శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న ద్వాదశి సందర్బంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం జెఈవో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం కలిగేలా, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఆలయ ప్రత్యేకాధికారి డా.రవి, ఏఈవో ధనంజయులు,అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, విజివో మనోహర్, ఆలయ సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
.