తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్నారని, వారితో స్నేహాన్ని అభిలషిస్తున్నారని.. తద్వారా ఇతర ప్రయోజనాలు ఆశిస్తున్నారని ఒక పుకారు పుట్టింది. ఇలాంటి పుకార్లను మొగ్గలో తుంచేయడమే మేలని బాగా తెలిసిన కేసీఆర్.. నేరుగా అలాంటి పుకార్లను ఖండించకుండా.. కేంద్రంపై శివమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలను కూడగట్టుకుని కేంద్రంపై పోరాడడానికి కూడా సిద్ధం అని సంకేతాలు ఇచ్చారు.
కేసీఆర్ తొలినుంచి చాలా స్పష్టంగానే బీజేపీ వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో అధికార పార్టీ బలంగానే ఉండగా.. బలమైన ప్రతిపక్షంగా బీజేపీనే ఉంది. పైగా ముస్లిం ఓటు బ్యాంకు కూడా తెరాసకు పెద్ద బలం. అలాంటిది.. బీజేపీతో పొత్తు, స్నేహం ఏదైనా సరే.. ఆత్మహత్యా సదృశం అవుతుందని కేసీఆర్కు బాగా తెలుసు. అందుకే పుకారు పుట్టగనే ఆయన మరో ఆలోచనలేకుండా, ఆ పుకారుకు విలువ ఇవ్వకుండానే, తన బీజేపీ వ్యతిరేక ధోరణిని తీవ్రస్థాయిలో బయటపెట్టారు.
కేసీఆర్ ఉపరాష్ట్రపతి కాబోతున్నారనేది ఆ పుకారు. సూర్య దినపత్రిక దాన్ని మంచి ప్రాధాన్యంతో ప్రచురించింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తయిన వెంటనే.. ఆ పదవిలోకి వెళ్లడానికి కేసీఆర్ ఆలోచిస్తున్నారనేది సారాంశం. అందుకే బీజేపీతో స్నేహంగా మెలిగే ప్రయత్నంలో ఉన్నారనేది వారి పరిశీలన. రెండు వారాల వ్యవధిలో పదిరోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయడానికి కూడా కారణం ఇదేనని సూర్య పత్రిక అంటోంది.
బీజేపీ ఆశీస్సులతో- కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతారని, ఆయన వారసుడిగా కేటీఆర్ తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి అవుతారని సూర్య కథనం పేర్కొంది. తెరాసలో మరో కీలక నాయకుడు హరీష్ రావు కేంద్ర మంత్రి అవుతారని కూడా అంచనా వేసింది. నిజానికి కేటీఆర్ తర్వాతి సీఎం అని, హరీష్ రావు ఎంపీ అవుతారనే పుకార్లు తెలంగాణ పుట్టిన నాటినుంచి వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వాటికి- కేసీఆర్ ఉపరాష్ర్టపతి అనే పదాన్ని కూడా జోడించి.. సూర్య దినపత్రిక ఒక కొత్త కథనం వండి వార్చింది.
నిజానికి తెరాస దళాలు ఈ ప్రచారాన్ని ఖండించాలి. ఒకవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీతో తలపడుతుండగా.. బీజేపీతో దోస్తీ కడుతున్నట్టు ఇలాంటి ప్రచారం వారికి నష్టం చేస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండిస్తే.. ఆ పుకారును తాము గుర్తించినట్లు, దానికి విలువ ఇచ్చినట్టు అవుతుంది. అందుకే వారు ఆ పనిచేయలేదు.
కేసీఆర్ శాసనసభ సాక్షిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం ద్వారా.. తన వైఖరిని స్పష్టం చేశారు. రాష్ట్రాల అధికారాల్ని హరిస్తున్నారని, పన్నులను లాగేసుకుంటున్నారని, రాష్ట్రాల తరఫున కేంద్రంతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఏ రకంగా ద్రోహం చేస్తున్నదో ఆయన ఏకరవు పెట్టారు.
ఆ రకంగా.. తన గురించి ఒక పుకారు వ్యాప్తిలోకి రాగానే.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అంతకంటె సమర్థంగా దానిని తిప్పికొట్టారని తెరాస శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి :
satire : అర్ధరాత్రి గునపం దరువులు
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.