జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల మెడపై కత్తి పెట్టింది. వసూళ్ల బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించింది. సంఘమిత్రల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ… సంఘ సభ్యులను ఓటీఎస్ కడతారా…? కట్టరా…? అంటూ వారు నిలదీస్తున్నారు.
కట్టక పోతే ఇకపై రుణాలు మంజూరు చేయమంటూ హెచ్చరికలు చేస్తున్నారు. అంత డబ్బు ఇపుడు లేదంటే మీ బాధ మీరు పడి కట్టాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. తోటి సభ్యుల మధ్య నిలదీస్తుండటంతో మహిళలు అవమానభారంతో కుంగిపోతున్నారు.
1983-2011 సంవత్సరాల మధ్య కాలంలో ప్రభుత్వ సహకారంతో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రిజిస్ట్రేషన్ చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పురపాలక సంఘాల్లో రూ.15వేలు, నగర పాలక సంస్థల పరిధిలో రూ.20వేలు వంతున చెల్లించాలని నిబంధన విధించారు. ఈ సొమ్ము మొత్తం ఒకేసారి చెల్లించాలి.
అందుకే ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ముద్దుగా వన్ టెమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) అనే నామకరణం చేసింది. చిత్తూరు జిల్లాలో ఓటీఎస్ జాబితాలో 4,71,798 మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వం నుంచి రుణం పొంది ఇళ్లు నిర్మించుకున్న వారు 4,08,861మంది. ఇక ప్రభుత్వ భూమిలో సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న వారు 62,927మంది.
ఈ రెండు విభాగాల్లో గురువారం నాటికి 51,574 మంది ఓటీఎస్ పథకం కింద రూ.19.34 కోట్లు చెల్లించారు. జిల్లాలో ఇంకా 4.20లక్షల మంది ఓటీఎస్ కు డబ్బు చెల్లించాల్సి ఉంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ఈ నెల 21న పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఇంతలోగా వీలైనంత మేరకు ఓటీఎస్ పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశించింది.
ఓటీఎస్ పూర్తి స్వచ్చందమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పదేపదే చెబుతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఓటీఎస్ బాధ్యతను మొదట రెవిన్యూ, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు అప్పగించారు. వారు అన్ని పనులు మానుకుని వసూళ్ళ కోసం ఇళ్లిళ్లూ తిరిగారు. అయితే సరైన ఫలితం రాలేదు. దీంతో ప్రభుత్వం తన పంథా మార్చుకుంది.
ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఇళ్లు ఎక్కువ భాగం మహిళల పేరు మీదనే ఉన్నాయి. దాదాపు వీరందరూ వెలుగు, మెప్మాలో సభ్యులుగా ఉంటారు. సంఘాలను పర్యవేక్షించే వారి ద్వారా మహిళలను ఒత్తిడి చేయిస్తే సులభంగా ఓటీఎస్ వసూళ్లు చేసుకోవచ్చని ప్రభుత్వం పన్నాగం పన్నింది. ఇపుడు అదే అమలు చేస్తోంది. ఓటీఎస్ బాధ్యతలను పరోక్షంగా సంఘమిత్రలు, రీసోర్స్ పర్సన్లకు అప్పగించింది. వీరు వలంటీర్ల నుంచి ఓటీఎస్ జాబితా తీసుకుని… సంఘాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటీఎస్ జాబితాలో పేరు ఉన్న సభ్యులను సమావేశంలోనే నిలదీసి అడుగుతున్నారు.
ఈ విషయం బయటకు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమావేశం సందర్భంగా సభ్యుల వద్ద సెల్ ఫోన్లు లేకుండా చూస్తున్నారు. ఒకవేళ సభ్యుల వద్ద సెల్ ఫోన్లు ఉంటే అక్కడే జరిగే విషయాలు ఎక్కడ రికార్డు చేస్తారోననే ఉద్దేశ్యంతో గతంలో ఎన్నడూ లేని నిబంధనలు మహిళా సంఘ సభ్యులకు పెడుతున్నట్లు తెలిసింది. అంటే దీనిని బట్టి ఓటీఎస్ వసూళ్ల కోసం ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నారో అర్థమవుతోంది.
ఓటీఎస్ పూర్తి స్వచ్చందమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పదేపదే చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పేదలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదు. డబ్బు తమ వద్ద లేదని… ఇపుడు కట్టలేమని చెప్పే మహిళా సభ్యులకు బ్యాంకుల నుంచి రుణం తీసిస్తామని సంఘమిత్రలు, ఆర్పీలు చెబుతుండటం విశేషం. ఇలా ఒత్తిడి చేస్తుండటంతో నిరుపేదలు తీవ్ర మానసిక ఒత్తడికి గురవుతున్నారు.
ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఓటీఎస్ కోసం పేదలను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని పలువురు కోరుతున్నారు. పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తే ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుందని కూడా పలువురు అభిప్రాయ పడుతున్నారు.
.