా ఉండడం వల్లనే అటు కామ్రేడ్లు, ఇటు లోక్సత్తా కుదేలయ్యాయన్న ఒక థియరీ నమ్మి కొత్తగా వచ్చిన మాజీ ఐ పీ ఎస్ అధికారి, బీ ఎస్ పీ నేత డాక్టర్ ప్రవీణ్ కుమార్ బూతుబాట పట్టే రకం కాదు, అదృష్టవశాత్తూ.
హుజూరాబాధలో ఉన్న అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పాత ఫామ్ లోకి వస్తుంటే భయమేస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆత్మగౌరవం పేరుతో బండబూతులు తిడుతూ మాట్లాడారు, పాటలు కట్టారు. గుండెలు మండుతున్నాయని చెప్పి నోటికొచ్చింది మాట్లాడారు. మళ్ళీ చాన్నాళ్లకు ఉద్యమించడానికి, తిట్టడానికి ఒక శత్రువు దొరికినట్లయింది- వడ్లు కొనని మోడీ ప్రభుత్వ రూపంలో. సినిమా ఇప్పుడే మొదలవుతుందనిపిస్తోంది. జనం చచ్చారే!
ఇవి కూడా చదవండి :
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
ప్రత్యర్థులను ఎకసెక్కపు ఎత్తిపొడుపులతో, వినసొంపైన మాటలతో, జోరైన విమర్శలతో కైమా కొడుతూ ఖూనీచేసే మాటల మరాఠీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయన కోపంతో పూనుకుంటే గూబలు గుయ్యుమనాల్సిందే. ‘కుక్కలు’ ‘నక్కలు’ వచ్చేస్తాయి. ‘ఆడొకడు ఈడొకడు మోపయ్యాడు’ అని విమర్శకులను సుతిమెత్తంగా అంటూ వస్తున్న అయన ఈ మధ్యన రెండు ప్రెస్ కాన్ఫరెన్స్లలో ట్రైల్ పార్ట్ చూపించారు. రెచ్చగొట్టే పరుష పదాలు జనరంజకంగా వాడడంలో ఆయనే ఆద్యుడన్న కీర్తి మూటగట్టుకున్నారు.
అందుకే, వైరి నేతలూ తమ ఆది గురువు ఆయనేనని మొహమాటం లేకుండా విన్నవించుకుంటారు. నిజానికి కేసీఆర్ గారి ఫేవరెట్- సన్నాసులు. ‘సన్యాసం’ నుంచి వచ్చిన ఈ పదం నిజానికి గొప్ప మానసిక పరివర్తనకు నిదర్శనం. జనం ఛీకొట్టాక, అధికారం పోయాక, కేసులు ముసురుకున్నాక వచ్చే వైరాగ్యం కన్నా, అధికారం మిథ్య- జగం మిథ్య- జనం మిథ్య అన్న స్పృహ ముందుగా కలిగి కృష్ణా, రామా అనుకుంటూ ఉండే బుద్ధిజీవులను సన్నాసులని అనవచ్చుగానీ జగ ముదుర్లయిన రానాలకు సన్నాసులు అన్న మాట నప్పదేమో!
యువనేత కేటీఆర్ కూడా ఈ మధ్యన నోటికి గట్టిగా పనిచెబుతున్నారు. ఇరుకున పెడుతున్న ప్రత్యర్థి ని ఎన్నుకున్నందుకు ఓటర్లను ‘మహానుభావులు’ అని దండం పెట్టారు టెకీ సారు. ‘జాతి రత్నాలు’ లాగా ఈ మాటతో తిట్టినట్టా? మొట్టినట్టా? అయన నయం, అప్పుడప్పుడూ మైకుల ముందుకువచ్చే కొన్ని గులాబీ చిలకలు భాషను ఎడాపెడా బాదేస్తుంటే బాధేస్తుంది.
‘ఒరేయ్… తురేయ్’ భాషా ప్రవీణులు బీజేపీ, కాంగ్రెస్ లలో రోజురోజుకూ పెరిగిపోతున్నారు-ప్రమాదకర రీతిలో. ఆర్ ఎస్ ఎస్, బీజేపీ నాయకుల సిద్ధాంతాలు ఎలా ఉన్నా, ఆ నేపథ్యం గలవారు కాస్త మర్యాదగా మాట్లాడతారని భావించేవారు- గతంలో. కొత్త నేతలు చెత్త చెత్త చేస్తున్నారు. అధ్యక్షుడు బండి సంజయ్ వారు ధడధడా మాట్లాడేది సగం అర్థంకాదు. మిగిలిన సగం ‘మీ అంతు చూస్తాం’ టైప్. మరొక ఎంపీ ధర్మపురి అరవింద్ నోటికి పగ్గాలు ఉండవు. ‘వెధవన్నర వెధవ.. అరేయ్, ఒరేయ్.. తాగుబోతు..’ అంటూ వీడియాలు వదులుతుంటే వెగటు కలుగుతుంది. వాళ్ళ డాడీ చాలా చాలా బెటర్. తిట్ల పురాణంలో తండ్రి కేసీఆర్ కన్నా కొడుకు (కేటీఆర్) నయం అనుకుంటే, ఇక్కడ కొడుకు అరవింద్ కన్నా తండ్రి (శ్రీనివాస్) బెటర్. తెలంగాణ కాంగ్రెస్ అధిపతి రేవంత్ రెడ్డి ప్రవాహం- ముందు నుంచీ ముక్కుపుటాలు బద్దలు చేసేదే. నోటికి ఏదొస్తే అదే! మందూమాకూ అలవాటు గురించి అరవింద్, రేవంత్ పదేపదే చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానిని ఈ విషయంలో కొట్టే మొనగాడు పుట్టే అవకాశం లేదు. ఆయనకే ఒలింపిక్స్ గోల్డ్. అంతలా లీనమై ధారాళంగా గంగా ప్రవాహంలా తడుముకోకుండా నాన్ స్టాప్ గా తెలుగు దేశం అధిపతిని ‘చీరేసే’ దమ్మూ ధైర్యం, సంస్కారం అయన సొంతం. ‘మానుభావుడు అన్నగారిని వెన్నుపోటు పొడిచినందుకు దేవుడు నీకు విధించిన శిక్ష ఈ పప్పుసుద్ద లోకేష్ బాబు,’ అని మంత్రిగారు బాబును కుమ్మితే, లోకేష్ కు ఎవరివో పోలికలు ఎలా వచ్చాయని వంశీ మరీ దిగజారి అంటున్నారు. ‘భార్యను చూసుకోలేనేడు దేశాన్ని చూసుకుంటాడా?’ అని చంద్రబాబుకు ఆ మధ్య డౌట్ వచ్చింది. ఈ మధ్యన లోకేష్ కూడా తాను నాని అంటున్నట్లు పప్పు కాదని, నిప్పని నిరూపించుకునే పనిలో పడి గట్టి మాటలే వాడుతున్నాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయసాయి రెడ్డి, తిరుగుబాటు ఎంపీ రఘురామ రాజు కూడా ఉచితానుచితాలను పట్టించుకోవడం పట్ల ఆసక్తి కనబరిచే అవసరం లేదని నమ్మే రకాలు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు మీద జగన్ నోరు పారేసుకోవడం, కొన్నిసార్లు కొందరి మీద జనసేనాని రంకెలేయడం చూశాం. ఒక పోసాని కృష్ణమురళి, ఒక మల్లా రెడ్డి లాంటి మహనీయుల భాషణ భూషణాలను చూస్తే అవాక్కవడం జనం వంతవుతోంది. ‘అది నోరా? సెప్టిక్ ట్యాంకా’ అన్న గలీజు మాట ఎందుకు పుట్టిందో అపుడపుడూ అర్థమవుతుంది. మొత్తంమీద, తెలుగు నాయకులు ఎన్నికలు దగ్గరయ్యేకొద్దీ దుర్గంధాన్ని, దుర్వాసనను వెదజల్లే అవకాశం పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తున్నది.
ప్రత్యర్థులను పాయింట్ల వారీగా చీల్చిచెండాడం వేరు, బూతులే సిగ్గుపడేలా సెన్స్, సెన్సార్ లేకుండా న్యూసెన్స్ సృష్టించడం వేరు. ఈ గబ్బును పొలిటికల్ మీడియా కొటేషన్లతో పెట్టి యథాతథంగా ప్రచురించడం/ పదేపదే ప్రసారం చేయడం ఇంకో బాధాకరమైన విషయం.
వాడిమీద వీడన్నది, వీడిమీద వాడన్నది ప్రముఖంగా రాసి, చాలాసార్లు చూపి కలాలు కూడా తిలా పాపాన్ని తలో పిడికెడు పంచుకుంటున్నాయి. గతంలో నేతల బూతుపురాణం మరీ ఇంత ఘోరంగా ఉండేది కాదు. నిత్యం అధినేతలను పొగిడేవారు, వైరి నేతల తప్పులను అపుడపుడూ సమయ సందర్భాలను బట్టి విలేకరుల సమావేశాల్లో కడిగేసేవారు. కొన్ని సత్రకాయలు రాజకీయాల్లోకి వచ్చాక, సోషల్ మీడియా ప్రభావం ఈ నేతలకు బాగా అర్థమయ్యాక పరిస్థితి మారింది. ట్విట్టర్, ఫేస్బుక్, యూ ట్యూబ్లలో తిట్టి కొట్టే రానాలు రోజురోజకూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూన్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
‘బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో..’ అన్న బూతు కవి చౌడప్ప మాట నమ్మి నిజంచేస్తున్న రానాల వల్ల భాషకు, సంస్కృతికి, ఆధునికతకు, ప్రజాస్వామ్యానికి చేటు కలుగుతోంది. రానాలకు సిగ్గూ శరం లేవనుకుందాం, మరి జనాలకేమయ్యింది. సెల్లు ఫోనుల్లో సొల్లు వినడానికి అలవాటుపడిన జనాలు నాయకులు బూతులు దోక్కొనే వీడియాలను చూస్తూ రేటింగ్స్ పెంచుతూ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. అంతకన్నా ముఖ్యంగా, చెత్త నాయకులకు అధికారం అప్పగిస్తున్న ప్రజలనే ఈ విషయంలో తప్పుపట్టాలి. సభ్యత సంస్కారం ఉన్న నాయకులను ఎన్నుకోకపోవడం వల్లనే ఇదంతా. పాలిటిక్స్ను ఎంటర్టైన్మెంట్గా భావించడం మూలంగానే ఈ పెంటంతా. ఇవేమి తిట్లని బుద్ధిజీవులు, మేథావులు కూడా ఎలుగెత్తి చాటకపోవడం వల్ల కూడా పరిస్థితి దిగజారుతున్నది.
also read : జగన్.. ప్రభువు ప్రార్థన మిస్ కాకూడదనేనా? లేదా..
‘జగనన్నా ఆగలేం..’ వైఎస్సార్సీపీ ఆశావహుల గగ్గోలు
బద్వేలు ఫలితం నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి?
కోట్ల మందిని ప్రభావితం చేసే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రభుత్వ ముఖ్యులు తిట్లు, బూతులు-పబ్లిగ్గా- వాడితే అది అనుసరణీయం కాబోలని పిల్ల రానాలు చెలరేగిపోతారు. వారి మనసులు చూరగొనేందుకు, ప్రభుభక్తిని నిరూపించుకునేందుకు సహచరులు, అనుచరులు ఇలాంటి పరుషమైన, అభ్యంతరకరమైన పదాలే వాడుతూ మరింత గబ్బుపట్టిస్తారు. సుమధురమైన తెలుగు భాషలో బూతు పంకిలాన్ని చేర్చి అపవిత్రం చేస్తారు.
also read :అద్దె ఇల్లు యజమానుల్ని బెదిరిస్తున్న అధికారులు
కుప్పం వెళ్లే హక్కు చంద్రబాబుకు లేదా?
మంత్రి హరీష్ రావుకు తప్పిన ప్రమాదం
ఇంట్లో పాముల్ని వదలి.. బడా నిర్మాతకు బెదిరింపులు
అయ్యలారా.. రానాలూ! మీ రాజకీయాలు మీరు భేషుగ్గా చేసుకోండి, అందినకాడికి దూసుకోండి, దొరికినకాడికి దోచుకోండి. మీ ఏడుపు మీరు ఏడవండి. మీకు పుణ్యముంటుంది.. నోటికొచ్చింది మాట్లాడి భాష నాణ్యతను దిగజార్చి భ్రష్ఠు పట్టించకండి. సభ్యత, సంస్కారాలను ఇంకా ఖూనీ చేయకండి. మీ పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడితే నిలువరించండి. మైకు చూడగానే తెగ రెచ్చిపోయి సోయి లేకుండా గంగవెర్రులెత్తుతూ మాట్లాడే జబ్బున్న మీరంతా.. మాట్లాడదలుచుకున్నది ముందుగా రాసుకొచ్చి చదవండ్రా నాయనా, ప్లీజ్.
.. డాక్టర్ ఎస్. రాము
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం బోధకుడు

.