తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో సోమవారం అష్టబంధన మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో నవంబరు 25 నుండి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి.
శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చేందుకు 2020, డిసెంబరు 6 నుండి 10వ తేదీ వరకు బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేశారు.
స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారు. విమాన గోపురం పనులు పూర్తి కావడంతో జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఉదయం శ్రీ వరాహస్వామివారి ఆలయంలో పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర, వేద శాత్తుమొర నిర్వహించారు. ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో అష్టబంధన మహాసంప్రోక్షణ చేపట్టారు. కాగా, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post